Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జాతి వివక్షకు గురైన మహ్మద్ సిరాజ్
- ఆరుగురు అభిమాలకు స్టేడియం ఉద్వాసన
సిడ్నీ : 'మంకీగేట్' 2008- 09 ఆస్ట్రేలియా పర్యటనను అత్యంత వివాదాస్పదం చేసింది. భారత్, ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డుల నడుమ ద్వైపాక్షిక సంబంధాలు క్షీణ దశకు చేరుకున్న సందర్భం అది. పుష్కర కాలం అనంతరం మరోసారి భారత్, ఆస్ట్రేలియా టెస్టు సిరీస్లో 'మంకీ' వివాదం రాజుకుంది. సిడ్నీ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ను ఉద్దేశించి ఆస్ట్రేలియా అభిమానులు 'కోతి' అని జాత్యహంకార వ్యాఖ్యలు చేయటం ప్రపంచ క్రికెట్ను నివ్వెరపరిచింది.
అంపైర్ కు ఫిర్యాదు : మూడో రోజు ఆటలో మహ్మద్ సిరాజ్, జశ్ప్రీత్ బుమ్రాలను లక్ష్యంగా బౌండరీ లైన్ వద్ద మద్యం మత్తులో ఉన్న కొందరు అభిమానులు జాత్యహంకార వ్యాఖ్యలు చేశారు. దీనిపై భారత జట్టు శనివారమే అధికారికంగా మ్యాచ్ రిఫరీ డెవిడ్ బూన్కు ఫిర్యాదు చేసింది. మైదానంలోనే జాతి వివక్ష వ్యాఖ్యలను అంపైర్ల దృష్టికి తీసుకొస్తే, చర్యలు తీసుకునేందుకు వీలుగా ఉంటుందని శనివారమే సూచించారు. కామెరూన్ గ్రీన్కు సిక్సర్లు కోల్పోయిన మహ్మద్ సిరాజ్.. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్కు చేరుకున్నాడు. మూడో రోజు ఆటలో స్టాండ్స్ నుంచి జాతి వివక్ష వ్యాఖ్యలు చేసిన అల్లరిమూకే.. నాల్గో రోజు సిరాజ్ను లక్ష్యంగా చేసుకుని జాతి వివక్ష వ్యాఖ్యలు చేశారు. మహ్మద్ సిరాజ్ వెంటనే విషయాన్ని కెప్టెన్ అజింక్య రహానెకు చెప్పాడు. ఫీల్డ్ అంపైర్ వద్దకు వెళ్లి రహానె, సిరాజ్లు ఫిర్యాదు చేశారు. దీంతో ఆటను పది నిమిషాల పాటు నిలిపివేయాల్సి వచ్చింది. ఆ సమయంలో ఆస్ట్రేలియా కెప్టెన్ టిమ్ పైనె సైతం క్రీజులోనే ఉన్నాడు. సిరాజ్ వద్దకు వచ్చి పైనె విషయాన్ని తెలుసుకున్నాడు.
బయటకు పంపారు : జాత్యహంకార వ్యాఖ్యలు చేసిన ఆరుగురు ఆస్ట్రేలియా అభిమానులను పోలీసులు స్టేడియం నుంచి బయటకు పంపించారు. మూడో రోజు సైతం ఆ ఆరుగురు వ్యక్తులే జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినట్టు సిరాజ్ వెల్లడించారు. స్టాండ్స్లోకి చేరుకున్న సిడ్నీ పోలీసులు.. మద్యం మత్తులో ఉన్న అభిమానులను స్టేడియం నుంచి గెంటేశారు. సిడ్నీ స్టేడియంలోకి తిరిగి వీరికి అనుమతి ఇచ్చేది లేనిది తెలియదు. క్రీడా స్ఫూర్తితో సాగుతున్న బోర్డర్-గవాస్కర్ సిరీస్ను జాత్యహంకార వ్యాఖ్యలతో దురభిమానులు వేడెక్కించారు. పోలీసులు వీరిపై ఎటువంటి కేసు నమోదు చేయకపోవటం విచారకరమని నెటిజన్లు విమర్శలు చేస్తున్నారు.