Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ట్విట్టర్లో ప్రకటించిన పవర్ హిట్టర్
ముంబయి : భారత పవర్ హిట్టర్ క్రికెటర్ యూసుఫ్ పఠాన్ క్రికెట్ నుంచి తప్పుకున్నాడు. గత రెండు సీజన్లుగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఆటగాళ్ల వేలంలో అమ్ముడుపోని యూసుఫ్ పఠాన్ అన్ని ఫార్మాట్ల క్రికెట్ నుంచి వీడ్కోలు తీసుకుంటున్నట్టు ట్విట్టర్లో ప్రకటించాడు. యూసుఫ్ పఠాన్కు భారత్కు 57 వన్డేలు, 22 టీ20ల్లో ప్రాతనిథ్యం వహించాడు. సోదరుడు ఇర్ఫాన్ పఠాన్తో కలిసి యూసుఫ్ పఠాన్ 'పఠాన్స్'తో క్రికెట్ అకాడమీ ఆరంభించాడు. ' క్రికెట్ కెరీర్ ఇన్నింగ్స్కు ముగింపు పలకాల్సిన సమయం నా జీవితంలో వచ్చేసింది. క్రికెట్లో అన్ని ఫార్మాట్ల ఆట నుంచి అధికారికంగా వీడ్కోలు తీసుకుంటున్నాను. భారత జెర్సీ తొలిసారి ధరించినప్పుడు అనుభూతి ఇప్పటికి గుర్తుంది. ప్రపంచకప్ విజయం అనంతరం సచిన్ టెండూల్కర్ను భుజాలపై మోసుకెళ్లిన సన్నివేశం నా జీవితంలో మరచిపోలేనిది. భారత్కు ఎం.ఎస్ ధోని, ఐపీఎల్లో షేన్ వార్న్, రంజీ ట్రోఫీలో జాకబ్ మార్టిన్ కెప్టెన్సీలో అరంగేట్రం చేశాను. నాపై నమ్మకం ఉంచిన సారథులకు ధన్యవాదాలు. నా కెరీర్లో మద్దతుగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, అభిమానులు, బీసీసీఐ, బీసీఏలకు కృతజ్ఞతలు' అని యూసుఫ్ పఠాన్ ట్వీట్ చేశాడు. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే వరల్డ్కప్ విజయాలు సాధించిన భారత జట్టులో పఠాన్ సభ్యుడుగా ఉన్నాడు. ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, కోల్కత నైట్రైడర్స్, సన్రైజర్స్ హైదరాబాద్ ప్రాంఛైజీలకు ప్రాతినిథ్యం వహించిన యూసుఫ్ మూడుసార్లు ఐపీఎల్ ట్రోఫీని అందుకున్నాడు.