Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బ్రిస్బేన్ (ఆస్ట్రేలియా)
భారత జట్టు ముందు మరో చారిత్రక సిరీస్ విజయం నిలిచింది!. సిరీస్ ఆరంభానికి ముందు, సిరీస్ మొదలైన తర్వాత, సిరీస్ మధ్యలో... ఇలా ప్రతి దశలోనూ కీలక ఆటగాళ్లు జట్టుకు దూరమయ్యారు. సిరీస్ నిర్ణయాత్మక నాల్గో టెస్టులో నిజానికి భారత్ ద్వితీయ శ్రేణి జట్టును బరిలోకి దింపాల్సిన దుస్థితి ఏర్పడింది. అయినా, భారత జట్టు ఎక్కడా తడబడలేదు. అత్యుత్తమ ఫార్మాట్లో అద్వితీయ ప్రదర్శనే చేసింది. మెల్బోర్న్లో గొప్ప విజయం. సిడ్నీలో అపూర్వ డ్రా సిరీస్లో భారత్ను ఫేవరేట్గా నిలిపాయి. గబ్బా టెస్టులోనూ తొలి ఇన్నింగ్స్లో భారత టెయిలెండర్లు వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్లు చిరస్మరణీయ ఇన్నింగ్స్లు నమోదు చేశారు. బౌలింగ్ విభాగంలో సీనియర్లు అందరూ దూరమైన వేళ.. హైదరాబాదీ మహ్మద్ సిరాజ్ పేస్ దళానికి నాయకత్వం వహించాడు. ఐదు వికెట్ల ప్రదర్శనతో గబ్బాలో భారత్ను రేసులో నిలిపాడు. ఈ ప్రదర్శనలు అన్నీ లెక్కలోకి రావాలంటే, నేడు ఆఖరు రోజు భారత బ్యాట్స్మెన్ నిలవాలి. వర్షం ప్రభావం చూపనున్న ఆఖరు రోజు ఆటలో మరో 324 పరుగులు చేయటం కష్టమే. కానీ మేఘావృతమై ఉన్న వాతావరణంలో పది వికెట్లు కూల్చేందుకు ఆస్ట్రేలియాకు ఓ సెషన్ సరిపోతుంది.
గబ్బా టెస్టులో ఆస్ట్రేలియాకు వాస్తవిక విజయావకాశాలు అధికమే, కానీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ను దృష్టిలో ఉంచుకుంటే నేడు కంగారూ జట్టు 30 పాయింట్ల కోసం సాహసం చేయటం కంటే పది పాయింట్లతో సర్దుకునేందుకు ఆలోచన చేయనుంది. ఈ మ్యాచ్ను పది పాయింట్లతో ముగించటం భారత్కు సైతం పెద్ద సమస్య కాదు. స్వదేశంలో ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు ఉన్న నేపథ్యంలో భారత్ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్ రేసులో ఫైనల్స్ బెర్త్ను ఖాయం చేసుకునేందుకు దీమాగా కనిపిస్తోంది. ఆస్ట్రేలియాకు సైతం ఈ డ్రా పెద్ద ప్రభావం చూపబోదు. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ ప్రతిష్టాత్మకమే కానీ, ఐసీసీ టెస్టు చాంపియన్షిప్స్ను సైతం గమనంలో ఉంచుకుని నేడు భారత్, ఆస్ట్రేలియాలు అంతిమ సమరానికి రానున్నాయి. సిరీస్ విజయానికి భారత్కు డ్రా సరిపోగా.. ఆసీస్కు కచ్చితంగా విజయమే కావాలి. మూడు సెషన్ల ఆట సాధ్యపడని ఆఖరు రోజు భారత్కు గెలుపు అవకాశాలు స్వల్పమే, కానీ ఆఖరు రోజు ఒత్తిడి పూర్తిగా కంగారూ జట్టుపైనే!.