Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్తో సిరీస్పై సిరాజ్
- ఆసీస్ పై వికెట్లు తండ్రికి అంకితం
- త్వరలోనే పెళ్లిపీటలెక్కనున్న పేసర్
నవతెలంగాణ, హైదరాబాద్ : బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్గా నిలవటంతో పాటు ఆస్ట్రేలియాపై అసమాన విజయంలో ముఖ్య భూమిక వహించిన యువ పేసర్, హైదరాబాదీ క్రికెటర్ మహ్మద్ సిరాజ్. ఆస్ట్రేలియాపై మూడు టెస్టుల్లోనే సిరాజ్ 13 వికెట్లు కూల్చాడు. 2-1 సిరీస్ విజయం అనంతరం భారత క్రికెటర్లు గురువారం స్వదేశానికి చేరుకున్నారు. క్రికెటర్లు అందరికీ సొంత నగరాల్లో ఘన స్వాగతం లభించింది. హైదరాబాద్లో మహ్మద్ సిరాజ్కు ఘన స్వాగతం లభించింది. ఆసీస్తో సిరీస్ ఆరంభానికి ముందు కాలం చేసిన తండ్రి సమాధి వద్ద నివాళులు అర్పించిన సిరాజ్, అనంతరం క్రీడా శాఖ మంత్రి వి. శ్రీనివాస్ గౌడ్ను కలుసుకున్నాడు. సాయంత్రం తన ఇంటి వద్ద విలేకరులతో మాట్లాడాడు. 'సిరీస్ ఆరంభానికి ముందు తండ్రిని కోల్పోవటం మానసికంగా ఎంతో వేధన మిగిల్చింది. ఆ సమయంలో సహచర క్రికెటర్లు, కుటుంబ సభ్యులు ఓదార్చారు. మానసికంగా ధైర్యంగా ఉండేందుకు తోడ్పాటు అందించారు. బ్రిస్బేన్ టెస్టులో ప్రధాన పేసర్ను అనుకోలేదు. జట్టు ప్రణాళికలు, అవసరాల మేరకు ఆడాలని అనుకున్నాను. ఆస్ట్రేలియాపై తీసిన ప్రతి వికెట్ను నా తండ్రికి అంకితం ఇస్తున్నాను. ఆసీస్పై గెలుపు గర్వాని తలకెక్కించుకోను. రానున్న ఇంగ్లాండ్తో సిరీస్లో ఈ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతాను. ఇదే జోరు కొనసాగిస్తానని ఆశిస్తున్నాను. ఐపీఎల్లో ఇన్స్వింగర్లు సంధించి సక్సెస్ సాధించాను. అవే అస్త్రాలను ఆసీస్పైనా ప్రయోగించాను. విరాట్ కోహ్లి, అజింక్య రహానెలు ఇద్దరు మంచి కెప్టెన్లు. ఆ ఇద్దరి సారథ్యంలో ఆడటాన్ని ఆస్వాదించాను. ఐపీఎల్లోనూ విరాట్ కోహ్లి నాకు ఎంతో మద్దతుగా నిలిచాడు' అని మహ్మద్ సిరాజ్ అన్నాడు.
అంపైర్లు వెళ్లిపోమన్నారు! : ఆస్ట్రేలియాతో మూడో టెస్టులో మహ్మద్ సిరాజ్ కంగారూ దురభిమానుల నుంచి జాతి వివక్ష చవిచూసిన సంగతి తెలిసిందే. కొందరు అభిమానులు వరుసగా రెండో రోజు సిరాజ్ను ఉద్దేశించి 'బ్రౌన్ మంకీ' అని పిలిచారు. జాతి వివక్ష వ్యాఖ్యల నేపథ్యంలో ' భారత జట్టు మ్యాచ్ను మధ్యలోనే బాయ్ కాట్ చేసే అవకాశాన్ని అంపైర్లు ఇచ్చారని' సిరాజ్ తెలిపాడు. జాతి వివక్ష వ్యాఖ్యలు నన్ను మానసికంగా మరింత ధృడం చేశాయి. జాతి వివక్షను తక్షణమే కెప్టెన్ అజింక్య రహానె తెలియజేశాను. టెస్టు మధ్యలోనే వెళ్లిపోయే అవకాశం అంపైర్లు కల్పించారు. కానీ కెప్టెన్ రహానె అందుకు అంగీకరించలేదు. భారత్ ఎటువంటి తప్పు చేయలేదు, మేము ఆడతామని చెప్పాడని సిరాజ్ అన్నాడు. సిరాజ్పై జాతి వివక్షపై క్రికెట్ ఆస్ట్రేలియా సహా పలువురు క్రికెటర్లు క్షమాపణలు చెప్పిన సంగతి తెలిసిందే. స్వదేశానికి తిరిగొచ్చిన మహ్మద్ సిరాజ్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. పెళ్లి కుదిరిన విషయాన్ని సిరాజ్ అంగీకరించినా, వివరాలు వెల్లడించేందుకు నిరాకరించాడు.