Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సఫారీ పేసర్ డెల్ స్టెయిన్ వ్యాఖ్యలు
దుబాయ్ : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)పై దక్షిణాఫ్రికా దిగ్గజ పేసర్ డెల్ స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ ఏడాది ఐపీఎల్కు దూరంగా ఉన్న డెల్ స్టెయిన్ ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్ (పీఎస్ఎల్)లో ఆడుతున్నాడు. ఈ సందర్భంగా స్టెయిన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఐపీఎల్లో క్రికెట్ వెనకాల స్థానంలోకి వెళ్లిపోయిందని, డబ్బులకు తొలి ప్రాధాన్యమని స్టెయిన్ అన్నాడు. ' మరింత సమయం విరామం తీసుకోవాలని అనుకున్నాను. పీఎస్ఎల్, ఎల్పీఎల్లో ఆడటం నాకు ఎక్కువ ప్రయోజనం అనిపించింది. ఐపీఎల్కు వెళ్లినప్పుడు అక్కడ జంబో జట్లు, స్టార్ క్రికెటర్లు, కోట్లలో ఆర్జించే ఆటగాళ్ల నడుమ క్రికెట్ను మరిచిపోతున్నారు. అదే పాకిస్థాన్ సూపర్ లీగ్, లంక ప్రీమియర్ లీగ్లలో క్రికెట్కు విలువ ఇస్తున్నారు' అని స్టెయిన్ అన్నాడు. ఐపీఎల్లో 11 సీజన్లలో రూ.47.15 కోట్లు సొంతం చేసుకున్న స్టెయిన్ ప్రాంఛైజీలకు ఎప్పుడూ విలువైన ఆటగాడిగానే ఉన్నాడు. డెల్ స్టెయిన్ వ్యాఖ్యలపై భారత టెస్టు జట్టు వైస్ కెప్టెన్ అజింక్య రహానె స్పందించాడు. ' ఇండియన్ ప్రీమియర్ లీగ్ సత్తా చాటేందుకు ఓ చక్కటి అంతర్జాతీయ వేదికను అందించింది. డెల్ స్టెయిన్ ఏం మాట్లాడాడో నాకు తెలియదు. నేను ఇక్కడికి నాలుగో టెస్టు గురించి మాట్లాడేందుకు వచ్చాను' అని రహానె ముగించాడు.