Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంగ్లాండ్తో ఆఖరు టెస్టుకు కోహ్లిసేన సిద్ధం
- మొతెరాలో మరోసారి స్పిన్ ట్రాక్ తయారు
- భారత్పై ప్రతీకార వేటలో రూట్సేన
- నేటి నుంచి భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు
- ఉదయం 9.30 నుంచి స్టార్స్పోర్ట్స్లో..
ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్పై కన్నేసిన టీమ్ ఇండియా.. మొతెరాలో ఇంగ్లాండ్తో చివరి టెస్టులో విజయమే లక్ష్యంగా బరిలోకి దిగుతోంది. నాలుగో టెస్టులో భారత్ విజయం సాధిస్తే అగ్రస్థానంతో దర్జాగా లార్డ్స్ ఫైనల్లోకి ప్రవేశించనుంది. చివరి టెస్టును డ్రా చేసుకున్నా భారత్ ఫైనల్లో ఆడనుంది. కానీ ఇంగ్లాండ్ ఈ టెస్టులో విజయం సాధిస్తే.. లార్డ్స్ ఫైనల్స్కు దూరం కానుంది. భారత్ను లార్డ్స్ ఫైనల్స్కు దూరం చేయాలని ఇంగ్లాండ్ జట్టు ప్రతీకారంతో ఉండగా.. దర్జాగా ఫైనల్లోకి చేరుకునేందుకు కోహ్లిసేన రంగం సిద్ధం చేసుకున్నట్టే కనిపిస్తోంది. పిచ్పై విపరీత వ్యాఖ్యలు వినిపిస్తున్నా.. మరో స్పిన్ ట్రాక్పై భారత్, ఇంగ్లాండ్లు చివరి టెస్టులో తలపడేందుకు సిద్ధమయ్యాయి. అహ్మదాబాద్లో నేటి నుంచి నాలుగో టెస్టు ఆరంభం.
నవతెలంగాణ-అహ్మదాబాద్
పిచ్, బాల్..అహ్మదాబాద్ బాహుబలి మైదానంలో వారం రోజులుగా ఇదే చర్చ, ఇదే రచ్చ. నాలుగో టెస్టుకు ముందు సైతం ఇంగ్లాండ్ మాజీ క్రికెటర్లు పిచ్ గోలను వదిలిపెట్టలేదు. పిచ్పై ఏడుపెలా ఏడ్చినా.. నాలుగో టెస్టులోనూ బంతి గిర్రున తిరగటం తథ్యం. వరుసగా రెండు టెస్టుల్లో ఇంగ్లాండ్ను చిత్తుగా ఓడించిన భారత్ ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ రేసులో ఆ జట్టును ఎటువంటి సమీకరణాల్లోనూ ఉండనీయలేదు. ప్రస్తుతం అగ్రస్థానంలో ఉన్న భారత్ ఈ టెస్టులో విజయం సాధించినా, టెస్టును డ్రా చేసుకున్నా.. లార్డ్స్ ఫైనల్లో న్యూజిలాండ్తో తలపడనుంది. చివరి టెస్టులో ఇంగ్లాండ్ అద్భుతం చేసి ఆతిథ్య జట్టును ఓడిస్తే.. అప్పుడు లార్డ్స్ ఫైనల్స్కు భారత్ కానుంది, కివీస్తో ఆసీస్ అమీతుమీ తేల్చుకోవాల్సి ఉంటుంది. సిరీస్ను 3-1తో కైవసం చేసుకోవటంతో పాటు అగ్రజట్టుగా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లోకి చేరుకోవటమే లక్ష్యంగా భారత్ నాలుగు టెస్టులోకి అడుగుపెట్టనుంది. భీకర ఫామ్లో ఉన్న భారత్ను నిలువరించటం ఇంగ్లాండ్కు అసాధ్యమనే చెప్పవచ్చు!.
ఎదురుందా? : వరుసగా రెండు టెస్టుల్లో 317 పరుగులు, 10 వికెట్ల తేడాతో గెలుపొందిన భారత్ నాలుగో టెస్టులో హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. సిరీస్లో భారత బ్యాటింగ్ లైనప్లో అందరూ ఏదో ఒక్క ఇన్నింగ్స్లో అర్థ సెంచరీ సాధించారు. అయితే సిరీస్లో ఇరు జట్లకు వ్యత్యాసంగా నిలిచింది రోహిత్ శర్మ. భారత్ విజయం సాధించిన రెండు టెస్టుల్లోనూ రోహిత్ శర్మ కదం తొక్కాడు. చెన్నైలో శతకం, మొతెరాలో అర్థ సెంచరీతో ఇంగ్లాండ్ను ఆడుకున్నాడు. ఫామ్లో ఉన్నప్పటికీ భారీ ఇన్నింగ్స్ కోసం ఎదురుచూస్తున్న విరాట్ కోహ్లి, చతేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు శతక దాహం తీర్చుకునేందుకు బరిలోకి దిగుతున్నారు. ఈ ముగ్గురిలో ఎవరు మెరిసినా ఇంగ్లాండ్కు ఇక్కట్లు తప్పవు. యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్, శుభ్మన్ గిల్లు మంచి టచ్లో ఉన్నారు. స్పిన్నర్లు రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్ ద్వయం మరోమారు మాయ చేసేందుకు సిద్ధమవుతోంది. ఈ సారి వాషింగ్టన్ సుందర్ అండ అవసరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. వ్యక్తిగత కారణాలతో సెలవు తీసుకున్న జశ్ప్రీత్ బుమ్రా స్థానంలో స్వదేశంలో వంద వికెట్లకు నాలుగు వికెట్ల దూరంలో ఉన్న ఉమేశ్ యాదవ్ తుది జట్టులోకి రానున్నాడు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో కలిసి ఉమేశ్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నాడు.
బ్యాట్తో బదులిస్తారా?! : స్పిన్ సవాల్ను ఎదుర్కొలేని ఇంగ్లాండ్.. పిచ్లపై నానా యాగీ చేస్తోంది. కనీసం సిరీస్లో నాలుగో టెస్టులోనైనా స్పిన్ సవాల్కు బ్యాట్తో బదులిస్తుందా? లేదంటే షరా మామూలుగా సాకులు వెతకటంలోనే నిమగమైతుందా? మొతెరాలోనే తేలాలి. తొలి టెస్టులో ద్వి శతకంతో ఇంగ్లాండ్ను గెలుపు బాటలో నడిపించిన కెప్టెన్ జో రూట్ సహా ఇతర బ్యాట్స్మెన్ మెరిస్తే ఇంగ్లాండ్కు అవకాశాలు ఉన్నాయి. నాణ్యమైన స్పిన్ను ఎదుర్కొవటంలో బ్యాట్లేత్తెస్తున్న ఇంగ్లాండ్.. మరో స్పిన్ ట్రాక్పై నిలబడటం ప్రశ్నార్థకమే. వండర్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ తన ఉనికి చాటే ఇన్నింగ్స్పై కన్నేయగా... మొతెరాలో పింక్ బాల్పై రెండు ఇన్నింగ్స్ల్లోనూ ఖాతా తెరువని జానీ బెయిర్స్టో ఎదురుదాడి చేసేందుకు ఉవ్విళ్లూరుతున్నాడు. సిబ్లీ, క్రావ్లీ, పోప్, ఫోక్స్లు ఎదురుదాడి వ్యూహం పక్కనపెట్టి, డిఫెన్స్ను సైతం నమ్ముకుంటే పరుగుల వేటలో ఫలితం భిన్నంగా ఉండవచ్చు. బౌలింగ్ విభాగంలో స్టువర్ట్ బ్రాడ్పై వేటు పడవచ్చు. స్పిన్నర్ జాక్ లీచ్కు తోడుగా డామ్ బెస్ తుది జట్టులోకి రానున్నాడు. జోఫ్రా ఆర్చర్తో కలిసి అండర్సన్ పేస్ విభాగం చూసుకోనున్నాడు.
పిచ్, పరిస్థితులు : పింక్ బాల్ టెస్టు, చెన్నై రెండో టెస్టుకు ఎదురైన పిచ్ల తరహాలోనే నాలుగో టెస్టుకూ పిచ్ను సిద్ధం చేసినట్టు తెలుస్తోంది. అహ్మదాబాద్లో ఉష్ణోగ్రతలు అధికంగా ఉండనున్నాయి. స్పిన్తో పాటు హీట్ను సైతం ఇంగ్లాండ్ అధిగమించాల్సి ఉంటుంది. మ్యాచ్ మళ్లీ ఎర్ర బంతితో కావటంతో క్రీజులో నిలిస్తే పరుగులు చేయటం బ్యాట్స్మెన్కు పెద్ద కష్టం కాబోదు. టాస్ నెగ్గిన జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకునేందుకు మొగ్గుచూపనుంది.
తుది జట్లు (అంచనా) :
భారత్ : రోహిత్ శర్మ, శుభ్మన్ గిల్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి (కెప్టెన్), అజింక్య రహానె, రిషబ్ పంత్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, వాషింగ్టన్ సుందర్, ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.
ఇంగ్లాండ్ : జాక్ క్రావ్లీ, డామినిక్ సిబ్లీ, జానీ బెయిర్స్టో, జో రూట్ (కెప్టెన్), బెన్ స్టోక్స్, ఒలీ పోప్, బెన్ ఫోక్స్ (వికెట్ కీపర్), డామ్ బెస్, జోఫ్రా ఆర్చర్, జాక్ లీచ్, జేమ్స్ అండర్సన్
స్పిన్ పిచ్లపై ఎప్పుడూ విపరీతమైన చర్చ ఉంటుంది. న్యూజిలాండ్లో భారత్ మూడో రోజు 36 ఓవర్లలోనే ఆలౌటైంది. మేము ఎవరూ పిచ్ గురించి మాట్లాడలేదు. మీడియా పిచ్ గురించి రాయలేదు. అందరూ మా ప్రదర్శనపై దృష్టి నిలిపారు. భారత్ పతనంలో పిచ్ పాత్ర ఎంతని ఎవరూ శోధించలేదు. భారత జట్టు సక్సెస్కు కారణం మేము ఆడిన పిచ్లపై సాకులు వెతకలేదు. టెస్టు మ్యాచ్ 4, 5 రోజుల్లో ముగిసినప్పుడు లేని చర్చ రెండు రోజుల్లోనే ముగిస్తే ఉత్పన్నం అవుతోంది. ఐదు రోజులు అలరించేందుకు టెస్టు మ్యాచులు ఆడాలా? మేము విజయం కోసం ఆడుతున్నాం. నేనో, పుజారనో, రహానెనో పరుగులు చేసేందుకు కాదు. భారత విజయంలోనే ఆనందం ఉంది. అభిమానులు అదే ఆస్వాదిస్తారు, అది ఎన్ని రోజుల్లో వచ్చిందనేది అవసరం లేదు. టెస్టు క్రికెట్ను సీరియస్గా ఆడని జట్లకు ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్షిప్స్ కొత్త లక్ష్యాలను నిర్దేశిస్తుంది. భారత్ ఎప్పుడూ టెస్టు క్రికెట్ను ప్రథమ ప్రాధాన్యంగానే ఆడింది. టెస్టు చాంపియన్షిప్స్ గురించి ఆలోచన భారత జట్టు లక్ష్యాల నుంచి దృష్టి మళ్లించటమే అవుతుంది. మ్యాచ్ ఏదైనా మేము ఆడే తీరులో ఎటువంటి మార్పు ఉండదు'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్