Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బ్రిస్బేన్ విజయం వెనుక వాల్ కృషి
- రాహుల్ ద్రవిడ్ శ్రమ ఫలితమే ఇది
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులోనే దారుణ భంగపాటు. విరాట్ కోహ్లి ఉండగానే అనూహ్యంగా 36 పరుగులకే ఆలౌట్. ఇటువంటి పరాభవం అనంతరం పుంజుకోవటం సొంత పరిస్థితుల్లోనే కష్టం. అటువంటిది విదేశీ సిరీస్లో పుంజుకోవటం అసాధ్యమనే చెప్పాలి. ఆడిలైడ్ దారుణ పరాజయం అనంతరం మాజీ క్రికెటర్లు, విశ్లేషకులు భారత జట్టు పనైపోయిందని తేల్చేశారు. చరిత్ర సైతం అందుకు అనుకూలంగానే ఉండటంతో మాజీలు పెదవి విరిచేశారు.
పరాభవ పీడకలను ఆడిలైడ్లోనే భారత్ మరిచిపోవటం, మెల్బోర్న్లో బాక్సింగ్ పంచ్లు తాజాగా విసిరేందుకు జట్టు సంసిద్ధం కావటంలో టీమ్ ఇండియాను నడిపిన నాయకుడు అజింక్య రహానె. మెల్బోర్న్లో శతక జోరు చూపిన ఆయన.. జట్టును సిరీస్ రేసులో పోరాడేలా మార్గనిర్దేశం చేశాడు. భారత్ ఇప్పటికీ విరాట్ కోహ్లి యుగంలోనే ఉన్నప్పటికీ.. ఈ సిరీస్ విజయం రహానెదే.
నాయకుడిగా ముందుండి నడిపించింది రహానె అయినా.. సగానికి పైగా సీనియర్ క్రికెటర్లు దూరమైన ఆపత్కాలంలో యువ క్రికెటర్లు శుభ్మన్ గిల్, శార్దుల్ ఠాకూర్, నవదీప్ సైని, రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్లు అసమాన ప్రదర్శన చేశారు. భారత విజయంలో వీరిదే ముఖ్య భూమిక. ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి అంతర్జాతీయ వేదికపై వచ్చీ రాగానే చెలరేగటం ఉన్న కర్త, కర్మ, క్రియ రాహుల్ ద్రవిడ్!.
శ్రీనివాస్ దాస్ మంతటి
మూడు మ్యాచులు, ఐదు ఇన్నింగ్స్ల్లో 274 పరుగులు. సిడ్నీ నాల్గో ఇన్నింగ్స్లో మ్యాచ్ మలుపు తిప్పిన ఇన్నింగ్స్ 97 పరుగులు. బ్రిస్బేన్లో గబ్బా కోట బద్దలు కొట్టిన ఇన్నింగ్స్ అజేయ 89 పరుగులు. ఇది రిషబ్ పంత్ ప్రదర్శన.
శుభ్మన్ గిల్ అరంగేట్ర సిరీస్లో సాధించిన పరుగులు 259. అరంగేట్ర ఇన్నింగ్స్లో అర్థ సెంచరీ సహా గబ్బా ఛేదనలో 91 పరుగులతో భారత్ను లక్ష్యం దిశగా నడిపించాడు. గబ్బాలో ఆసీస్ పేసర్ల గర్జనకు పుజారా స్థాయి ఆటగాడే ఇబ్బంది పడినా..శుభ్మన్ గిల్ 90 శాతం నియంత్రణతో దూకుడుగా పరుగులు పిండుకున్నాడు.
అరంగేట్ర మ్యాచ్లోనే స్పిన్ ఆల్రౌండర్ వాషింగ్టన్ సుందర్ తొలి ఇన్నింగ్స్లో అసమాన 62 పరుగుల అర్థ సెంచరీ. ఛేదనలో రిషబ్ పంత్తో కలిసి అర్థ శతక భాగస్వామ్యం. గబ్బాలో 84 పరుగులు సహా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు.
