Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రస్తుత ఆధిక్యం 197 పరుగులు
- భారత్ను దెబ్బకొట్టిన కమిన్స్
- ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ 103/2
- భారత్, ఆసీస్ మూడో టెస్టు మూడో రోజు
సిడ్నీ (ఆస్ట్రేలియా) : మూడో టెస్టులో భారత్ కష్టాల్లో పడింది. రెండో రోజు ఆటలో ధీటుగా బదులిచ్చిన భారత్.. మూడో రోజు ఆటలో పూర్తిగా చేతులెత్తేసింది. ఆతిథ్య ఆస్ట్రేలియాకు తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కోల్పోయిన రహానెసేన... సిరీస్లోనూ ఆధిక్యం సమర్పించుకునే ప్రమాదంలో పడింది. తొలి ఇన్నింగ్స్లో శుభ్మన్ గిల్ (50, 111 బంతుల్లో 8 ఫోర్లు), చతేశ్వర్ పుజారా (50, 176 బంతుల్లో) అర్థ సెంచరీలతో రాణించినా భారత్ 244 పరుగులకే కుప్పకూలింది. రిషబ్ పంత్ (36), రవీంద్ర జడేజా (28 నాటౌట్) మెరుపులు తొలి ఇన్నింగ్స్ లోటును పూడ్చేందుకు సరిపోలేదు. కెప్టెన్ అజింక్య రహానె (22), హనుమ విహారి (4) స్వల్ప స్కోర్లకే పరిమితం అయ్యారు. తొలి ఇన్నింగ్స్లో 94 పరుగుల భారీ ఆధిక్యం సాధించిన ఆస్ట్రేలియా.. రెండో ఇన్నింగ్స్లో 103/2తో పటిష్ట స్థితిలో కొనసాగుతోంది. ప్రస్తుతం 197 పరుగుల భారీ ఆధిక్యంలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లో పరుగుల వేటలో సక్సెస్ సాధించిన లబుషేన్ (47 నాటౌట్), స్టీవ్ స్మిత్ (29 నాటౌట్) అజేయంగా ఆడుతున్నారు. ఈ ఇద్దరు క్రీజులో ఉండటంతో ఆస్ట్రేలియా భారీ లక్ష్యాన్ని నిర్దేశించేందుకు ఉవ్విళ్లురుతోంది. ఇప్పటికే ఓటమి ప్రమాదం ఎదుర్కొంటున్న భారత్.. నేడు ఉదయం సెషన్లో ఆసీస్ను కట్టడి చేస్తే సిడ్నీలోనూ గెలుపు కోసం పోరాడేందుకు ఓ అవకాశం సృష్టించుకోనుంది.
తొలి సెషన్ : వికెట్లు పడినా, పరుగులు జమయ్యాయి
ఓవర్నైట్ స్కోరు 96/2తో మూడో రోజు ఉదయం బ్యాటింగ్కు వచ్చిన భారత్ తొలి సెషన్లో మిశ్రమ ప్రదర్శన చేసింది. ఫామ్లో ఉన్న కెప్టెన్ అజింక్య రహానె (22, 70 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్), హనుమ విహారి (4, 38 బంతుల్లో) వికెట్లను భారత్ కోల్పోయింది. ఓ ఫోర్, ఓ సిక్సర్తో జోరు మీద కనిపించిన రహానెను పాట్ కమిన్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. పుజారాతో కలిసి ఇన్నింగ్స్ను బలోపేతం చేసేందుకు అడుగులు వేసిన రహానె వికెట్తో ఆసీస్ మానసికంగా పైచేయి సాధించింది. హనుమ విహారి మరోసారి విఫలమయ్యాడు. తుది జట్టులో తన చోటుకు ఎటువంటి న్యాయం చేయలేకపోయాడు. మరో ఎండ్లో చతేశ్వర్ పుజారా (50, 176 బంతుల్లో 5 ఫోర్లు) బౌలర్ల సహనాన్ని పరీక్షించాడు. స్ట్రయిక్రేట్ తక్కువగా ఉన్నప్పటికీ.. పుజారా మంచి భాగస్వామ్యాలు నెలకొల్పాడు. తొలి సెషన్ ముగిసే సమయానికి వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్తో కలిసి అజేయంగా నిలిచాడు. 180/4తో భారత్ తొలి సెషన్ను సంతృప్తికరంగానే ముగించింది.
రెండో సెషన్ : పేకమేడలా కుప్పకూలింది
తొలి సెషన్లో మెప్పించిన భారత్, తొలి ఇన్నింగ్స్ లోటు అధిగమించటమే కాదు ఆధిక్యం సైతం అందుకునేలా కనిపించింది. కానీ చివరి వికెట్లను సులువుగా తేసేసిన ఆస్ట్రేలియా బౌలర్లు భారత్ను స్వల్ప స్కోరుకే కుప్పకూల్చారు. పుజారా ఐదు ఫోర్లుతో 174 బంతుల్లో అర్థ సెంచరీ సాధించాడు. ఐదో వికెట్కు పుజారా, రిషబ్ పంత్లు 115 బంతుల్లో 50 పరుగులు జోడించారు. దీంతో భారత్ ఇన్నింగ్స్ సాఫీగానే సాగుతుందని అనిపించింది. అప్పటికే గాయంతో ఇబ్బంది పడుతున్న రిషబ్ పంత్ 67 బంతుల్లో 4 ఫోర్లతో 36 పరుగులు చేశాడు. హెజిల్వుడ్ బౌలింగ్లో వార్నర్కు క్యాచ్ ఇచ్చి నిష్క్రమించాడు. తర్వాతి ఓవర్లో పుజారాను పాట్ కమిన్స్ వెనక్కి పంపించాడు. 195/4తో మెరుగ్గా కనిపించిన భారత్ 244 పరుగులకే కుప్పకూలింది. 49 పరుగులకే చివరి ఆరు వికెట్లను కోల్పోయింది. లోయర్ ఆర్డర్లో రవీంద్ర జడేజా (28 నాటౌట్, 37 బంతుల్లో 5 ఫోర్లు) ఒక్కడే రాణించాడు. అశ్విన్ (10), నవదీప్ సైని (3), బుమ్రా (0), మహ్మద్ సిరాజ్ (6)లు జడేజాకు సహకారం అందించటంలో విఫలమయ్యారు. టెయిలెండర్లలో అశ్విన్, బుమ్రా రనౌట్ కాగా.. సిరాజ్, సైనిలను కమిన్స్, స్టార్క్ అవుట్ చేశారు. జడేజాకు ఆఖర్లో సహకారం అందితే తొలి ఇన్నింగ్స్ లోటును భారీగా కుదించేవాడు. 244 పరుగులకు ఆలౌట్ అయిన రహానె సేన.. 94 పరుగుల భారీ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని ఆసీస్కు సమర్పించుకుంది. ఆసీస్ పేసర్ పాట్ కమిన్స్ నాలుగు వికెట్లతో చెలరేగాడు. హెజిల్వుడ్ రెండు వికెట్లు పడగొట్టాడు.
