Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సిడ్నీ టెస్టుపై హనుమ విహారి
- ఈ విజయం మరింత ప్రత్యేకం
జనవరి 19న గబ్బాలో భారత్ చారిత్రక విజయం నమోదు చేసింది. టీమ్ ఇండియా గెలుపు సంబురాలు పంచుకునేందుకు తెలుగు తేజం హనుమ విహారి బ్రిస్బేన్లో లేడు. కానీ సిడ్నీలో అతడి వీరోచిత పోరాటమే గబ్బాలో ఆకాశన్నంటిన సంబురాలకు మూలమని భారత జట్టు మరిచిపోలేదు. బోర్డర్-గవాస్కర్ టెస్టు సిరీస్ కథానాయకుల్లో హనుమ విహారి పేరు చిరస్థాయిగా నిలిచిపోయే ఇన్నింగ్స్ను అతడు సిడ్నీలోనే ఆడేశాడు. గాయంతో ముందే స్వదేశానికి చేరుకున్న హైదరాబాదీ క్రికెటర్ సిడ్నీ టెస్టు మ్యాచ్ పరిస్థితులు, ఆడిలైడ్ పరాజయం అనంతరం విషయాలను పంచుకున్నాడు.
నవతెలంగాణ-హైదరాబాద్
అశ్విన్ కు వెన్నునొప్పి. మీకు తొడకండరం గాయం. సిడ్నీ టెస్టు ఆఖరు రోజు ఆటలో దీన్ని ఏవిధంగా అధిగమించారు?
నేను, అశ్విన్ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేసుకున్నాం. తొడ కండరం గాయంతో నేను ఎక్కువగా ముందుకు సాగలేను. అందుకే నాథన్ లయాన్ను ఎక్కువగా అశ్విన్ ఎదుర్కొన్నాడు. పేస్ బౌలర్లను ఎదుర్కొవటంలో నేను ఇబ్బంది పడలేదు. ఇది మా ఇద్దరికి మంచి ఫలితం ఇచ్చింది. మేము ఇద్దరు తీసుకున్న వ్యూహాత్మక నిర్ణయం ఇది, డ్రెస్సింగ్ రూమ్ నుంచి సైతం మాకు సందేశం వచ్చింది. కానీ మేము బంతిని చూసి ఆడాలనే జోన్లో ఉన్నాం. అదే సమయంలో విపరీతమైన నొప్పి ఉన్నప్పటికీ, గాయం నొప్పి మమ్మల్ని ప్రభావితం చేయకూడదని అనుకున్నాం. గాయం వేధిస్తున్నా.. ఆ సమయంలో మ్యాచ్ను కాపాడటమే మాకు ప్రధానమని అనిపించింది.
రెండో ఇన్నింగ్స్కు ముందే గాయపడ్డారు. మ్యాచ్ సాగుతున్న కొద్దీ గాయం ఎంత తీవ్రతరం అయ్యింది?
నిజానికి ఆది నుంచి గాయం నొప్పి విపరీతంగా ఉంది. మ్యాచ్ ముగింపు సమయానికి నొప్పి వర్ణనాతీతం. పెయిన్ కిల్లర్స్ తీసుకున్నా, నొప్పి ఎంతో బాధించింది. పెయిన్ కిల్లర్స్ ప్రభావం కేవలం నేను క్రీజులోకి వెళ్లి బ్యాటింగ్ చేసేంతవరకే. కానీ గాయం నొప్పి అన్ని సమయాల్లో ఉంది. మేము బ్యాటింగ్ చేసిన 35-40 ఓవర్లలో మా లక్ష్యం మ్యాచ్ను కాపాడుకోవటం. నొప్పి బాధించినా, లేకపోయినా మా లక్ష్యం అదే. మా శ్రమకు ఫలితం దక్కింది.
బ్యాటింగ్కు రావడానికి ముందే అశ్విన్ గాయపడ్డాడు. అతడు క్రీజులోకి రాకముందే మీరు గాయపడ్డారు. మీ ఇద్దరి మధ్య జరిగిన తొలి సంభాషణ ఎలా సాగింది?