2018లో అరంగేట్రం చేసినా.. 2021లో రెండో టెస్టు ఆడిన శార్దుల్ ఠాకూర్ కష్టాల్లో ఉన్న భారత్ను తొలి ఇన్నింగ్స్లో వాషింగ్టన్ సుందర్తో కలిసి 123 పరుగుల భారీ భాగస్వామ్యం నెలకొల్పాడు. 67 పరుగులతో తొలి ఇన్నింగ్స్లో అత్యధిక పరుగులు నమోదు చేశాడు. గబ్బాలో ఏడు వికెట్లు కూల్చి కంగారూలను శాసించాడు.
అరంగేట్ర సిరీస్లో మహ్మద్ సిరాజ్ చూపిన పరిణితి అమోఘం. మూడు టెస్టుల్లో 13 వికెట్లు కూల్చి, అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్గా నిలిచాడు. మూడేసి టెస్టులు ఆడిన సీనియర్లు బుమ్రా (11), అశ్విన్ (12)లు సైతం సిరాజ్ తర్వాతి స్థానంలోనే ఉన్నారు. గబ్బాలో ఐదు వికెట్ల ప్రదర్శనతో కంగారూ దూకుడుకు కళ్లెం వేశాడు.
ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో భారత యువ క్రికెటర్ల ప్రదర్శన ఇది. ఆస్ట్రేలియాకు బయల్దేరడానికి ముందే సీనియర్ పేసర్లు ఇషాంత్ శర్మ, భువనేశ్వర్ కుమార్లు దూరమయ్యారు. విధ్వంసక ఓపెనర్ రోహిత్ శర్మ తొలి రెండు టెస్టులకు అందుబాటులో లేడు. ఆడిలైడ్లో దారుణ ఓటమి. ఆ మ్యాచ్ అనంతరం ప్రధాన బ్యాట్స్మన్ విరాట్ కోహ్లికి తోడు సీనియర్ పేసర్ మహ్మద్ షమి సైతం దూరమయ్యాడు. అసలే దారుణ పరాజయం, ఆపై కీలక ఆటగాళ్లు లేకుండా పోయారు. ఈ పరిస్థితుల్లో రెండో టెస్టులో భారత్ పోటీ ఇవ్వటంపైనా అనుమానాలు వ్యక్తమయ్యాయి. నాయకుడిగా పగ్గాలు అందుకున్న అజింక్య రహానె బాక్సిండ్ డే టెస్టులో ఆ గండాన్ని దాటేశాడు. బ్యాటింగ్లో స్వయంగా ముందుండి శతకంతో నడిపించాడు. బౌలర్ల ప్రణాళికల మేరకు ఫీల్డింగ్ మొహరింపులు చేశాడు. ఒక్కో బ్యాట్స్మన్కు ఒక్కో వ్యూహంతో ఆసీస్ బ్యాట్స్మెన్ను కట్టిపడేశాడు. అక్కడితో కెప్టెన్గా అజింక్య రహానె విషమ పరీక్ష పాసయ్యాడు. భారత్ విదేశీ గడ్డపై అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది. సిరీస్ను 1-1తో సమం చేసింది.
మెల్బోర్న్ విజయంతో సిరీస్లో భారత్ సమవుజ్జీగా నిలిచినా..డ్రెస్సింగ్రూమ్ సమస్యలు రెట్టింపు అయ్యాయి. బ్యాటింగ్ లైనప్లో రోహిత్ శర్మ అందుబాటులోకి వచ్చినా.. సీనియర్ పేసర్ ఉమేశ్ యాదవ్ దూరమయ్యాడు. బౌలింగ్ విభాగం మరీ బలహీనమైంది. అయినా, ఆ టెస్టులో అరంగేట్ర గిల్ సహా రిషబ్ పంత్లు మెరిశారు. హనుమ విహారి, అశ్విన్ తెగువ, సహనంతో సిడ్నీలో భారత్ దాదాపు అద్భుతానికి చేరువగా వచ్చింది. గొప్ప పోరాట ప్రదర్శన అనంతరం సమరం సిడ్నీ నుంచి బ్రిస్బేన్కు చేరుకుంది. అక్కడ సమస్యల సుడిగుండంలో పడింది భారత్. జశ్ప్రీత్ బుమ్రా సహా అశ్విన్, జడేజా, హనుమ విహారిలు జట్టుకు దూరమయ్యారు. పేసర్లు సిరాజ్, సైని, శార్దుల్, నటరాజన్లకు ఇదే తొలి సిరీస్. స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్కు అరంగేట్ర టెస్టు. కీలక ఆటగాళ్లు గాయాల బారిన పడటంతో అసలు తుది జట్టును బరిలోకి నిలపగలే స్థితిలో లేకుండా పోయింది భారత్ దుస్థితి. ప్రథమ ప్రాధాన్య ఆటగాళ్లు దూరమైన వేళ భారత్ నిజానికి ద్వితీయ శ్రేణి జట్టునే బ్రిస్బేన్లో దింపగలిగింది. ఆ జట్టుతో కనీసం డ్రా చేసుకున్నా గొప్పే. కానీ భారత్ చరిత్రను తిరగరాసింది. 1988 తర్వాత బ్రిస్బేన్లో టెస్టు ఓడని కంగారూకు గర్వభంగం చేసింది. అద్వితీయ విజయంతో 2-1తో బోర్డర్ గవాస్కర్ టెస్టు సిరీస్ను సాధించింది. ఈ ఎపిసోడ్లో విజయం వెనుక కనిపించని వ్యక్తి ఒకరు ఉన్నారు. అతడే భారత క్రికెట్ దిగ్గజం రాహుల్ ద్రవిడ్.
సైన్యాన్ని సిద్ధం చేశాడు : 2019 ప్రపంచకప్కు భారత జట్టు నిర్మాణంలో కీలక దశ. విదేశీ కోచ్కు ఉద్వాసనకు పలికిన బీసీసీఐ స్వదేశీ కోచ్ వేటలో పడింది. అప్పుడు అందరి నోటా ఒకటే మాట. రాహుల్ ద్రవిడ్ భారత చీఫ్ కోచ్గా రావాలని కోరుకున్నారు. కోరుకుంటే జాతీయ జట్టు చీఫ్ కోచ్ పదవి వరించే అవకాశం ఉందని తెలిసినా.. అతడు మాత్రం భిన్నమైన మార్గం ఎంచుకున్నాడు. జాతీయ జట్టుకు ప్రతిభావంతులైన కుర్రాళ్లను అందించటం, వర్థమాన తారలను నాణ్యమైన క్రికెటర్లుకు తయారు చేసే ప్రక్రియలో నిమగమయ్యేందుకు ఓటేశాడు. అండర్-19, భారత్-ఏ జట్ల కోచ్గా ద్రవిడ్ రాకతో జూనియర్ క్రికెట్కు వన్నె వచ్చింది. గత 3-4 ఏండ్లలో భారత యువ జట్లు లెక్కలేనన్ని విదేశీ పర్యటనలకు వెళ్లాయి. సీనియర్ జట్టు పర్యటనకు ముందు, లేదా సమాంతరంగా భారత్-ఏ జట్టు విదేశీ సిరీస్లు ఆడింది.
ఇప్పుడు సీనియర్ జట్టులో మెరుస్తున్న యువ తారలు అందరికీ మార్గదర్శకుడు రాహుల్ ద్రవిడే. దేశం నలుమూలలా ప్రతిభావంతులను జాతీయ క్రికెట్ అకాడమీ (ఎన్సీఏ) చీఫ్గా రాహుల్ ద్రవిడ్ అన్వేషించాడు. అండర్-19 జట్టు కోచ్గా ఫలితం కాదు ప్రదర్శన ముఖ్యమని యువ క్రికెటర్లకు ఉద్భోద చేశాడు. యువ జట్టు అండర్-19 ప్రపంచకప్ ఓడినప్పుడు సైతం అవే వ్యాఖ్యలను ఉటంకించాడు. జూనియర్ క్రికెట్లో నేర్చుకోవాలని.. ఫలితం గురించి పట్టించుకోవద్దని సూచించాడు. క్రమశిక్షణతో క్రికెట్ ఆడటం యువ క్రికెటర్లకు నేర్పించాడు. పృథ్వీ షా, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్, శార్దుల్ ఠాకూర్, వాషింగ్టన్ సుందర్, మహ్మద్ సిరాజ్, నవదీప్ సైనిలు అందరూ భారత్-ఏ, అండర్-19 జట్టులో ద్రవిడ్ పర్యవేక్షణలో రాటుదేలినవారే. ఆస్ట్రేలియా పర్యటనలో ప్రతికూల పరిస్థితుల్లో తుది జట్టులో చోటు సాధించినా.. అద్భుత ప్రదర్శన చేయడానికి ద్రవిడ్ నుంచి నేర్చుకున్న పాఠాలే కారణం!. గత 3-4 ఏండ్లలో భారత పస్ట్ క్లాస్ క్రికెట్కు, అంతర్జాతీయ క్రికెట్కు మధ్య వ్యత్యాసాన్ని ద్రవిడ్ గణనీయంగా కుదించాడు. జాతీయ జట్టులోకి వచ్చీ రాగానే పరిణితితో ఆడగల క్రికెటర్లను సిద్ధం చేశాడు. ఒక్కమాటలో చెప్పాలంటే సీనియర్ జట్టుకు ముచ్చెమటలు పట్టించగల భారత్- ఏ జట్టును సిద్ధం చేసిన ఘనుడు రాహుల్ ద్రవిడ్.
నిబద్ధత కలిగిన వ్యక్తులు యువ తరానికి మార్గనిర్దేశం చేస్తే ఫలితాలు ఏ విధంగా ఉంటాయో రాహుల్ ద్రవిడ్ నిరూపించాడు. ద్రవిడ్ అండర్-19 కోచ్గా ఉన్నప్పుడే ప్రపంచ క్రికెట్ దృష్టి జూనియర్ క్రికెట్పై పడింది. ఇతర దేశాల బోర్డులు సైతం తమ కుర్రాళ్లకు ద్రవిడ్ స్థాయి వ్యక్తి సేవలు అందించేందుకు ఆసక్తి చూపాయి. కానీ ప్రాధాన్యత లేని స్థానంలో ఇతర దేశాలకు దిగ్గజాలు ముందుకు రాలేదు. అండర్-19, భారత్-ఏ తరఫునే విదేశీ గడ్డపై అద్భుత ఫలితాలు రాబట్టిన ద్రవిడ్.. ఆస్ట్రేలియా పర్యటనలో అసలు సిసలు విజయాన్ని అందుకున్నాడు. జాతీయ జట్టుకు మెరికల్లాంటి క్రికెటర్లను అందించే లక్ష్యంతో, యువ తరానికి మార్గనిర్ధేశనం చేసే సంకల్పంతో జూనియర్ క్రికెట్ శిక్షణ పగ్గాలు అందుకున్న రాహుల్ ద్రవిడ్కు బ్రిస్బేన్లో కుర్రాళ్లు సరైన గౌరవం అందించారు. కలలో సైతం ఊహించలేని విజయాన్ని భారత జట్టు బ్రిస్బేన్లో సాధించింది అనగానే అందరి దృష్టి రాహుల్ ద్రవిడ్పైనే పడింది. రాహుల్ ద్రవిడ్ వంటి క్రికెటర్ను కలిగి ఉండటం భారత క్రికెట్ చేసుకున్న అదృష్టమనే చెప్పాలి
ఈ పరిస్థితుల్లో భారత్ ఫర్వాలేదనుకునే తుది జట్టును బరిలోకి దింపుతోంది. అందుకు కారణం, గత 3-4 ఏండ్ల భారత-ఏ జట్ల పర్యటనలను ప్రశంసించాలి. అవే లేకుంటే ఫస్ట్ క్లాస్, అంతర్జాతీయ క్రికెట్ అంతరం భారీగా ఉండేది. తాను ఎంచుకున్న మార్గంలో విజయం సాధించిన రాహుల్ ద్రవిడ్కు ఇక్కడ ప్రత్యేక ధన్యవాదాలు తెలపాలి'
- హర్షాభోగ్లే, క్రికెట్ వ్యాఖ్యాత
యువ క్రికెటర్లకు గొప్ప మార్గదర్శనం
నేషనల్ క్రికెట్ అకాడమీ, భారత్- ఏ జట్ల నుంచి ఎదిగిన ఈ క్రికెటర్ల వెనుక ఉన్న వ్యక్తి రాహుల్ ద్రవిడ్. గిల్, శార్దుల్, సుందర్, సిరాజ్, సైని, పంత్లు ద్రవిడ్ స్కూల్ నుంచి వచ్చినవారు. అద్వితీయ విజయాన్ని ఆస్వాదిస్తున్న తరుణంలో చురుకైన క్రికెట్ మేధస్సు రాహుల్ ద్రవిడ్ అభినందించాలి'
- విజయ్ లోకపల్లి, సీనియర్ పాత్రికేయులు