Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- షార్దుల్, వాషింగ్టన్ అర్థ సెంచరీలు
- భారత్ తొలి ఇన్నింగ్స్ 336/10
- ఆసీస్కు స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం
- ఆసక్తికరంగా సాగుతున్న గబ్బా టెస్టు పోరు
లంచ్ సెషన్ ఆరంభంలోనే 186/6. తొలి ఇన్నింగ్స్లో భారత బ్యాటింగ్ లైనప్ పెవిలియన్కు చేరుకుంది. అప్పటికి భారత్ తొలి ఇన్నింగ్స్లో మరో 183 పరుగుల వెనుకంజలో ఉంది. టెయిలెండర్లు రావాల్సిన తరుణంలో గబ్బాలో రహానెసేన పోరాటం త్వరగానే ముగిసేలా కనిపించింది.
ఇటువంటి క్లిష్ట పరిస్థితుల్లో సిడ్నీలో విహారి, అశ్విన్లు అసమాన పోరాట పటిమ చూపినట్టే.. గబ్బాలో అరంగేట్ర స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్, షార్దుల్ ఠాకూర్లు అర్థ సెంచరీలతో చెలరేగారు. ఏడో వికెట్కు 123 పరుగులు జోడించారు. సుందర్, ఠాకూర్ పోరాటంతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 336 పరుగుల స్కోరు నమోదు చేసింది. తోక ప్రతాపంతో గబ్బాలోనూ భారత్ గెలుపు కోసం పోరాడే స్థితిలో నిలిచింది.
వరుసగా రెండో ఇన్నింగ్స్లో భారత లోయర్ ఆర్డర్ నుంచి అసమాన పోరాట ప్రదర్శన. సిడ్నీలో హనుమ విహారి, రవిచంద్రన్ అశ్విన్లు దుర్భేద్యమైన డిఫెన్స్తో సిడ్నీలో సూపర్ ప్రదర్శన చేయగా.. బ్రిస్బేన్లో వాషింగ్టన్ సుందర్ (62, 144 బంతుల్లో 7 ఫోర్లు, 1 సిక్స్), షార్దుల్ ఠాకూర్ (67, 115 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీలతో చెలరేగారు. కఠిన పరిస్థితుల్లో 36 ఓవర్ల పాటు క్రీజులో నిలిచిన ఈ జోడీ ఏడో వికెట్కు 123 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ ఇద్దరి మెరుపులతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 336 పరుగులు చేసింది. బ్యాటింగ్ లైనప్ను త్వరగానే పెవిలియన్కు చేర్చి భారీ ఆధిక్యంపై కన్నేసిన ఆస్ట్రేలియాకు 33 పరుగుల ఆధిక్యం మాత్రమే దక్కింది. డెవిడ్ వార్నర్ (20 బ్యాటింగ్, 22 బంతుల్లో 3 ఫోర్లు) తనదైన శైలిలో దూకుడుగా ఆడగా రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 21/0తో కొనసాగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఆస్ట్రేలియా 54 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది.
తొలి సెషన్ : పుజారా, రహానె విఫలం
ఓవర్నైట్ బ్యాట్స్మెన్ చతేశ్వర్ పుజారా (25), అజింక్య రహానె (37)లపైనే భారత్ ఎక్కువగా ఆధారపడింది. ఆస్ట్రేలియా సైతం తొలుత ఈ ఇద్దరిని అవుట్ చేస్తే చాలు అనుకుంది. కానీ ఆసీస్ బౌలర్ల సహనాన్ని పరీక్షించిన పుజారా, రహానెలు భారీ ఇన్నింగ్స్లపై ఆశలు రేపారు. 94 బంతులు ఆడిన పుజారా ఉదయం సెషన్లో రెండు ఫోర్లతో మెప్పించాడు. కానీ పుజారా వికెట్తోనే ఆసీస్ తొలి బ్రేక్ సాధించింది. హజిల్వుడ్ ట్రాప్లో పడిన పుజారా వికెట్ల వెనకాల క్యాచ్తో నిష్క్రమించాడు. మయాంక్ అగర్వాల్ (38, 75 బంతుల్లో 3 ఫోర్లు) జట్టుకట్టిన అజింక్య రహానె (37, 93 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజులో సౌకర్యవంతంగా కదిలాడు. స్లిప్స్లో రహానె రెండుసార్లు ఎడ్జ్తో ఫోర్లు సాధించగా.. అక్కడ ఫీల్డర్ను మొహరించి రహానెను ఊరించింది. ట్రాప్లో పడిన రహానె స్లిప్స్లో క్యాచ్ ఇచ్చేశాడు. అప్పటికి భారత్ స్కోరు 144/4. మయాంక్ అగర్వాల్, రిషబ్ పంత్లు లంచ్ విరామానికి మరో వికెట్ పడకుండా ఆడారు. 161/4తో భారత్ తొలి సెషన్ను ముగించింది. పుజారా, రహానె వికెట్లను కోల్పోయిన భారత్ మానసికంగా దెబ్బతింది.
రెండో సెషన్ : తోక ప్రతాపం మొదలైంది
ఫస్ట్ క్లాస్ క్రికెట్లో ఐదో స్థానంలోనే ఆడిన మయాంక్ అగర్వాల్.. జాతీయ జట్టుకు తొలిసారి ఈ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. 75 బంతుల్లో 3 ఫోర్లతో 38 పరుగులు చేసిన మయాంక్ నిలకడగా రాణించాడు. రెండో సెషన్ ఆరంభంలోనే మయాంక్ వికెట్ కోల్పోయాడు. రిషబ్ పంత్ (23, 29 బంతుల్లో 2 ఫోర్లు) దూకుడుగా ఆడేందుకు ప్రయత్నించి వికెట్ సమర్పించుకున్నాడు. 186/6తో భారత్ రెండో సెషన్లోనే బ్యాటింగ్ లైనప్ను కోల్పోయింది. ఆరంగేట్ర ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ (62), షార్దుల్ ఠాకూర్ (67)లు ఏడో వికెట్కు కండ్లుచెదిరే భాగస్వామ్యం నమోదు చేశారు. లోయర్ ఆర్డర్ను సులువుగా సాగనం పవచ్చనే ఆస్ట్రేలియా ఆశలపై ఈ జోడీ నీళ్లు చల్లింది. వాషింగ్టన్ సుందర్ (38), షార్దుల్ ఠాకూర్ (33)లు టీ విరామ సమయానికి భారత్ను మెరుగైన స్థితిలో నిలిపారు. సుందర్, ఠాకూర్ మెరుపులతో రెండో సెషన్ను భారత్ 253/6తో సంతృప్తిగా ముగించింది.
మూడో సెషన్ :
తొలి ఇన్నింగ్స్ లోటు తక్కువే!
సుమారు 150 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటు ప్రమాదంలో పడిన భారత్ను టెయిలెండర్ల ఆదుకున్నారు. ఏడు ఫోర్లతో 108 బంతుల్లో వాషింగ్టన్ సుందర్ అరంగేట్ర ఇన్నింగ్స్లోనే అర్థ సెంచరీ పూర్తి చేశాడు. షార్దుల్ ఠాకూర్ 8 ఫోర్లు, రెండు సిక్సర్లతో 90 బంతుల్లోనే 50 పరుగుల మైలురాయి చేరుకున్నాడు. వాషింగ్టన్, షార్దుల్ క్రీజులో ఉండగా ఆసీస్ తొలి ఇన్నింగ్స్ను అందుకునేలా కనిపించిన భారత్.. ఆ ఇద్దరి నిష్క్రమణతో స్వల్ప ఆధిక్యం కోల్పోయింది. మహ్మద్ సిరాజ్ (13, 10 బంతుల్లో 2 ఫోర్లు) ఒక్కడే రెండు బౌండరీలతో మెరిశాడు. నవదీప్ సైని (5) త్వరగా వికెట్ కోల్పోయాడు. 111.4 ఓవర్లలో భారత్ 336 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఆస్ట్రేలియా పేసర్ జోశ్ హజిల్వుడ్ (5/57) ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. మిచెల్ స్టార్క్ (2/88), పాట్ కమిన్స్ (2/94)లు రెండేసి వికెట్లు పడగొట్టారు. ఆస్ట్రేలియాకు 33 పరుగుల స్వల్ప తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం లభించింది.
మూడో సెషన్ ఆఖర్లో ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్లో ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. సిడ్నీ టెస్టులో రెండుసార్లు, బ్రిస్బేన్ టెస్టు తొలి ఇన్నింగ్స్లో విఫలమైన స్టార్ ఓపెనర్ డెవిడ్ వార్నర్ (20 నాటౌట్) గబ్బాలో గర్జించేందుకు సిద్ధమయ్యాడు. 22 బంతుల్లోనే 3 ఫోర్లతో చెలరేగాడు. ఆరు ఓవర్లలోనే ఆసీస్ 21 పరుగులు సాధించింది. మరో ఓపెనర్ మార్కస్ హారీశ్ (1 నాటౌట్) పరుగుల ఖాతా తెరిచాడు. మహ్మద్ సిరాజ్, నటరాజన్, వాషింగ్టన్ సుందర్లు ఆరు ఓవర్లలో ఆసీస్ను ఒత్తిడిలో నెట్టలేకపోయారు.
స్కోరు వివరాలు :
ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ : 369 ఆలౌట్
భారత్ తొలి ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ (సి) మిచెల్ స్టార్క్ (బి) నాథన్ లయాన్ 44, శుభ్మన్ గిల్ (సి) స్టీవ్ స్మిత్ (బి) పాట్ కమిన్స్ 7, చతేశ్వర్ పుజారా (సి) టిమ్ పైనె (బి) హజిల్వుడ్ 25, అజింక్య రహానె (సి) మాథ్యూ వేడ్ (బి) మిచెల్ స్టార్క్ 37, మయాంక్ అగర్వాల్ (సి) స్టీవ్ స్మిత్ (బి) హజిల్వుడ్ 38, రిషబ్ పంత్ (సి) కామెరూన్ గ్రీన్ (బి) హజిల్వుడ్ 23, వాషింగ్టన్ సుందర్ (సి) కామెరూన్ గ్రీన్ (బి) మిచెల్ స్టార్క్ 62, ఠాకూర్ (బి)కమిన్స్ 67, నవదీప్ సైని (సి) స్టీవ్ స్మిత్ (బి) హజిల్వుడ్ 5, మహ్మద్ సిరాజ్ (బి) హజిల్వుడ్ 13, టి నటరాజన్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 14, మొత్తం : (111.4 ఓవర్లలో ఆలౌట్) 336.
వికెట్ల పతనం : 1-11, 2-60, 3-105, 4-144, 5-161, 6-186, 7-309, 8-320, 9-328, 10-336.
బౌలింగ్ : మిచెల్ స్టార్క్ 23-3-88-2, జోశ్ హజిల్వుడ్ 24.4-6-57-5, పాట్ కమిన్స్ 27-5-94-2, కామెరూన్ గ్రీన్ 8-1-20-0, నాథన్ లయాన్ 28-9-65-1, మార్నస్ లబుషేన్ 1-1-0-0.
ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్ : మార్కస్ హారిశ్ బ్యాటింగ్ 1, డెవిడ్ వార్నర్ బ్యాటింగ్ 20, ఎక్స్ట్రాలు : 0, మొత్తం :(6 ఓవర్లలో) 21.
బౌలింగ్ : మహ్మద్ సిరాజ్ 2-1-12-0, నటరాజన్ 3-0-6-0, వాషింగ్టన్ సుందర్ 1-0-3-0.