Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ క్ర్రీడావిభాగం
గబ్బా టెస్టులో మరో రెండు రోజుల మిగిలి ఉంది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 33 పరుగుల ఆధిక్యం సొంతం చేసుకుంది. డెవిడ్ వార్నర్ దూకుడుతో మరో ఆరు ఓవర్ల వ్యవధిలోనే ఆధిక్యాన్ని 54 పరుగులకు మెరుగుపర్చుకుంది. అయినా, గబ్బా సమరంలో ఒత్తిడి ఆతిథ్య ఆస్ట్రేలియాపైనే నెలకొంది. సిడ్నీ టెస్టులో గెలుపు ఖాయం అనుకున్న పరిస్థితుల్లో ఆస్ట్రేలియాను ఓడకుంటే చాలనుకునే స్థితిలోకి నెట్టింది టీమ్ ఇండియా!. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ను సాధించేందుకు ఆస్ట్రేలియా బ్రిస్బేన్లో విజయం తప్పనిసరి. 1-1తో సిరీస్లో సమవుజ్జీగా నిలిచినా.. డిఫెండింగ్ చాంపియన్గా ట్రోఫీని టీమ్ ఇండియా ఎగరేసుకుపోనుంది.
బ్రిస్బేన్లో రెండో రోజు మూడో సెషన్ వర్షం కారణంగా పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. సోమ, మంగళవారాల్లో బ్రిస్బేన్ టెస్టుకు వర్ష సూచనలు ఉన్నాయి. వర్షం కారణంగా మిగిలిన ఆరు సెషన్లలో రెండు సెషన్ల ఆట తుడిచిపెట్టుకుపోయినా.. గబ్బా టెస్టులో ఫలితం తేలటం అసాధ్యమే!. భారత్, ఆస్ట్రేలియాలు అత్యుత్తమ ప్రమాణాలతో కూడిన టెస్టు సమరం ఆడుతున్నాయి. దీంతో ఆరు సెషన్లు ఆడితేగానీ, విజేత అవతరించటం సాధ్యపడుతుంది. భారత జట్టులో సగం మందికి పైగా యువ క్రికెటర్లే అయినా..ఐపీఎల్ అనుభవంతో అందరూ అదర గొడుతున్నారు. ఏ దశలోనూ పోరాట స్ఫూర్తిని విడిచిపెట్టడం లేదు. మరోవైపు ఆస్ట్రేలియాకు సైతం యువ క్రికెటర్లు అండగా నిలుస్తున్నారు. ఆఖరు వికెట్ పడేంత వరకూ ఆలౌట్ అయ్యారని అనుకునే పరిస్థితి ఇరు వైపులా కనిపించటం లేదు. ఈ పరిస్థితుల్లో గెలుపు అంతిమ లక్ష్యంగా పోరాడుతున్న ఆస్ట్రేలియాపై ఒత్తిడి నెలకొంది. కనీసం డ్రా చేసుకున్నా సిరీస్ను నిలుపుకునే స్థితిలో ఉన్న టీమ్ ఇండియా.. ఆతిథ్య జట్టు అనవసర తప్పిదాలు చేసేంతవరకు ఎదురుచూసే వ్యూహంతో నేడు బరిలోకి దిగనుంది. మేఘావృతమైన వాతావరణంలో భారత బౌలర్లు సమష్టిగా రాణిస్తే.. గబ్బాలో గెలుపు కోసం వెళ్లేందుకు అధిక అవకాశాలు కనిపిస్తున్నాయి.