Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి టెస్టుకు ఇంగ్లాండ్ జట్టుపై పీటర్సన్
లండన్ : అత్యుత్తమ క్రికెట్ అంటే ఇంగ్లాండ్, ఆస్ట్రేలియాలు మాత్రమే ఆడతాయనే అహం చూపించిన ఆ దేశ మీడియా, మాజీ క్రికెటర్లు ఇప్పుడు కనువిప్పు పొందినట్టే ఉన్నారు!. ప్రపంచ క్రికెట్లో అత్యుత్తమ విజయం అంటే భారత్ను ఓడించటమే అంటున్నారు. ఫిబ్రవరి 5 నుంచి ఇంగ్లాండ్, భారత్ టెస్టు సిరీస్ ఆరంభం కానుంది. యాషెస్ టెస్టు సిరీస్ కంటే భారత్తో టెస్టు సిరీసే కీలకమని ఇంగ్లాండ్ క్రికెటర్లు వరుసగా వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పుడు ఆ జాబితాలోకి కెవిన్ పీటర్సన్ సైతం చేరిపోయాడు. భారత్తో టెస్టు సిరీస్కు ఇంగ్లాండ్ అత్యుత్తమ జట్టును బరిలోకి దింపకుంటే అది ఇంగ్లాండ్ క్రికెట్ అభిమానులకు, భారత క్రికెట్కు అవమానమని కెపీ ట్విట్టర్లో పేర్కొన్నాడు. భారత్తో తొలి టెస్టుకు వికెట్ కీపర్ జానీ బెయిర్స్టో, ఆల్రౌండర్ శామ్ కరణ్ సహా పేసర్ మార్క్వుడ్లు దూరమయ్యారు. ఈ ఏడాదిలో ఇంగ్లాండ్ 17 టెస్టులు సహా ఐసీసీ టీ20 వరల్డ్కప్లో ఆడాల్సి ఉంది. ఆటగాళ్లపై పని ఒత్తిడి తగ్గించి, తాజాగా ఉంచేందుకు ఇంగ్లాండ్ క్రికెట్ బోర్డు రొటేషన్ పాలసీ అమలు చేస్తోంది. ' భారత్తో తొలి టెస్టుకు ఇంగ్లాండ్ ఉత్తమ జట్టునే ఎంపిక చేసిందా? లేదా అనేది ఇప్పుడు పెద్ద చర్చ. భారత్లో విజయం సాధించటం, ఆస్ట్రేలియాలో విజయం సాధించటంతో సమానం. ఇంగ్లాండ్ అత్యుత్తమ జట్టును బరిలోకి దింపకుంటే అది ఇంగ్లాండ్ అభిమానులు, భారత క్రికెట్కు అవమానకరం. తొలి టెస్టులో జానీ బెయిర్స్టో, స్టువర్ట్ బ్రాడ్, జేమ్స్ అండర్సన్లు ఆడాలి. ఇంగ్లాండ్ అత్యుత్తమ క్రికెటర్లు భారత్తో వీలైనన్ని టెస్టులు ఆడాలి. వారిని ఎంపిక చేయండి. భారత్తో సిరీస్ తర్వాత ఐపీఎల్ ఆడండి, అర్హతకు తగినంత సంపాదించండి. ఆ తర్వాత విరామం తీసుకోండి' అని కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు.