Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కరోనా కేసుల నేపథ్యంలో బీసీసీఐ ఆలోచన
- హైదరాబాద్లో ఐపీఎల్కు మార్గం సుగమం!
ఐపీఎల్ 2021 సీజన్ ఆతిథ్య నగరాల జాబితా నుంచి ముంబయి నిష్క్రమించనుంది!. మహారాష్ట్రలో పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో ముంబయి వేదికగా ఐపీఎల్ మ్యాచుల నిర్వహణ సురక్షితం కాదనే భావనకు బీసీసీఐ వచ్చేసింది. ఈ వారంలో సమావేశం కానున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఐపీఎల్ ఆతిథ్య నగరాలపై స్పష్టత ఇవ్వనుంది. ఆతిథ్య నగరం జాబితా నుంచి ముంబయి తప్పుకోనుండగా.. హైదరాబాద్ రేసులోకి వస్తోంది. భారతీయ జనతా పార్టీ (భాజపా) యేతర రాష్ట్ర ప్రభుత్వాలు తెలంగాణ, పంజాబ్, రాజస్థాన్ల నుంచి ఐపీఎల్ను తరలించేందుకు బోర్డు కార్యదర్శి జై షా కుట పన్నుతున్నారని యువజన కాంగ్రెస్ ఆరోపణలు చేసింది.
నవతెలంగాణ-ముంబయి : ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలోనే తొలిసారి ముంబయి ఆతిథ్య నగరం జాబితా నుంచి తప్పుకోనుంది. డిఫెండింగ్ చాంపియన్ ముంబయి ఇండియన్స్ సొంత నగరమైన ముంబయి వేదికగానే 2021 ఐపీఎల్ లీగ్ దశ మ్యాచులు అన్నింటికీ ఆడించే ప్రణాళికల్లో బీసీసీఐ ఉంది. కానీ మహారాష్ట్రలో రోజురోజుకు పెరుగుతున్న కోవిడ్-19 కేసులతో ఐపీఎల్ 2021 సీజన్ను మహారాష్ట్ర నుంచి తరలించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) ఆలోచన చేస్తోంది. ఐపీఎల్ వేదికల విషయంలో ఈ వారంలో బీసీసీఐ నుంచి స్పష్టత రానుంది. మార్చి తొలి వారంలో సమావేశం కానున్న ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ వేదికలపై తుది నిర్ణయం తీసుకోనుంది.
ముంబయిలో లేనట్టే! : ఐపీఎల్ హంగామా ఎప్పుడైనా ముంబయి నుంచే మొదలవుతుంది. కానీ ఈ సీజన్లో అసలు ఐపీఎల్ హంగామాకే ముంబయి దూరం కానుంది. ఫిబ్రవరి 18న నిర్వహించిన ఐపీఎల్ ఆటగాళ్ల వేలం సందర్భంగా ప్రాంఛైజీలకు బీసీసీఐ క్లుప్తమైన సమాచారం అందించింది. ఈ ఏడాది ఐపీఎల్ను పరిమిత వేదికల్లోనే.. అవసరమైతే ముంబయి నగరం వేదికగానే నిర్వహిస్తామని సమాచారం అందించింది. గ్రూప్ దశ మ్యాచులకు ముంబయి, ప్లే ఆఫ్స్ మ్యాచులకు అహ్మదాబాద్ను వేదికగా పేర్కొంది. లీగ్ దశ మ్యాచులకు పుణె సైతం వేదికగా ఉండేలా బీసీసీఐ ప్రణాళికలు వేసింది. తాజాగా అహ్మదాబాద్లో భారత్, ఇంగ్లాండ్ మూడో టెస్టు సందర్భంగా ఐపీఎల్ వేదికల అంశంపై మరోసారి చర్చించినట్టు సమాచారం. బీసీసీఐ కార్యదర్శి జై షా, కోశాధికారి అరుణ్ కుమార్ ధుమాల్, ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ చైర్మన్ బ్రిజేశ్ పటేల్ సహా తాత్కాలిక సీఈఓ హేమంగ్ ఆమిన్లు ఐపీఎల్ వేదికలపై చర్చించారు. ముంబయిలో వేగంగా పెరుగుతున్న కోవిడ్-19 కేసుల నేపథ్యంలో ముందస్తు ప్రణాళికలపై పునరాలోచన చేయాలనే నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.
భారత ప్రభుత్వ ఆరోగ్యం, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ వెల్లడించిన గణాంకాల ప్రకారం దేశంలో నమోదైన నూతన కోవిడ్-19 కేసుల్లో సగానికి పైగా మహారాష్ట్రలోనే ఉన్నాయి. సోమవారం సాయంత్రానికి అందుబాటులో ఉన్న గణాంకాల ప్రకారం భారత్లో 169,000 కేసులు నమోదు కాగా.. మహారాష్ట్రలోనే 78,212 కేసులు ఉన్నాయి. ఆదివారం ఒక్కరోజే 4478 కేసులు కొత్తగా నమోదు అయ్యాయి. కొత్తగా 62 మంది కోవిడ్-19 బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఐపీఎల్ మ్యాచులకు మహారాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపినా.. అభిమానుల ప్రవేశానికి అనుమతి నిరాకరించింది. అభిమానుల ప్రవేశంపై ఆంక్షలు, కొత్తగా పెరుగుతున్న కేసులను గమనంలో ఉంచుకుని ముంబయిని ఈ సీజన్ వరకు పక్కనపెట్టాలని బీసీసీఐ భావిస్తోంది.
హైదరాబాద్కు ఛాన్స్ : ఎన్నికల కమిషన్ వివిధ రాష్ట్రాలకు ఎలక్షన్ నోటిఫికేషన్ విడుదల చేసే వరకు బీసీసీఐ అన్ని అంశాలను జాగ్రత్తగా గమనించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే ఐపీఎల్ లీగ్ దశ మ్యాచులు ఉండనున్నాయి. బెంగాల్లో ఎనిమిది దశల్లో (మార్చి 27-మే 4) పోలింగ్ జరుగనుండగా.. తమిళనాడులో ఏప్రిల్ 6న ఒక్కరోజే పోలింగ్ ఉండనుంది. ముంబయి నగరం ఆతిథ్య అవకాశంపై ప్రశ్నార్థకం కొనసాగుతున్నప్పటికీ మొహాలీని ఐపీఎల్ వేదికగా బోర్డు పరిగణించటం లేదు. వేదికల విషయంలో అనిశ్చితి, షెడ్యూల్ ఖరారులో జాప్యం ప్రాంఛైజీలను అసహనానికి గురి చేస్తున్నాయి.
హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ) అంతర్గత కుమ్ములాటల కారణంగా తొలుత హైదరాబాద్ను విస్మరించిన బీసీసీఐ.. రాష్ట్ర మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ట్వీట్తో హైదరాబాద్లో ఐపీఎల్ మ్యాచుల నిర్వహణకు సుముఖంగా ఉన్నట్టు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో హైదరాబాద్లోనే అతి తక్కువ కేసులు నమోదు కావటం, సామూహిక వ్యాప్తి కట్టడిలో తెలంగాణ ముందంజలో నిలువటం బీసీసీఐని ఆకర్షించే అంశాలు. అన్నింటికి మించి రాష్ట్ర ప్రభుత్వమే ముందుకొచ్చి అన్ని విధాల సహాయ సహకారాలు అందజేస్తామని హామీ ఇవ్వటంతో హైదరాబాద్ను ఐపీఎల్ ఆతిథ్య నగరంగా ఎంచుకునే అవకాశాలు మెరుగయ్యాయి. మరోవైపు ప్రాథమిక ఆతిథ్య నగరాల జాబితాలో నుంచి మొహాలిని మినహాయించటంపై పంజాబ్ కింగ్స్ ప్రాంఛైజీ బీసీసీఐకి లేఖ రాసిన సంగతి తెలిసిందే. సన్రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం సైతం ఐపీఎల్ సీఈఓతో ఈ విషయాన్ని ప్రస్తావించింది. ఆతిథ్య నగరాల ఎంపికలో కొలమానాలు ఏమిటీ? మొహాలీని విస్మరించడానికి కారణాలు ఏమిటీ? అని పంజాబ్ కింగ్స్ బోర్డును ప్రశ్నించింది. ఒక్క నగరంలోనే నిర్వహించినప్పుడు పరిస్థితులు వేరు.. ఏకంగా ఆరు నగరాల్లో మ్యాచులు నిర్వహిస్తున్నప్పుడు మొహాలి ఎందుకు ఆతిథ్య జాబితాలో ఉండకూడదు అని ఆ జట్టు వాదిస్తోంది. ఐపీఎల్ ఆతిథ్య నగరాల్లో జాబితాలో మొహాలిని చేర్చినా, చేర్చకపోయినా పంజాబ్ కింగ్స్ సన్నాహకం మొహాలిలోనే ఉంటుందని ఆ జట్టు యాజమాన్యం స్పష్టం చేస్తోంది.
ఇది జై షా కుట్ర : యువజన కాంగ్రెస్ ఆరోపణ
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) వేదికల ఎంపిక విషయంలో బీసీసీఐ కార్యదర్శి, కేంద్ర హౌం మంత్రి అమిత్ షా తనయుడు జై షా కుట్ర పన్నుతున్నారని భారత యువజన కాంగ్రెస్ ఆరోపించింది. ఈ మేరకు ట్వీట్టర్లో విమర్శలు గుప్పించింది. 'భాజపా యేతర రాష్ట్రాలు తెలంగాణ, రాజస్థాన్, పంజాబ్ ప్రాంఛైజీల ప్రయోజనాలను దెబ్బతీసేందుకు.. అసలు ఐపీఎల్ జట్టే లేని భాజపా పాలిత గుజరాత్లో ప్లే ఆఫ్స్ మ్యాచులు నిర్వహిస్తున్నారు. అన్ని మ్యాచులు గుజరాత్ నరెంద్ర మోడీ స్టేడియానికి తరలిస్తున్నారు. ఇది జై షా కొత్త కుంభకోణం' అని యువజన కాంగ్రెస్ ట్వీట్ చేసింది.