Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిరీస్లో ఆధిక్యం వేటలో భారత్, ఆస్ట్రేలియా
- పుంజుకోవాలని చూస్తున్న ఆతిథ్య జట్టు
- సిడ్నీ సమరానికి రోహిత్ శర్మ, నవదీప్ సైని
- ఉ.5 నుంచి సోనీసిక్స్లో ప్రసారం...
బోర్డర్-గవాస్కర్ సిరీస్ ఆరంభానికి ముందే కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. సిరీస్ సమరం ఆరంభమైన అనంతరం మరికొంత మంది కీలక ఆటగాళ్లు దూరమయ్యారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరుకు కుప్పకూలారు. అయినా, సిరీస్ వేటలో టీమ్ ఇండియా నిలిచే ఉంది. ఆస్ట్రేలియా సొంతగడ్డపై, కంగారూ కంటే మెరుగైన జట్టుగా భారత్ నేడు కనిపిస్తోంది. అత్యంత ప్రతికూల పరిస్థితులను ఎదురొడ్డి గొప్పగా పుంజుకున్న టీమ్ ఇండియా నేడు సిడ్నీ టెస్టును ఫేవరేట్గా ఆరంభించనుంది. సిడ్నీ సమరంలో పైచేయితో సిరీస్లో విలువైన ఆధిక్యం సొంతం చేసుకునే లక్ష్యంతో భారత్, ఆస్ట్రేలియా బరిలోకి దిగుతున్నాయి.
సిడ్నీ (ఆస్ట్రేలియా)
కంగారూ గడ్డపై ఆస్ట్రేలియా కంటే మెరుగ్గా రాణించేందుకు, ఆసీస్ తరహాలోనే మెరవాలనే సిద్ధాంతాన్ని టీమ్ ఇండియా మార్చి వేసింది. ప్రణాళికలు, వ్యూహలు మార్పు చేసుకుని.. ఆస్ట్రేలియాను వారి సొంత నేలపైనే ముప్పుతిప్పలు పెడుతోంది. ఇరు జట్లకు బలమైన బౌలింగ్ విభాగాలు ఉన్నప్పటికీ.. ప్రత్యేకించి భారత బౌలర్లు అమలు చేసిన వ్యూహలు అద్భుతం. అవుట్ సైడ్ ఆఫ్ కారిడార్లో బంతులు వేయడానికి బదులు, నేరుగా వికెట్లపైకి సంధిస్తున్నారు. లెగ్ సైడ్ వ్యూహత్మక ఫీల్డింగ్ మొహరింపులతో ఆశ్చర్యకర ఫలితాలు రాబట్టారు. తొలి టెస్టులో ఇషాంత్ శర్మ, రెండో టెస్టులో మహ్మద్ షమి, మూడో టెస్టులో ఉమేశ్ యాదవ్లను కోల్పోయిన టీమ్ ఇండియా.. కొత్త పేసర్తో ప్రతిసారీ మెప్పించింది. అదే ఊపులో సిడ్నీలో నెగ్గి సిరీస్లో 2-1 ఆధిక్యంపై గురి పెట్టింది. మరోవైపు ఆస్ట్రేలియా సైతం ఇదే లక్ష్యంతో సిడ్నీ సవాల్కు సిద్ధమైంది.
వార్నర్ వచ్చాడు, మరి మార్పు?! : ఆస్ట్రేలియా ఈ వందేండ్లలోనే అత్యల్ప స్కోరింగ్ రేటు నమోదు చేసింది. తొలి రెండు టెస్టుల్లో ఆస్ట్రేలియా 200 పైచిలుకు పరుగులు సాధించలేదు. సిడ్నీ టెస్టుకు డెవిడ్ వార్నర్ వస్తున్న సంతోషం సైతం కంగారూలో లేదు!. గజ్జల్లో గాయం నుంచి పూర్తిగా కోలుకోని వార్నర్.. మూడో టెస్టుకు సిద్ధమయ్యాడు. ఆరంభంలో అతడు మంచి భాగస్వామ్యం నమోదు చేస్తే.. ఆస్ట్రేలియా రూపు రేఖలు మారే అవకాశం ఉంది. అరంగేట్ర ఆటగాడు పకోస్కీతో కలిసి వార్నర్ నేడు ఇన్నింగ్స్ ఆరంభించే అవకాశం కనిపిస్తోంది. జశ్ప్రీత్ బుమ్రా, అశ్విన్లను వార్నర్ కాచుకుంటే ఆసీస్ ఊపిరీపీల్చుకోగలదు. మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, కామెరూన్ గ్రీన్లకు తోడు మాథ్యూ వేడ్ మిడిల్ ఆర్డర్లో చేరిపోయాడు. మార్నస్ లబుషేన్ క్రీజులో నిలబడుతున్నా, అతడికి సరైన సహకారం అందటం లేదు. స్టీవ్ స్మిత్కు అశ్విన్ స్పిన్ వల వేసి ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాడు. లబుషేన్, స్మిత్ నేడు సిడ్నీకి కొత్త ప్రణాళికతో వస్తారనే అంచనాలు ఉన్నాయి. బౌలింగ్ విభాగంలో మిచెల్ స్టార్క్, జోశ్ హజిల్వుడ్, పాట్ కమిన్స్లు ప్రమాదకరంగా కనిపిస్తున్నారు. స్పిన్నర్ నాథన్ లయాన్ ఎక్స్ ఫ్యాక్టర్ పాత్ర పోషించేందుకు ఎదురుచూస్తున్నాడు.
పట్టుదలగా టీమ్ ఇండియా : జట్టుగా ముందుకు నడిచి, గొప్పగా పుంజుకున్న ప్రస్థానం రహానె సేనది. జట్టులో స్టార్ ఆటగాళ్లు లేకపోయినా.. కొత్త కుర్రాళ్లతోనే భారత్ మెరుపు ప్రదర్శన చేసింది. బ్యాటింగ్ లైనస్, పేస్ లైనప్లు ఎక్కడా బలహీనతలను బయట పెట్టుకోలేదు. జట్టుగా సమష్టి ప్రదర్శన చేసింది. ఫలితం మెల్బోర్న్లో కనిపించింది. మెల్బోర్న్లో అరంగేట్ర పేసర్ మహ్మద్ సిరాజ్ అసమాన నియంత్రణ సాధించాడు. విదేశీ టెస్టుల్లో అరంగేట్ర పేసర్ నుంచి ఆ స్థాయి నియంత్రణ అద్వితీయం. నేడు నవదీప్ సైని సైతం అదే తరహాలో పట్టు బిగిస్తాడని భారత్ ఆశిస్తోంది. అప్పుడే ప్రత్యర్థి బ్యాట్స్మెన్ పరుగుల వేటలో ఒత్తిడికి లోనై, తప్పులు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు సిడ్నీలో తడాఖా చూపించాలని అనుకుంటున్నారు. టాప్ ఆర్డర్లో రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్లు మంచి ఆరంభం అందిస్తే.. భారత్కు తిరుగుండదు. గత సిరీస్ హీరో చతేశ్వర్ పుజారా తనదైన ఇన్నింగ్స్ బాకీ పడ్డాడు. శతక విన్యాస ఊపులో ఉన్న అజింక్య రహానె సిడ్నీలోనూ సత్తా చాటితే ఆసీస్కు తిప్పలు తప్పవు. హనుమ విహారి తుది జట్టులో తన స్థానానికి న్యాయం చేయాల్సి ఉంది.
పిచ్, వాతావరణం : నిలకడగా కురుస్తున్న వర్షాలతో సిడ్నీ టెస్టు మ్యాచ్కు ఇరు జట్లు సన్నద్ధతకు ఇబ్బంది పడ్డాయి. సిడ్నీ ఉత్తర ప్రాంత బీచ్ ప్రాంతాల్లో కోవిడ్19 కేసుల నమోదుతో స్టేడియంలో అభిమానుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. సహజసిద్ధంగా సిడ్నీ పిచ్ స్పిన్నర్లకు అనుకూలం. కానీ ఇక నుంచి ఆ పరిస్థితి ఉండదని క్యూరేటర్ ఆడం లూయిస్ అంటున్నాడు!. పిచ్పై పచ్చిక కనిపిస్తోంది. రెండేండ్ల కిందట ఇక్కడ కుల్దీప్ యాదవ్ ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. నిరుడు న్యూజిలాండ్పై నాథన్ లయాన్ పది వికెట్లు పడగొట్టాడు. భారత స్పిన్నర్లకు ఇది ఉత్సాహం కలిగించే గణాంకాలు. టెస్టు మ్యాచ్ తొలి రెండు రోజులు తేలికపాటి చిరుజల్లులు కురువనున్నాయి. మూడో రోజు నుంచి ఆటకు వాతావరణం సహకరించనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానె (కెప్టెన్), హనుమ విహారి, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, నవదీప్ సైని, మహ్మద్ సిరాజ్, జశ్ప్రీత్ బుమ్రా.
ఆస్ట్రేలియా : డెవిడ్ వార్నర్, విల్ పకోస్కీ, మార్నస్ లబుషేన్, స్టీవ్ స్మిత్, మాథ్యూ వేడ్, కామెరూన్ గ్రీన్, టిమ్ పైనె (కెప్టెన్, వికెట్ కీపర్), పాట్ కమిన్స్, మిచెల్ స్టార్క్, నాథన్ లయాన్, జోశ్ హజిల్వుడ్.