Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్పిన్ ట్రాక్ సిద్ధం చేస్తున్న క్యూరేటర్
- సాధనలో నిమగ్నమైన కోహ్లిసేన
- గురువారం నుంచి ఇంగ్లాండ్తో ఆఖరు టెస్టు
టర్నర్, ర్యాంక్ టర్నర్, రెండు వైపులా టర్నర్.. ఇదీ భారత్, ఇంగ్లాండ్ టెస్టు సిరీస్లో వరుసగా ఎదురైన పిచ్లు. చెన్నైలో తొలుత సాధారణ టర్నింగ్ పిచ్పై మెరిసిన ఇంగ్లాండ్.. స్పిన్పై పైచేయి సాధించినట్టు గొప్పలు పోయింది. చెన్నైలోనే మరో ర్యాంక్ టర్నర్ పిచ్పై చేతులు ఎత్తేసింది. ఇక మొతెరాలో రెండు వైపులా స్పిన్ పదునెక్కిన పిచ్పై బ్యాట్లేత్తేసింది. స్పిన్ పిచ్లు తయారు చేసి ఆతిథ్య జట్టు అనుకూలతను దుర్వినియోగం చేస్తున్నారని వాపోతుంది. అలాగైనా నాలుగో టెస్టులో బ్యాటింగ్ పిచ్ అందుతుందని పర్యాటక జట్టు ఆశించింది. కానీ ఇంగ్లీష్ జట్టుకు మరో ర్యాంక్ టర్నర్ ఎదురు కాబోతుంది. విమర్శలను బుట్టదాఖలు చేసిన బీసీసీఐ.. మొతెరాలో మరో ర్యాంక్ టర్నర్ను సిద్ధం చేయనుందని సమాచారం!.
నవతెలంగాణ-అహ్మదాబాద్
భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు రెండు రోజుల్లోనే ముగియటం మరోవిధంగా ఇంగ్లీష్ జట్టుకు మేలు చేసిందనే భావన ఇంతవరకు నెలకొంది. డే నైట్ గులాబీ బంతి టెస్టులో ఇంగ్లాండ్ జట్టుపై భారత్ పది వికెట్ల తేడాతో గెలుపొందింది. స్పిన్నర్లు చెలరేగిన పిచ్పై రెండో రోజు ఆటలో ఏకంగా 17 వికెట్లు నేలకూలాయి. దీంతో మొతెరా పిచ్పై ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు తీవ్ర విమర్శలు చేయసాగారు. మొతెరా పిచ్కు 'చెత్త' రేటింగ్ ఇవ్వాలని ఐసీసీకి ఈమెయిల్స్ పంపుతూ డిమాండ్ చేస్తున్నారు. ఈ పరిస్థితుల్లో పిచ్ గోల సద్దుమణిగేందుకు మొతెరాలోనే జరగాల్సిన నాల్గో టెస్టుకు బ్యాటింగ్ పిచ్ సిద్ధం చేసే అవకాశం ఉందని తొలుత వార్తలొచ్చాయి. ఇంగ్లీష్ మీడియా, ఇంగ్లాండ్ మాజీలు చేసే అనవసర విమర్శలను భారత క్రికెట్ బోర్డు పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నట్టు లేదు. గురువారం నుంచి ఆరంభం కానున్న నాలుగో టెస్టుకు సైతం ర్యాంక్ టర్నర్ను తయారు చేసేందుకు మొతెరా క్యూరేటర్ సిద్ధమవుతున్నాడు.
