Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-మార్చి 10న చెన్నైకి ధోని
చెన్నై : చెన్నై సూపర్ కింగ్స్ మరోసారి ముందుగానే ఐపీఎల్కు సన్నద్ధం కానుంది. ఐపీఎల్ 2021 సీజన్ షెడ్యూల్, వేదికలు ఇంకా ఖరారు చేయలేదు. మార్చి తొలి వారంలో ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ దీనిపై ఓ నిర్ణయం తీసుకోనుంది. ఏప్రిల్ 11-జూన్ 6న ఐపీఎల్ 2021 నిర్వహణపై బోర్డు తాత్కాలిక షెడ్యూల్ సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. ఐపీఎల్ చరిత్రలో తొలిసారి ప్లే ఆఫ్స్కు దూరమైన చెన్నై సూపర్కింగ్స్ యుఏఈ సీజన్లో నిరాశపరిచింది. భారత్లో జరుగనున్న తాజా సీజన్కు సూపర్కింగ్స్ నెల రోజుల ముందు నుంచే సాధన చేయనుంది. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన ఎం.ఎస్ ధోని మార్చి 10న చెన్నైకి రానున్నట్టు సమాచారం. దేశవాళీ క్రికెటర్లతో సూపర్కింగ్స్ ప్రాక్టీస్ క్యాంప్ ఆరంభం కానుంది. ' ప్రాక్టీస్ క్యాంప్కు విడతల వారీగా క్రికెటర్లు వస్తారని అనుకుంటున్నాం. కెప్టెన్ ఎం.ఎస్ ధోని క్యాంప్ తొలి రోజు నుంచి అందుబాటులో ఉంటాడు. ఆటగాళ్ల అందబాటు పెద్ద విషయం కాదు. కోవిడ్-19 ముందస్తు జాగ్రత్తలు, మార్గదర్శకాల నడుమ క్రికెటర్ల కండిషనింగ్ క్యాంప్ విజయవంతంగా నిర్వహించేందుకు చూస్తున్నాం. గత సీజన్ అనుభవాలను దృష్టిలో ఉంచుకుని ఈసారి కఠిన నిబంధనలను పాటించనున్నాం' అని సూపర్కింగ్స్ ప్రాంఛైజీ అధికారి ఒకరు వెల్లడించారు.