Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- భారత్పై విజయానికి చెమటోడ్చండి
- ఇంగ్లాండ్ క్రికెట్ జట్టుకు స్వాన్ సూచన
లండన్ : ఆస్ట్రేలియాలో వరుసగా రెండో టెస్టు సిరీస్ విజయం అనంతరం భారత క్రికెట్ జట్టు శత్రు దుర్బేధ్యమైన జట్టుగా కనిపిస్తోంది. ఇప్పుడు ప్రపంచ క్రికెట్లో అన్ని జట్లకూ భారత్పై విజయం ఓ స్వప్నం కానుందని ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ అభిప్రాయపడ్డాడు. బ్రిస్బేన్ విజయం, టెస్టు సిరీస్ సొంతం అనంతరం భారత్ అజేయ జట్టుగా అవతరించిందని స్వాన్ అన్నాడు. ఇంగ్లాండ్ క్రికెటర్లకు యాషెస్ వ్యామోహం ఉందని, ఇక ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా ఎంతమాత్రం అగ్ర జట్టు కాదు, భారత్పై గెలిచేందుకే ఇంగ్లాండ్ జట్టు పరితపించాలని స్వాన్ సూచించాడు. ' ఇంగ్లాండ్ ఎప్పుడూ అంటూ ఉంటోంది.. యాసెస్ సిరీస్ వస్తోంది. ప్రపంచంలో ఆస్ట్రేలియా ఇక ఎంతమాత్రం అత్యుత్తమ జట్టు కాదు. ఆస్ట్రేలియా ఉత్తమ జట్టుగా ఉండేది, ఆ కాలం గడిచిపోయింది. అయినా, ఇంగ్లాండ్ ఆ వ్యామోహంలోనే ఉండిపోయింది. యాషెస్ సిరీస్ కోసం ఎదురుచూసే కాలం నుంచి దూరం జరగాల్సిన సమయం వచ్చింది. భారత్ను భారత్లో ఓడించటం యాషెస్ సిరీస్ కంటే గొప్ప విజయం కానుంది. 2012 నుంచి భారత్ స్వదేశంలో అజేయ జట్టుగా నిలిచింది. వికెట్లు తీయగల స్పిన్నర్లు లేకుండా, స్పిన్ను ఆడగల బ్యాట్స్మెన్ లేకుండా భారత్లో సిరీస్ నెగ్గటం సాధ్యం కాదు. 2012 సిరీస్లో కెపి పీటర్సన్ అద్భుతంగా స్పిన్ను ఎదుర్కొన్నాడు. దూకుడుగా, వినూత్నంగా స్పిన్పై ఎదురుదాడి చేశాడు. పీటర్సన్ స్టయిల్ నుంచి ఇంగ్లాండ్ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు. అతడి ప్రదర్శన నుంచి బ్లూప్రింట్ తీసుకోవాల్సి ఉంది' అని స్వాన్ అన్నాడు. ఫిబ్రవరి 5న చెన్నైలో తొలి టెస్టుతో భారత్లో ఇంగ్లాండ్ పర్యటన ఆరంభం కానుంది. భారత పర్యటనలో ఇంగ్లాండ్ నాలుగు టెస్టులు, ఐదు టీ20లు, మూడు వన్డేలు ఆడనుంది.