స్పిన్నర్ల స్వర్గధామమే! : స్టార్ పేసర్ జశ్ప్రీత్ బుమ్రా నాలుగో టెస్టుకు దూరమయ్యాడు. మూడో టెస్టులో ఇషాంత్ సహా బుమ్రా సేవలను విరాట్ కోహ్లి పెద్దగా ఉపయోగించుకోలేదు. నాలుగో టెస్టులోనూ అదే పరిస్థితి ఉండనుండటంతో జశ్ప్రీత్ బుమ్రా ముందుగానే జట్టును వీడాడు. కుటుంబంతో గడిపేందుకు నాలుగో టెస్టు నుంచి విరామం తీసుకున్నాడు. పేసర్లకు అనుకూలించే, బ్యాటింగ్కు సానుకూల పిచ్ తయారు చేసేటట్టు అయితే భారత జట్టు మేనేజ్మెంట్ జశ్ప్రీత్ బుమ్రాను విడుదల చేసేది కాదు. కానీ మరో ర్యాంక్ టర్నర్పై బుమ్రా సేవలు అవసరం లేదనే భావనతోనే బిజీ షెడ్యూల్ నుంచి అతడికి విశ్రాంతి కల్పించింది. పిచ్పై వస్తున్న విమర్శలను అంతే దీటుగా తిప్పికొడుతున్న భారత క్రికెటర్లు... నాలుగో టెస్టు పిచ్ విషయంలో రాజీపడేలా కనిపించటం లేదు. ఇంగ్లీష్ పరిస్థితుల్లో భీకర పేస్ పిచ్లను ఎదుర్కొంటున్నప్పుడు.. ఉపఖండంలో స్పిన్ పిచ్లపై ఆడటంలో ఇబ్బంది ఏమిటనే వాదన తీసుకొస్తున్నారు. దీంతో ఆఖరు టెస్టులోనూ బంతి గిర్రున తిరుగనుంది. జశ్ప్రీత్ బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్ లేదా మహ్మద్ సిరాజ్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇక స్పిన్ విభాగంలో వాషింగ్టన్ సుందర్ స్థానంలో చైనామన్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ఆడే అవకాశం లేకపోలేదు. అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్లు యథావిధిగా ఇంగ్లాండ్పై స్పిన్ ఎటాక్ను ముందుండి నడిపించనున్నారు.
సాధనలో బిజీ : గురువారం నుంచి అహ్మదాబాద్లోనే ఆరంభం కానున్న ఆఖరు టెస్టు కోసం భారత క్రికెటర్లు నెట్స్లో చెమటోడ్చుతున్నారు. ఆదివారం సైతం ప్రాక్టీస్ చేసిన కోహ్లిసేన.. సోమవారం మొతెరాలో ప్రాక్టీస్ కొనసాగించింది. సీనియర్ ఆటగాళ్లు విరాట్ కోహ్లి, అజింక్య రహానె, రోహిత్ శర్మలు ప్రాక్టీస్ సెషన్లో సందడి చేశారు. విరాట్ కోహ్లి, రోహిత్ శర్మలు బ్యాటింగ్ ప్రాక్టీస్ ముగించుకున్న అనంతరం చీఫ్ కోచ్ రవిశాస్త్రి ఆ ఇద్దరితో సుదీర్ఘంగా చర్చించటం కనిపించింది. అజింక్య రహానెతో కలిసి రోహిత్ శర్మ స్లిప్స్లో ఒంటి చేతి క్యాచులు సాధన చేశాడు. యువ స్పిన్నర్ అక్షర్ పటేల్ నెట్స్లో మాయకు మెరుగుదిద్దుకునే పనిలో నిమగమై కనిపించాడు. తొలి టెస్టులో ఇంగ్లాండ్ చేతిలో 227 పరుగుల తేడాతో పరాజయం పాలైన భారత్.. రెండో టెస్టును 317 పరుగుల తేడాతో గెలుపొందింది. మూడో టెస్టును రెండు రోజుల్లోనే పది వికెట్ల తేడాతో సొంతం చేసుకుంది. 2-1తో సిరీస్ ముందంజలో నిలిచింది. ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్ రేసు నుంచి ఇంగ్లాండ్ను సాగనంపి.. అగ్రస్థానం రేసులో తన అవకాశాలు మెరుగుపర్చుకుంది. ఇంగ్లాండ్తో చివరి టెస్టులోనూ భారత్ విజయం సాధిస్తే ఇతర సమీకరణాలతో నిమిత్తం లేకుండా భారత్ నేరుగా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించనుంది.