Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్ పై వ్యూహం జూన్లోనే మొదలైంది
- భారత బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్
టెస్టులు నెగ్గాలంటే పరుగులు కాదు, 20 వికెట్లు పడగొట్టగలిగే సత్తా ఉన్న బౌలర్లు కావాలి. ఎటువంటి పిచ్లపైనైనా ఇదే ఫార్ములా వర్తిస్తుంది. ఏ జట్టునైనా వారి సొంతగడ్డపైనే ఓడించాలంటే బౌలింగ్ బృందం మరింత పటిష్టంగా ఉండాలి. భారత్కు అటువంటి బలమైన బౌలింగ్ బృందం ఉందనటంలో ఎటువంటి సందేహం లేదు. కానీ గాయాల బారిన పడి వరుసగా ప్రధాన బౌలర్లందరూ దూరమయ్యారు. ద్వితీయ శ్రేణి, బెంచ్ బౌలర్లు, నెట్ బౌలర్లు తుది జట్టులోకి వచ్చారు. బెంచ్ బౌలర్లతో నెట్టుకొచ్చే స్థితి నుంచి బ్రిస్బేన్ గోడలు బద్దలుకొట్టే వరకు టీమ్ ఇండియా అద్వితీయం. ఆస్ట్రేలియాలో 2-1తో టెస్టు సిరీస్ విజయం వెనుక బౌలర్ల కృషి అమోఘం. కంగారూ పర్యటనలో బౌలింగ్ ప్రణాళికలు, సవాళ్లపై భారత జట్టు బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.
నవతెలంగాణ-న్యూఢిల్లీ
- మ్యాచ్ మ్యాచ్కు బౌలర్లను కోల్పోతూనే ఉన్నారు. అనుభవం లేని బౌలర్లే మిగిలారు. కెరీర్ తొలి, రెండో టెస్టులోనే రాణించేందుకు వారితో ఏం చెప్పారు?
ప్రత్యేకించి కోవిడ్ సమయంలో ఆస్ట్రేలియా పర్యటన అత్యంత సవాళ్లతో కూడుకున్నది. నెట్ బౌలర్లు అందరికీ జట్టుతో పాటే ఉంచాలని నిర్ణయం తీసుకుని చీఫ్ కోచ్ రవిశాస్త్రి చాలా మంచి పని చేశాడు. వన్డే సిరీస్ అనంతరం, చాలా మంది బౌలర్లు స్వదేశానికి వెళ్లాల్సింది. పర్యటన మధ్యలో ఎవరికైనా ఏమైనా జరిగితే, కోవిడ్ నిబంధనల నేపథ్యంలో కొత్త ఆటగాళ్లు జట్టుతో చేరటం ఇబ్బందికరం. నెట్ బౌలర్లు అందరూ ఉంటే, చూసుకుంటామని చెప్పాడు. నెట్ బౌలర్లు అందరూ చాలా కాలం నుంచి జట్టుతో పాటే ఉండటంతో అవసరాలు సులువుగా అర్థం చేసుకుంటారు. నెట్ బౌలర్లు జట్టుతో పాటు ఉండటం ఎంతగానో ఉపయోగపడింది.
- జశ్ ప్రీత్ బుమ్రా లేకపోయినా గబ్బాలో 20 వికెట్లు తీయగలమనే నమ్మకాన్ని మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని వంటి పేసర్లకు ఏ విధంగా కలిగించారు?
మేము ఎప్పుడూ చర్చించుకునేది నిలకడగా ప్రదర్శన చేయటం. అందరికీ మంచిగా బౌలింగ్ చేయగల నైపుణ్యం ఉంది. అందరికీ వికెట్లు తీయటంలో అనుభవం ఉంది. టెస్టు క్రికెట్ మిగతా ఫార్మాట్లకు భిన్నమేమీ కాదు. టెస్టు క్రికెట్లో బ్యాట్స్మన్ పొరపాటు చేసేందుకు గల అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి, అదే ప్రధాన వ్యత్యాసం. బౌలర్లు ఈ సన్నని వ్యత్యాసాన్ని తీసేయాలి. నెట్స్లో బౌలింగ్ చేసిన ప్రతిసారి, వారు ఏ లైన్లో వేస్తున్నారనే విషయాన్ని నాతో చర్చించేవారు.
ఆ రోజు నెట్స్లో ఏ విధంగా బౌలింగ్ చేశారనే అంశంపై సరైన ఫీడ్బ్యాక్ ఇవ్వటం నా బాధ్యత. మ్యాచ్లో ప్రయోగించాలనుకునే బంతులను ప్రతి నెట్ సెషన్లో ప్రాక్టీస్ చేస్తుంటారు. టెస్టు క్రికెట్లో ఒత్తిడి భిన్నంగా ఉంటుంది, కానీ ఒత్తిడిలోనూ బౌలర్లు గొప్పగా రాణించారు. సవాళ్లను స్వీకరించి అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ లక్షణమే వాళ్లను చాంపియన్లను చేసింది. అందుకే భారత బౌలర్లు ఆస్ట్రేలియాలో అద్భుతంగా రాణించారు.
- ఇషాంత్ శర్మ, మహ్మద్ షమిలు వీడ్కోలు పలికిన తర్వాత పేస్ విభాగంలో వారి స్థానాలను మహ్మద్ సిరాజ్, నవదీప్ సైని, శార్దుల్ ఠాకూర్లు భర్తీ చేయగలరనేందుకు బ్రిస్బేన్ టెస్టు మ్యాచ్ను ఓ సంకేతంగా భావించవచ్చా?
అది ఇంకా జరుగలేదు. ఆ ప్రక్రియ కోసం మేము గత మూడేండ్లుగా శ్రమిస్తున్నాం. అమోఘమైన నైపుణ్యమున్న బెంచ్ బౌలర్లు అవసరం, అప్పుడే అంతర్జాతీయ స్థాయిలో భారత్ నిలదొక్కుకోగలదు. సిరీస్లు, మ్యాచ్లకు రొటేషన్ పద్దతిలో ఆడేందుకు భారత్కు ఓ బౌలింగ్ బృందం అవసరం. అప్పుడే బౌలర్లు ప్రతి సిరీస్కు తాజాగా సిద్ధం కాగలరు. ప్రస్తుతం భారత్కు మంచి బెంచ్ బౌలర్లు ఉన్నారు. అవకాశం చిక్కినప్పుడు, దేశం తరఫున అద్భుతంగా ఆడుతున్నారు. ఏ పరిస్థితుల్లోనైనా, ఏ సమయంలోనైనా భారత్కు ఆడేందుకు అవసరమైన ఆత్మవిశ్వాసం ఈ పర్యటనతో బౌలర్లకు దక్కింది.
భారత్కు ఆడేందుకు సిద్ధంగా మన దగ్గర ఏడుగురు ఫాస్ట్ బౌలర్లు ఉన్నారు. ఆస్ట్రేలియాతో నాలుగు టెస్టులు, ఇప్పుడు ఇంగ్లాండ్తో ఐదు టెస్టులు.. ఈ అన్నింటిలోనూ మెరుగైన ప్రదర్శన చేయాలంటే, రిజర్వ్ బౌలర్లు అవసరం. నెట్ బౌలర్లకు సైతం మంచి క్రికెట్ ఆడిన అనుభవం ఉంది. ఈ అందరి బౌలర్లు రొటేషన్ పద్దతిలో అవకాశాలు అందుకుంటారు. సిరీస్ల వారీగా భారత్ ప్రతిసారీ అత్యుత్తమ తుది జట్టునే బరిలోకి దింపుతుంది. రొటేషన్ విధానం గురించి ఇప్పటికే అవసరమైన చర్చ నడిచింది.
- ఏ దేని బౌలర్ టెస్టు క్రికెట్ ఆడేందుకు సిద్ధంగా ఉన్నాడని ఎలా తెలుస్తుంది?
జాతీయ జట్టుకు ఎంపికైన ఏ బౌలర్ అయినా, ఆడేందుకు సిద్ధంగా ఉంటాడు. అంతర్జాతీయ స్థాయిలో ఉండే ప్రధాన సవాల్ నిలకడ. గత రెండు, మూడేండ్లుగా సైని, సిరాజ్, శార్దుల్లు భారత జట్టులోకి వచ్చీ వెళ్లినవారే. జాతీయ జట్టులో విజయం సాధించేందుకు ఏం కావాలో వారి స్పష్టంగా తెలుసు. భారత జట్టు విజయాన్ని విశ్లేషణ చేస్తే.. ఇషాంత్ వర్మ, జశ్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్ ప్రదర్శనలో కామన్గా ఉండేది నిలకడ. నెట్ బౌలర్లు కొంతకాలంగా జట్టుతో ఉన్నారు. వారు నిశితంగా గమనిస్తున్నారు, తెలివిగా నేర్చుకుంటున్నారు. అవకాశం దొరికినప్పుడు రెండు చేతులా సద్వినియోగం చేసుకుంటున్నారు.
- ప్రధాన బౌలర్లు గాయపడినా, ఐదుగురు బౌలర్లతో కొనసాగారు. పరిమిత వనరులు ఉన్నప్పటికీ, ఆస్ట్రేలియాపై ఈ ఆత్మవిశ్వాసం ఎలా పని చేసింది?
మూడేండ్ల కిందటే ఈ ఐదుగురు బౌలర్ల సిద్దాంతాన్ని రూపొందించాం. విదేశీ పర్యటనల్లో ఈ ఐదుగురు బౌలర్ల ఫార్ములాకు కట్టుబడి ఉన్నాం. విదేశీ పరిస్థితుల్లో ప్రత్యర్థిని రెండుసార్లు ఆలౌట్ చేసేందుకు నలుగురు బౌలర్లు ఎంతో ఎంతో శ్రమించాలి. నలుగురు బౌలర్లకు అది కఠినమైన పని. నా అభిప్రాయం ప్రకారం, విరాట్ కోహ్లి, రవిశాస్త్రిలు విదేశాల్లో ఐదుగురు బౌలర్లతో ఆడేందుకు ఎంతో పట్టుదలగా ఉన్నారు. కొన్నిసార్లు పరాజయాలు చవిచూడవచ్చు. కానీ ఈ బౌలింగ్ బృందాన్ని ముందుకు నడిపిస్తున్న సిద్ధాంతం భయమెరుగని తత్వమే. అత్యుత్తమ స్థాయిని అందుకునే దారిలో పరాజయాలను లెక్కచేయం. కొన్ని మ్యాచులు ఓడిపోతాం, మరికొన్ని మ్యాచులు పాఠాలు నేర్పుతాయి. స్పోర్ట్స్ అంటేనే పరాజయాలు. ఓటములు ఎదురైనప్పుడు, ఏ విధంగా పుంజుకుంటామనేది ముఖ్యం. అదే సూత్రం భారత జట్టు విశ్వసించింది.
బ్రిస్బేన్ ఆఖరు టెస్టులోనూ అదనపు బ్యాట్స్మన్ను ఆడించటంపై చర్చ నడిచింది. కానీ అది ప్రతికూల ఆలోచన అవుతుందని భావించాం. కెప్టెన్ అజింక్య రహానె, చీఫ్ కోచ్ రవిశాస్త్రి సహా అందరం ఐదుగురు బౌలర్ల ఫార్ములా మనకు పని చేసింది, ఇక్కడా అదే ఫార్ములాను కొనసాగిద్దామని అనుకున్నాం. నెట్స్లో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ చేసిన తీరు అతడు బ్యాట్తో రాణిస్తాడనే నమ్మకం కలిగించింది. అతడు ఎడమ చేతి వాటం బ్యాట్స్మన్ అయినా, పాజిటివ్గా ఉండి ఐదుగురు బౌలర్లతోనే ఆడాలని అనుకున్నాం.
- బ్రిస్బేన్లో భారత్ విజయం అనంతరం టీమ్ ఇండియా భయమెరుగని క్రికెట్పై చర్చ నడుస్తోంది. ఈ వాతావరణం ఏ విధంగా సృష్టించారు?
నువ్వు ఎప్పుడైతే భయపడుతున్నావో, నీకు నిర్దిష్టమైన లక్ష్యాలు ఉన్నట్టే, ఇక అంతిమ ఫలితం గురించి మాత్రమే ఆలోచన చేస్తూ ప్రక్రియను పట్టించుకోవటం లేనట్టు. ఓటమి వద్దనుకుని, సురక్షితంగా ఆడే స్టయిల్లోనే భయం ఉంటుంది. కెప్టెన్ విరాట్ కోహ్లి, కోచ్ రవిశాస్త్రిలు ఓటమి చెందేందుకు భయపడక్కర్లేదని పదేపదే చెబుతారు. చివరి టెస్టులో భారత కుర్రాళ్ల క్యారెక్టర్ బయటపడింది. ఫలితం గురించి ఆలోచన చేయకుండా, స్వేచ్ఛగా ఆడమని చెప్పాం. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ ఆడిన తీరు తర్వాత.. చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ వీరోచితం గురించి మరిచిపోకూడదు. ఏమాత్రం భయపడకుండా పంత్, సుందర్లు ఆడారు. వారు ఓటమి గురించి భయపడలేదు. మ్యాచ్లో విజయం కోసం పోరాడారు. అందుకు ఎంతో ధైర్యం కావాలి. నేను భయమెరుగని క్రికెట్ అనేది పిలిచేది దానినే. కొన్నిసార్లు మనం మ్యాచ్లో పరాజయం పొందవచ్చు, కానీ ఆ ఓటమి కెరీర్లో ఎంతో విలువైన పాఠం నేర్పుతుంది. భవిష్యత్లో ఆ పాఠం మెరుగైన క్రికెటర్గా రూపుదిద్దుకునేందుకు దోహదం చేస్తుంది.