మూడో సెషన్ : లబుషేన్, స్మిత్ జోరు
భారీ తొలి ఇన్నింగ్స్ సొంతం చేసుకున్న ఆస్ట్రేలియా.. టాప్ ఆర్డర్ మెరుపులతో అప్పుడే 197 పరుగుల ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ప్రమాదకర ఓపెనర్ డెవిడ్ వార్నర్ (13) మరోసారి స్వల్ప స్కోరుకే అవుటయ్యాడు. అశ్విన్ మ్యాజిక్కు వార్నర్ వికెట్ల ముందు దొరికిపోయాడు. తొలి ఇన్నింగ్స్ అర్థ సెంచరీ హీరో విల్ పకోస్కీ (10)ని మహ్మద్ సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో 35 పరుగులకే ఆస్ట్రేలియా ఓపెనర్లు ఇద్దరినీ కోల్పోయింది. ఫామ్లో ఉన్న ఇద్దరు టెస్టు స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్ మార్నస్ లబుషేన్ (47 నాటౌట్, 69 బంతుల్లో 6 ఫోర్లు), స్టీవ్ స్మిత్ (29 నాటౌట్, 63 బంతుల్లో 3 ఫోర్లు)లు మూడో వికెట్కు 68 పరుగుల అజేయ భాగస్వామ్యంతో కదం తొక్కారు. లబుషేన్ ఆరు ఫోర్లతో వేగంగా పరుగులు సాధించగా.. స్మిత్ సైతం దూకుడుగానే ఆడాడు. స్మిత్ మూడు ఫోర్లు బాదాడు. ఈ ఇద్దరి జోరుతో ఆఖరు సెషన్లో ఆస్ట్రేలియా 103/2తో పటిష్ట స్థితిలో నిలిచింది. తొలి ఇన్నింగ్స్లోనూ ఈ ఇద్దరి మెరుపులతోనే ఆస్ట్రేలియా భారీ స్కోరు చేసిన సంగతి తెలిసిందే. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఈ ఇద్దరు అజేయంగా ఆడుతున్నారు. నేడు ఉదయం సెషన్లోనే ఆసీస్ వేగంగా పరుగులు సాధించటంపై దృష్టి పెట్టనుంది. దీంతో భారత్ ముందు 350-400 పరుగుల లక్ష్యం ఉండే అవకాశం కనిపిస్తోంది.
స్కోరు వివరాలు
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 338 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి,బి) హెజిల్వుడ్ 26, శుభ్మన్ గిల్ (సి) కామెరూన్ గ్రీన్ (బి) పాట్ కమిన్స్ 50, చతేశ్వర్ పుజారా (సి) పైనె (బి) పాట్ కమిన్స్ 50, అజింక్య రహానె (బి) పాట్ కమిన్స్ 22, హనుమ విహారి (రనౌట్) హెజిల్వుడ్ 36, రిషబ్ పంత్ (సి) డెవిడ్ వార్నర్ (బి) హెజిల్వుడ్ 36, రవీంద్ర జడేజా నాటౌట్ 28, అశ్విన్ (రనౌట్) 10, నవదీప్ సైని (సి) మాథ్యూ వేడ్ (బి) మిచెల్ స్టార్క్ 3, జశ్ప్రీత్ బుమ్రా (రనౌట్) లబుషేన్ 3, మహ్మద్ సిరాజ్ (సి) పైనె (బి) కమిన్స్ 6, ఎక్స్ట్రాలు : 244, మొత్తం : (100.4 ఓవర్లలో ఆలౌట్) 244.
వికెట్ల పతనం : 1-70, 2-85, 3-117, 4-142, 5-195, 6-195, 7-206, 8-210, 9-216, 10-244.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 19-7-61-1, జోశ్ హెజిల్వుడ్ 21-10-43-2, పాట్ కమిన్స్ 21.4-10-29-4, నాథన్ లయాన్ 31-8-87-0, లబుషేన్ 3-0-11-0, కామెరూన్ గ్రీన్ 5-2-11-0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : డెవిడ్ వార్నర్ (ఎల్బీ) రవిచంద్రన్ అశ్విన్ 13, విల్ పకోస్కీ (సి) వృద్దిమాన్ సాహా (బి) మహ్మద్ సిరాజ్ 10, మార్నస్ లబుషేన్ బ్యాటింగ్ 47, స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ 29, ఎక్స్ట్రాలు : 04, మొత్తం : (29 ఓవర్లలో 2 వికెట్లకు) 103.
వికెట్ల పతనం : 1-16, 2-35.
బౌలింగ్ : జశ్ప్రీత్ బుమ్రా 8-1-26-0, మహ్మద్ సిరాజ్ 8-2- 20-1, నవదీప్ సైని 7-1-28-0, రవిచంద్రన్ అశ్విన్ 6-0-28-1.