Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డే నైట్ టెస్టులో భారత్ ఘన విజయం
- రెండో ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ 81/10
- 49 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన కోహ్లిసేన
ఇంగ్లాండ్ను స్పిన్ తో తిప్పేశారు. ఇంగ్లాండ్ను బ్యాట్తో కొట్టేశారు. స్పిన్నర్లు అక్షర్ పటేల్ (5/32), అశ్విన్ (4/48) ఇంగ్లాండ్ను మాయ చేశారు. పింక్ బాల్తో స్పిన్నర్లు విధ్వంస రచన చేసిన మొతెరాలో భారత్ రెండు రోజుల్లోనే టెస్టు విజయాన్ని సాధించింది. 49 పరుగుల లక్ష్యాన్ని ఊదేసిన భారత్ పది వికెట్ల తేడాతో ఘన విజయం సొంతం చేసుకుంది. డే నైట్ టెస్టులో విజయంతో టెస్టు సిరీస్లో 2-1 ఆధిక్యం భారత్ వశమైంది. ఈ విజయంతో విలువైన 30 పాయింట్లు సాధించిన కోహ్లిసేన.. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్లో అగ్రస్థానంలోకి దూసుకెళ్లింది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఆస్ట్రేలియాలో పింక్ బాల్తో భంగపడిన భారత్.. స్వదేశంలో ఇంగ్లాండ్కు ఆ ఓటమి రుచి చూపించింది. తొలి బంతి నుంచే బంతి టర్న్ అవుతున్న పిచ్పై ఇంగ్లాండ్ బ్యాట్స్మెన్ను విలవిల్లాడించిన కోహ్లిసేన.. ఆ జట్టును వరుసగా 112, 81 పరుగులకే కుప్పకూల్చింది. చివరగా ఆడిన పింక్ టెస్టులో 58 పరుగులకు కుప్పకూలిన ఇంగ్లాండ్.. మొతెరా రెండో ఇన్నింగ్స్లో 81 పరుగులు చేసింది. లోకల్ హీరో, యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ (5/38) మరోసారి ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. టెస్టు అరంగేట్రం నుంచి వరుసగా మూడు ఇన్నింగ్స్లుగా అక్షర్ పటేల్ ఐదు వికెట్లు పడగొట్టాడు. రవిచంద్రన్ అశ్విన్ (4/48) నాలుగు వికెట్లతో పాటు 400 వికెట్ల క్లబ్లోకి అడుగుపెట్టాడు. తొలి ఇన్నింగ్స్లో 33 పరుగుల విలువైన ఆధిక్యం సాధించిన భారత్కు ఇంగ్లాండ్ 49 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. పరుగులు చేయటం సవాల్గా మారిన పిచ్పై ఇదీ ఉత్కంఠకు దారితీస్తుందని అనిపించింది. కానీ ఓపెనర్లు రోహిత్ శర్మ (25 నాటౌట్, 25 బంతుల్లో 3 ఫోర్లు, 1 సిక్స్), శుభ్మన్ గిల్ (15 నాటౌట్, 21 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) అజేయంగా 49 పరుగులు జోడించారు. పది వికెట్ల తేడాతో భారత్కు ఎదురులేని విజయాన్ని కట్టబెట్టారు. ఈ విజయంతో సిరీస్లో భారత్ 2-1 ఆధిక్యం సాధించింది. సిరీస్లో చివరి టెస్టు మొతెరా మైదానంలోనే మార్చి 4న ఆరంభం కానుంది. 11 వికెట్లతో మాయ చేసిన అక్షర్ పటేల్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
7.4 ఓవర్లలోనే ఊదేశారు : మొతెరా టెస్టులో భారత్ ఆడుతూ పాడుతూ విజయం సాధించింది. ఇంగ్లాండ్ విధించిన 49 పరుగుల లక్ష్యాన్ని భారత్ 7.4 ఓవర్లలోనే ఛేదించింది. ఓపెనర్లు రోహిత్ శర్మ (25 నాటౌట్), శుభ్మన్ గిల్ (15 నాటౌట్)లు అజేయంగా 49 పరుగులు జోడించారు. స్పిన్ పిచ్ పై పరుగులు చేయటం గగనం అయ్యింది. ఇంగ్లాండ్ స్పిన్నర్లు జాక్ లీచ్, జో రూట్లు వికెట్ల వేటలో జోరందుకున్నారు. దీంతో 49 పరుగుల లక్ష్యమైనా నాటకీయ పరిణామాలు తప్పవేమో అనిపించింది. అందుకు తగినట్టుగానే ఇంగ్లాండ్ పేసర్లను పక్కనపెట్టి స్పిన్నర్లతోనే దాడి ఆరంభించింది. రోహిత్ శర్మ మూడు ఫోర్లు, ఓ సిక్సర్ బాదగా... శుభ్మన్ గిల్ ఓ ఫోర్, ఓ సిక్సర్తో అలరించాడు. జో రూట్ ఓవర్లో వరుసగా రెండు ఫోర్లు, ఓ సిక్సర్ బాదిన రోహిత్ శర్మ మొతెరాలో పింక్ బాల్ లాంఛనాన్ని ముగించాడు. పది వికెట్ల తేడాతో భారత్ మూడో టెస్టులో ఘన విజయం సాధించింది.
