Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గాయంతో జడేజా ఔట్
- అశ్విన్, విహారి ఫిట్నెస్ పై ప్రశ్నలు
టెస్టు క్రికెట్ చరిత్రలోనే టీమ్ ఇండియా అత్యంత క్లిష్ట పరిస్థితులు చవిచూస్తోంది. అయితే అది మైదానంలో కాదు. టెస్టు సమరంలో పోటీపడేందుకు ఫిట్నెస్తో కూడిన తుది జట్టును బరిలోకి దింపేందుకు సవాళ్లు ఎదుర్కొంటుంది. ఆస్ట్రేలియా పర్యటనకు ముందే ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లను కోల్పోయింది. ఆడిలైడ్ టెస్టు అనంతరం స్టార్ బ్యాట్స్మన్ విరాట్ కోహ్లిని కోల్పోయింది. మెల్బోర్న్ టెస్టు అనంతరం పేసర్ మహ్మద్ షమిని దూరం చేసుకుంది. ఇప్పుడు సిడ్నీ సమరం అనంతరం ఏకంగా ముగ్గురు ఆటగాళ్లను కోల్పోయే ప్రమాదంలో పడింది. నిర్ణయాత్మక బ్రిస్బేన్ టెస్టుకు తుది జట్టును బరిలోకి దింపటం రహానెకు సవాల్గా నిలువనుంది.
నవతెలంగాణ-సిడ్నీ
2018-19 ఆస్ట్రేలియా పర్యటనలో బోర్డర్-గవాస్కర్ సిరీస్ను సొంతం చేసుకున్న భారత్ 71 ఏండ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించింది. అయినా, ఆ విజయానికి కొందరు వక్రబాష్యాలు చెప్పటం మొదలుపెట్టారు. డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లేని ఆసీస్ను ఓడించటం ఓ విజయమా? అని పెదవి విరిచిన వారున్నారు. ఆస్ట్రేలియా గడ్డపై వరుసగా రెండో టెస్టు సిరీస్ విజయంపై కన్నేసిన టీమ్ ఇండియా ఐపీఎల్ అనంతరం ఆసీస్లో అడుగుమోపింది. ఇప్పుడు ఆస్ట్రేలియాకు డెవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్లకు తోడు మార్నస్ లబుషేన్ తోడయ్యాడు. దీంతో భారత్ గట్టి పోటీ ఇవ్వటంపై అనుమానాలు వ్యక్తమయ్యాయి. అందుకు బలం చేకూర్చేందుకు అన్నట్టు, కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడ్డారు. ప్రతి టెస్టు మ్యాచ్కు భారత్ ఓ కీలక ఆటగాడిని కోల్పోవటం ఆరంభమైంది. ఆస్ట్రేలియా పర్యటనలో మూడు టెస్టులు ముగిశాయి. భారత్ సిరీస్లో 1-1తో సమవుజ్జీగా నిలిచింది. నిర్ణయాత్మక నాల్గో టెస్టు జనవరి 15 నుంచి బ్రిస్బేన్లో ఆరంభం కానుంది. సిడ్నీ టెస్టులో ముగ్గురు ఆటగాళ్లు గాయపడటంతో, బ్రిస్బేన్లో భారత్ ఫిట్నెస్తో కూడిన తుది జట్టును ఆడించటంపై సందేహం వ్యక్తమవుతోంది.
యార్కర్ల కింగ్కు గాయం? : సిడ్నీ టెస్టు మూడో రోజే రవీంద్ర జడేజా గాయం కారణంగా దూరమయ్యాడు. నాల్గో టెస్టుకు అతడు అందుబాటులో ఉండబోడని బీసీసీఐ సోమవారం ప్రకటించింది. అయినా, సిడ్నీ టెస్టు ఐదో రోజు బ్యాటింగ్కు వచ్చేందుకు రవీంద్ర జడేజా సిద్దమయ్యాడు. హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ అసమాన పోరాటంతో జడేజాకు క్రీజులోకి రావాల్సిన అవసరం రాలేదు. మూడో రోజు ఆటలో జడేజా బొటన వేలికి గాయమైన సంగతి తెలిసిందే. స్కానింగ్ నివేదికల్లో బొటనవేలి ఎముక పక్కకుజరిగినట్టు తేలింది. దీంతో జడేజా నాల్గో టెస్టుకు సైతం దూరమయ్యాడు.