అశ్విన్ క్రీజులోకి రాగానే నేను ఒక్కటే చెప్పాను. ' చూడు, నేను పరుగెత్తలేను. మనం చేయగలిగిన ఒకే ఒక్క పని క్రీజులో నిలబడి ఆడటం'. అందుకు అశ్విన్ సైతం ' నాదీ అదే పరిస్థితి బ్రదర్. సింగిల్స్ కోసం నేనూ అడగలేను' అన్నాడు. అది మా ఇద్దరికి మంచిగా పని చేసింది. మా ఇద్దరికి స్పష్టత ఉండటంతో క్రీజులో సమన్వయంతో నిలబడ్డాం. క్రీజులో అశ్విన్ చూపిన ఆత్మవిశ్వాసం, పట్టుదల, తెగువ చూసి నాలోనూ ఆత్మవిశ్వాసం పెరిగింది. ఐదో రోజు ఆట ఆఖరు వరకూ అశ్విన్ క్రీజులో నిలబడతాడని నాకు అనిపించింది. మా ఏకాగ్రతను ఏదీ చెదరగొట్టలేదనే జోన్లో మేము ఇద్దరం ఉన్నాం.
ఐదో రోజు వికెట్పై అదీ ఆఖరు సెషన్లో ఆడటం, ఫీల్డర్లు దగ్గరగా మొహరించటం.. ఇవన్నీ కల మాత్రమే కనగలం. ఆ అనుభూతిని, అనుభవాన్ని మాటల్లో వర్ణించలేను. కానీ నేను నిజంగా గర్వపడగల ప్రదర్శన అది. ఇన్నేండ్లలో పడిన శ్రమ, ఫస్ట్ క్లాస్ క్రికెట్లో పడిన కష్టం సిడ్నీలో ఈ కఠిన సవాల్ను ఎదుర్కొన్నప్పుడు ఫలితాన్ని ఇచ్చాయి. కష్టానికి ఫలితం లభించిందనే సంతృప్తి దొరికింది.
అశ్విన్తో మీ సంభాషణలు స్టంప్ మైక్లో రికార్డు అయ్యాయి. కొన్నిసార్లు తమిళం, తెలుగులోనూ మాట్లాడుకున్నారు?
మనం ఎప్పుడైతే డ్రా కోసం ఆడుతున్నామో.. సమాచారం, సమన్వయం అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. కొన్నిసార్లు మనం ఏకాగ్రతను కోల్పోతాం. ఆ సమయంలో ఏ చిన్న తప్పును సైతం భరించలేం. అందుకే నేను, అశ్విన్ ఓవర్ల మధ్య, బాల్స్ మధ్య ఎక్కువగా మాట్లాడుకున్నాం. ఒక్కో బంతిని, ఒక్కో ఓవర్ను లక్ష్యంగా పెట్టుకున్నాం. ఒకరికొకరం ఇంకో పది బంతులు.. ఇంకో పది బంతులు అని చెప్పుకున్నాం. అలాగే ఆఖరు వరకూ క్రీజులో నిలిచాం. సిడ్నీ టెస్టు మ్యాచ్ది అమోఘమైన అనుభవం. ఐదేండ్ల తర్వాత ఆ టెస్టు ప్రదర్శన గురించి ఆలోచన చేస్తే.. కచ్చితంగా నేను, అశ్విన్ పడిన శ్రమకు గర్వపడుతాను. సిడ్నీలో మా కథను నా మనవలు, మనవరాళ్లకు చెబుతాను.
సిడ్నీ టెస్టు ఐదో ఆటకు ముందు, టీ విరామం సమయంలో డ్రెస్సింగ్ రూమ్లో చర్చలు ఎలా నడిచాయి?
వాస్తవానికి ఐదో రోజు ఆటకు ముందు సాధారణంగానే మాట్లాడుకున్నాం. 'మ్యాచ్ను గెలవాలని, కాపాడాలని ఆలోచన అవసరం లేదు. తొలి ఇన్నింగ్స్లో ఏ విధంగా ఆడారో అలాగే ఆడండి' అని చెప్పారు. మేము అదే చేశాం. చతేశ్వర్ పుజారా తనదైన శైలిలో బ్యాటింగ్ చేశాడు. రిషబ్ పంత్ ఇన్నింగ్స్తో మ్యాచ్ను సొంతం చేసుకుంటా మనే నమ్మకం కలిగింది. పుజారా అవుటైనా.. జడేజా గాయపడకపోతే, నేనూ ఫిట్గా ఉంటే మాకు సిడ్నీలో విజయావకాశాలు ఉన్నాయి. అక్కడ మేం 136 పరుగులే చేయాల్సింది. కానీ అప్పటికే మేము గాయపడ్డాం. నేను పరుగెత్తలేను, జడేజా బ్యాట్ పట్టలేడు, అశ్విన్ 50 శాతం ఫిట్నెస్తోనే ఉన్నాడు. అందుకే ఓ అడుగు వెనకేశాం. అయినా, అది విజయంతో సమానమైన డ్రా.
టీ విరామంలో నేను డ్రెస్సింగ్రూమ్కు వెళ్లగానే.. సహాయక సిబ్బంది నాతో ఓ విషయం చెప్పారు. ' నువ్వు జట్టుకు ఓ డ్రా రుణపడి ఉన్నావు. ఎందుకంటే తొలి రెండు టెస్టుల్లో జట్టు నీపై నమ్మకం ఉంచింది' అని చెప్పారు. తొలి రెండు మ్యాచుల్లో పరుగులు చేయకపోయినా నా బ్యాటింగ్ బాగుంది. సిడ్నీలో సమస్య పరుగులు కాదు, ఆ సెషన్లో నేను క్రీజులో నిలబడటం జట్టుకు అవసరం. దాన్ని నేను సవాల్గా తీసుకున్నాను. జట్టు నాపై ఉంచిన నమ్మకాన్ని తిరిగి ఇచ్చేందుకు, చివరి సెషన్లో నిలవాలని నాకు నేను సవాల్గా తీసుకున్నాను.
జట్టుకు డ్రా రుణపడ్డావని ఎవరు అన్నారు?
(నవ్వుతూ)..నిజానికి ఫీల్డింగ్ కోచ్ ఆర్. శ్రీధర్ సర్ అన్నాడు. ఆయన నాకు బాగా సన్నిహితం. నా కెరీర్ ఆరంభం నుంచీ ఆయన నన్ను చూస్తున్నారు. ఈ మాటను పాజిటివ్గానే చెప్పారు. దాన్ని నేను సవాల్గా స్వీకరించాను. జట్టుకు నేను ఇది రుణపడ్డాను, ఆ ఇన్నింగ్స్లో నా క్యారెక్టర్ చూపించాను. ఆ గడ్డు పరిస్థితుల నుంచి జట్టు బయటపడగలిగింది.
36 పరుగులకే పతనం జట్టుపై ఎటువంటి ప్రభావం చూపించింది?
నిజాయితీగా చెప్పాలంటే, అది బాధించింది. ఆ ఓటమి బాధ పెట్టకుంటే, మా జట్టులోనే ఏదో లోపం ఉందని అనుకోవాలి. అది ఎంతో బాధించింది. కానీ తర్వాతి రోజు జట్టు సమావేశంలో.. ఇక నుంచి మూడు టెస్టుల సిరీస్గా భావించి ఆడాలనుకున్నాం. అలాగే ఆడాం, గెలిచాం. ఆ దృక్పథం మాకు మేలు చేసింది. ఆడిలైడ్ ఓటమిని దాటేసి, ముందుకు సాగిపోయాం. ఆ ప్రదర్శన మాపై ప్రతికూల ప్రభావం చూపకూడదని అనుకున్నాం. ఓటమిని అంగీకరించి, చేతులెత్తేయటం సులువే, కానీ మేము ఆ పని చేయలేదు. మెల్బోర్న్లో మా పోరాట స్ఫూర్తి ప్రదర్శించాం.
రెండేండ్ల క్రితం ఆస్ట్రేలియాలో సిరీస్ సాధించారు. 2018 విజయాన్ని, ఈ గెలుపు ఏ విధంగా చూస్తారు?
ఈ రెండు విజయాలు అత్యంత ముఖ్యమైనవి. అయితే, ప్రస్తుత సిరీస్ విజయం ఎంతో ప్రత్యేకమైనది. మైదానం వెలుపల, మైదానం లోపల మరింత సవాళ్లతో కూడుకున్నది. ఆస్ట్రేలియా జట్టు ఈ సారి మరింత బలంగా ఉంది. గాయాల కారణంగా ఎంతోమంది క్రికెటర్లను భారత్ కోల్పోయింది. ఆడిలైడ్లో అటువంటి ఓటమి తర్వాత, పుంజుకోవటం సిరీస్ విజయం సాధించటం అద్భుతం. 2018-19 సిరీస్ విజయానికి ప్రస్తుత సిరీస్ గెలుపు ఓ మెట్టు పైనే ఉందని చెప్పగలను.