ఇంగ్లాండ్ ఉఫ్! : 33 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్కు వచ్చిన ఇంగ్లాండ్కు అక్షర్ పటేల్ తొలి ఓవర్లోనే స్పిన్ మాయ చూపించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఫామ్లో ఉన్న ఓపెనర్ జాక్ క్రావ్లీ (0) వికెట్ను గిరాటేశాడు. నం.3 బ్యాట్స్మన్ జానీ బెయిర్స్టో (0)ను ఇన్నింగ్స్ మూడో బంతికి సాగనంపాడు. మూడు బంతుల్లో రెండుసార్లు వికెట్లను గిరాటేసిన అక్షర్ పటేల్.. స్కోరు బోర్డుపై పరుగులు రాకముందే రెండు వికెట్లు పడగొట్టాడు. మరో ఓపెనర్ డామినిక్ సిబ్లీ (7)ను అక్షర్ పటేల్ అవుట్ చేయగా ఇంగ్లాండ్ 19 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కెప్టెన్ జో రూట్ (19, 45 బంతుల్లో), బెన్ స్టోక్స్ (25, 34 బంతుల్లో 3 ఫోర్లు) ఇంగ్లాండ్ను ఆదుకునే పనిలో పడ్డారు. బెన్ స్టోక్స్ ఎదురుదాడి చేసి పరుగులు పిండుకోగా.. జో రూట్ క్రీజులో నిలబడేందుకు ప్రయత్నం చేశాడు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 31 పరుగులు జోడించారు. కానీ అక్కడ్నుంచి పరిస్థితులు వేగంగా మారిపోయాయి. స్టోక్స్ వికెట్ల ముందు అశ్విన్కు దొరికిపోగా.. జో రూట్ సంగతి అక్షర్ చూసుకున్నాడు. వికెట్ కీపర్ బెన్ ఫోక్స్ (8) వికెట్తో అక్షర్ పటేల్ ఐదు వికెట్ల ప్రదర్శన పూర్తి చేసుకోగా.. టెయిలెండర్ల కథ అశ్విన్ ముగించాడు. జోఫ్రా ఆర్చర్ (0), జాక్ లీచ్ (9)లను అవుట్ చేశాడు. వాషింగ్టన్ సుందర్కు అండర్సన్ (0) వికెట్ దక్కింది. 30.4 ఓవర్లలోనే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ ముగిసింది. తొలి సెషన్ ఆఖర్లో బ్యాటింగ్కు వచ్చిన ఇంగ్లాండ్... రెండో సెషన్ ఆఖరుకు కుప్పకూలింది. రెండో ఇన్నింగ్స్లో భారత పేసర్లు ఇషాంత్ శర్మ, జశ్ప్రీత్ బుమ్రాలు బౌలింగ్ చేయాల్సిన అవసరమే రాలేదు.