సిడ్నీ టెస్టు మ్యాచ్లో జశ్ప్రీత్ బుమ్రా గాయంతో ఇబ్బంది పడినట్టు తెలుస్తోంది. మూడో రోజు ఆటలో బుమ్రా పదేపదే పొత్తికడుపును పట్టుకోవటం కనిపించింది. అదే సమయంలో మైదానం వీడి ఫిజియో సహాయం తీసుకోవటం కనిపించింది. అయినప్పటికీ, బుమ్రా 25 ఓవర్లు బౌలింగ్ చేశాడు. ఓవరాల్గా బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో అత్యధిక పని ఒత్తిడి బుమ్రాపైనే పడింది. ఇరు జట్లలో మరో బౌలర్ బుమ్రా సంధించినన్ని ఓవర్లు వేయలేదు. తొలి మూడు టెస్టుల్లో, ఆరు ఇన్నింగ్స్ల్లో కలిపి బుమ్రా ఏకంగా 117.4 ఓవర్లు బౌలింగ్ చేశాడు. మహ్మద్ షమి లేని వేళ సిడ్నీలో బుమ్రానే బౌలింగ్ బృందానికి నాయకత్వం వహించాడు. ఇప్పుడు బుమ్రా సైతం గాయం ప్రమాదంలో పడటంతో బ్రిస్బేన్లో పేస్ దళం పూర్తిగా అనుభవం లేకుండా పోనుంది!. ఆస్ట్రేలియా పర్యటనలో అత్యధిక పని ఒత్తిడి సైతం బుమ్రానే మోస్తున్నాడు. ఆస్ట్రేలియాతో మూడు వన్డేలు ఆడిన బుమ్రా.. టీ20 సిరీస్కు విశ్రాంతి తీసుకున్నాడు. ఇప్పుడు తొలి మూడు టెస్టుల్లోనూ బరిలోకి దిగాడు. జట్టులో మరో ఆటగాడు బుమ్రా ఆడినన్ని మ్యాచులు ఆడలేదు. బుమ్రా మ్యాచ్ ఫిట్నెస్ సాధించేందుకు జట్టు ఫిజియో ఈ మూడు రోజులు ప్రత్యేక చొరవ తీసుకోనున్నాడు.
ఇప్పుడు ఎలా? : సిడ్నీ టెస్టులో రవీంద్ర జడేజా, రిషబ్ పంత్, హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్ సహా జశ్ప్రీత్ బుమ్రా గాయపడ్డారు. వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ నాల్గో టెస్టుకు అందుబాటులో ఉండనున్నాడని జట్టు మేనేజ్మెంట్ తెలిపింది. స్పిన్ ఆల్రౌండర్ రవీంద్ర జడేజా నాల్గో టెస్టుకు దూరమయ్యాడు. తోడ కండరాల గాయంతో ఇబ్బందిపడుతున్న హనుమ విహారి ఫిట్నెస్పై ఫిజియో ఓ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. రవిచంద్రన్ అశ్విన్ విషయంలోనూ ఇప్పుడే ఎటూ తేల్చలేం. అశ్విన్ అందుబాటులో లేకుంటే చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. రవీంద్ర జడేజా స్థానంలో బ్యాటింగ్ లైనప్ నుంచి ఒకరు తుది జట్టులోకి వచ్చేందుకు అవకాశం ఉంది. అశ్విన్, జడేజాలు లేని వేళ స్పిన్ విభాగం సైతం బలహీనం కానుంది. గత పర్యటనలో కుల్దీప్ యాదవ్ ఇక్కడ మాయజాలం చూపించినా.. సిడ్నీ వార్మప్ మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ వికెట్ తీయటంలో విఫలమయ్యాడు. దీంతో అతడి మాయపై కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఒకవేళ బుమ్రా బ్రిస్బేన్లో ఆడలేకపోతే.. అది భారత్కు గట్టి ఎదురుదెబ్బ కానుంది. ఆ పరిస్థితుల్లో రెండు టెస్టుల అనుభవం కలిగిన మహ్మద్ సిరాజ్ పేస్ విభాగంలో సీనియర్ బౌలర్ కానున్నాడు. ఒక టెస్టు అనుభవం కలిగిన నవదీప్ సైని సహా అరంగేట్రం చేయాల్సి ఉన్న తంగరసు నటరాజన్ లేదా షార్దుల్ ఠాకూర్లతో కలిసి సిరాజ్ పేస్ విభాగం బాద్యతలు చూసుకోవాల్సి ఉంటుంది. సిరీస్ నిర్ణయాత్మక టెస్టులో అనుభవం లేని బౌలింగ్ విభాగంతో పోరాడాల్సి రానుండటం భారత్కు పెను సవాల్. ఆస్ట్రేలియా పర్యటనలో ఎన్నో ప్రతికూలతలు, సమస్యలకు ఎదురు నిలిచి అసమాన ప్రదర్శన చేస్తోన్న టీమ్ ఇండియా... బ్రిస్బేన్లోనూ అదే పునరావృతం చేస్తుందేమో చూడాలి.