Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నూతన ఐపీఎల్ ప్రాంఛైజీపై బీసీసీఐ
ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)కు ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆదరణ, పాపులారిటీని వంద శాతం సద్వినియోగం చేసుకోవటం, భారత క్రికెట్ బోర్డును ఆర్థికంగా మరింత బలోపేతం చేయటమే ప్రధాన లక్ష్యంగా ఐపీఎల్ 2022 నుంచి రెండు నూతన ప్రాంఛైజీల ఏర్పాటుకు ఇటీవల బీసీసీఐ 89వ వార్షిక సర్వ సభ్య సమావేశం ఆమోద ముద్ర వేసింది. కొత్త ప్రాంఛైజీ రేసులో అహ్మదాబాద్ సహా లక్నో, గౌహతి, విశాఖపట్నం, తిరు వనంతపురం, కోచిలు రేసులో ఉన్నాయి. ఐపీఎల్ జట్టుపై ఆదాని గ్రూప్ అధినేత గౌతమ్ ఆదాని గతంలోనే మనసు పారేసుకున్నాడు. ఆర్పీఎస్జీ గ్రూపు చైర్మన్ సంజీవ్ గోయెంకా సైతం ఐపీఎల్ జట్టుపై కన్నేశాడు. కొత్త ప్రాంఛైజీలు ఏ నగరం వేదికగా ఏర్పాటైనా.. ఆ ప్రాంఛైజీలను దక్కించుకునేందుకు ఆదానీ, గోయెంకాలు పోటీపడనున్నారని చెప్పవచ్చు. 2022 నుంచి పది జట్లతో కూడిన ఐపీఎల్కు రంగం సిద్ధమైనా, కొత్త ప్రాంఛైజీల యాజమాన్య హక్కులు దక్కించుకునేందుకు బీసీసీఐ కనీస ధర ఎంత నిర్దేశించనుంది? వేలంలో కొత్త ప్రాంఛైజీ ఎంత మొత్తానికి దక్కనుందనే చర్చ అప్పుడే ఊపందుకుంది.
రెండేండ్ల కిందట ఢిల్లీ డెర్డెవిల్స్ యాజమాన్యంలో 50 శాతం వాటను జెఎస్డబ్ల్యూ సంస్థ కొనుగోలు చేసింది. 50 శాతం వాటాను జిఎంఆర్ గ్రూప్ రూ.1100 కోట్లకు వదులుకుంది. ఐపీఎల్ జట్ల విలువ ప్రతి ఏడాది మారుతుంటుంది. 2023 నుంచి నూతన మీడియా హక్కుల ఒప్పందం నేపథ్యంలో ఆ విలువ ఆకాశాన్ని తాకనుంది. ఇప్పటికే చెన్నై సూపర్కింగ్స్, ముంబయి ఇండియన్స్, కోల్కత నైట్రైడర్స్ ప్రాంఛైజీల విలువ ఒక బిలియన్ అమెరికన్ డాలర్లకు చేరుకున్నదని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో నూతన ప్రాంఛైజీలకు రూ.1500 కోట్లకు తగ్గకుండా కనీస ధర నిర్ణయించనున్నారని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. ' సర్వ సభ్య సమావేశంలో ప్రాంఛైజీల కనీస ధరపై ఎటువంటి చర్చ జరుగలేదు. కానీ ఏజీఎంలో ఈ అంశంపై అనధికారిక చర్చ నడిచింది. నూతన ఐపీఎల్ ప్రాంఛైజీ యాజమాన్య హక్కులకు బీసీసీఐ కనీసం రూ.1500 కోట్లు పెట్టనుంది. అంతకుమించిన ధరను సైతం నిర్ణయించే అవకాశం లేకపోలేదు' అని వెల్లడించారు.