తొలి ఇన్నింగ్స్లో 145 : ఓవర్నైట్ స్కోరు 99/3తో రెండో రోజు బ్యాటింగ్కు వచ్చిన భారత్ మరో 46 పరుగులకే చివరి ఏడు వికెట్లు కోల్పోయింది. అర్థ సెంచరీ సాధించిన రోహిత్ శర్మ (66, 96 బంతుల్లో 11 ఫోర్లు), అజింక్య రహానె (7, 25 బంతుల్లో 1 ఫోర్) నిష్క్రమణతో భారత్ ఉన్నట్టుండి కుప్పకూలింది. ఇంగ్లాండ్ పార్ట్టైమ్ స్పిన్నర్ జో రూట్ 6.2-3-8-5 గణాంకాలు నమోదు చేశాడు. వేసిన 6.2 ఓవర్లలోనే అతడు ఐదు వికెట్లు పడగొట్టాడు. మరో స్పిన్నర్ జాక్ లీచ్ (4/54) మిగతా నాలుగు వికెట్లు ఖాతాలో వేసుకున్నాడు. రవిచంద్రన్ అశ్విన్ (17, 32 బంతుల్లో 3 ఫోర్లు) క్రీజులో నిలిచి పరుగులు చేసినా.. రిషబ్ పంత్ (1), వాషింగ్టన్ సుందర్ (0), అక్షర్ పటేల్ (0), జశ్ప్రీత్ బుమ్రా (1)లు అలా వచ్చి ఇలా వెళ్లారు. దీంతో భారత్ తొలి ఇన్నింగ్స్లో 53.2 ఓవర్లలోనే ఆలౌట్ అయ్యింది.
17:మొతెరా పింక్ టెస్టు రెండో రోజు కూలిన వికెట్లు. ఇంగ్లాండ్ పది వికెట్లు, భారత్ ఏడు వికెట్లు కోల్పోయింది. ఇక్కడ ఓ టెస్టు మ్యాచ్లో అత్యధిక వికెట్ల ప్రదర్శన ఇదే.
100: అహ్మదాబాద్ టెస్టులో ఇంగ్లాండ్పై భారత స్పిన్నర్లు అశ్విన్, అక్షర్ పటేల్ తాము వేసిన తొలి బంతికే వికెట్లు పడగొట్టారు. వందేండ్ల టెస్టు క్రికెట్లో ఇలా జరుగటం ఇదే ప్రథమం. అశ్విన్, అక్షర్లు రెండో టెస్టులో తొలి బంతులకే వికెట్లు సాధించారు.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 112/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : 145/10
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : జాక్ క్రావ్లీ (బి) అక్షర్ పటేల్ 0, డామినిక్ సిబ్లీ (సి) రిషబ్ పంత్ (బి) అక్షర్ పటేల్ 7, జానీ బెయిర్స్టో (బి) అక్షర్ పటేల్ 0, జో రూట్ (ఎల్బీ) అక్షర్ పటేల్ 19, బెన్ స్టోక్స్ (ఎల్బీ) అశ్విన్ 25, ఒలీ పోప్ (బి) అశ్విన్ 12, బెన్ ఫోక్స్ (ఎల్బీ) అక్షర్ పటేల్ 8, జోఫ్రా ఆర్చర్ (ఎల్బీ) అశ్విన్ 0, జాక్ లీచ్ (సి) రహానె (బి) అశ్విన్ 9, స్టువర్ట్ బ్రాడ్ నాటౌట్ 1, జేమ్స్ అండర్సన్ (సి) రిషబ్ పంత్ (బి) వాషింగ్టన్ సుందర్ 0, ఎక్స్ట్రాలు : 00, మొత్తం : (30.4 ఓవర్లలో ఆలౌట్) 81.
వికెట్ల పతనం :1-0, 2-0, 3-19, 4-50, 5-56, 6-66, 7-68, 8-80, 9-80, 10-81.
బౌలింగ్ : అక్షర్ పటేల్ 15-0-32-5, రవిచంద్రన్ అశ్విన్ 15-3-48-4, వాషింగ్టన్ సుందర్ 0.4-0-1-1.
భారత్ రెండో ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ నాటౌట్ 25, శుభ్మన్ గిల్ నాటౌట్ 15, ఎక్స్ట్రాలు : 09, మొత్తం : (7.4 ఓవర్లలో) 49.
బౌలింగ్ : జాక్ లీచ్ 4-1-15-0, జో రూట్ 3.4-0-25-0.