Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వెల్లడించిన ఈసీబీ మేనేజింగ్ డైరెక్టర్
లండన్ : పాకిస్థాన్ క్రికెట్కు కొత్త కళ రానుంది. ఇంగ్లాండ్ మహిళల జట్టు చరిత్రలోనే తొలిసారి పాకిస్థాన్ పర్యటనకు వెళ్లనుంది. అక్కడ పాకిస్థాన్ మహిళల జట్టుతో మూడు వన్డేలు, రెండు టీ20ల సిరీస్లో పోటీపడనుంది. ఈ మేరకు ఇంగ్లాండ్ అండ్ వేల్స్ క్రికెట్ బోర్డు (ఈసీబీ) మహిళల మేనేజింగ్ డైరెక్టర్ క్లారె కానర్ వెల్లడించారు. ఇంగ్లాండ్ మెన్స్ జట్టు సైతం 16 ఏండ్లలో తొలిసారి పాకిస్థాన్లో అడుగుపెట్టనుంది. అక్టోబర్ 14, 15న మెన్స్, ఉమెన్స్ టీ20 మ్యాచులు కరాచీలో జరుగనున్నాయి. వన్డే సిరీస్ కోసం అమ్మాయిల జట్టు కరాచీలోనే ఉండనుంది. ఈ ఏడాది అక్టోబర్లో ఇంగ్లాండ్ అమ్మాయిలు పాకిస్థాన్కు వెళ్లనున్నారు. ' ఇంగ్లాండ్ మహిళల జట్టు ఎన్నడూ పాకిస్థాన్ పర్యటనకు వెళ్లలేదు. మహిళల క్రికెట్లో ఇదో చారిత్రక ఘట్టం. ఈ పర్యటన పోటీతత్వ క్రికెట్ను అందించటంతో పాటు మహిళలకూ సమాన అవకాశాలు, సాధికారతకు ఊతం ఇస్తాయి' అని ఆమె తెలిపింది. ప్రపంచ చాంపియన్ ఇంగ్లాండ్ జట్టు పాకిస్థాన్ పర్యటనకు వస్తే, పాక్ గడ్డపై తిరిగి అంతర్జాతీయ క్రికెట్కు ఆజ్యం పోసినట్టు అవనుంది. ఆర్థికంగా చితికిపోతున్న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ)కి ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది.