Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 205 ఆలౌట్
- మొతెరాలో తొలి రోజు భారత్ పైచేయి
- భారత్ తొలి ఇన్నింగ్స్ 24/1
- భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు తొలి రోజు
మొతెరాలో మాయ మళ్లీ మొదలైంది. అక్షర్ పటేల్ (4/68), అశ్విన్ (3/47) స్పిన్ ఉచ్చులో ఇంగ్లాండ్ పడిపోయింది. చివరి టెస్టు తొలి రోజే స్పిన్ చేతికి చిక్కింది. తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకే కుప్పకూలింది. బ్యాటింగ్కు అనుకూలిస్తున్న పిచ్పై ఇంగ్లాండ్ను భారత బౌలర్లు సమర్థవంతంగా నిలువరించారు. బెన్ స్టోక్స్ (55) అర్ధ సెంచరీ ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్కు మెరుగైన స్కోరు అందించాడు. ఇంగ్లాండ్ను స్వల్ప స్కోరుకే ఆలౌట్ చేసిన భారత్.. తొలి రోజు పూర్తి ఆధిపత్యం సాధించింది. నేడు బ్యాట్స్మెన్ కదం తొక్కితే టెస్టు పూర్తిగా భారత్ చేతుల్లోకి రావటం లాంఛనమే!.
నవతెలంగాణ-అహ్మదాబాద్
బంతి రంగు మారింది. పిచ్ స్వభావం మారింది. అయినా, ఇంగ్లాండ్ బ్యాటింగ్ వ్యథలో ఎటువంటి మార్పు లేదు. భారత స్పిన్ ద్వయం మాయకు మరోసారి ఇంగ్లాండ్ కుప్పకూలింది. బ్యాటింగ్ అనుకూల పిచ్పై టాస్ నెగ్గి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్నప్పటికీ, పెద్దగా ప్రయోజనం లేకుండా పోయింది. అక్షర్ పటేల్ (4/68), రవిచంద్రన్ అశ్విన్ (3/47)లకు తోడు హైదరాబాదీ సీమర్ మహ్మద్ సిరాజ్ (2/45) రెచ్చిపోవటంతో ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్లో 205 పరుగులకే కుప్పకూలింది. ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (55, 121 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు) అర్థ సెంచరీతో రాణించాడు. జానీ బెయిర్స్టో (28, 67 బంతుల్లో 6 ఫోర్లు), ఒలీ పోప్ (28, 87 బంతుల్లో 2 ఫోర్లు) సహా డానియల్ లారెన్స్ (46, 74 బంతుల్లో 8 ఫోర్లు) ఇంగ్లాండ్ గౌరవప్రద స్కోరు చేరుకునేలా చేశారు. తొలి ఇన్నింగ్స్లో 12 ఓవర్లు బ్యాటింగ్ చేసిన భారత్ యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (0)ను కోల్పోయింది. రోహిత్ శర్మ (8 బ్యాటింగ్, 34 బంతుల్లో 1 ఫోర్), చతేశ్వర్ పుజారా (15 బ్యాటింగ్, 36 బంతుల్లో 1 ఫోర్)లు అజేయంగా ఆడుతున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో 24/1తో కొనసాగుతుంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్కు మరో 181 పరుగులు వెనుకంజలో నిలిచింది.
ఆ ముగ్గురు అదుర్స్ : అహ్మదాబాద్ పిచ్పై కీలకమైన టాస్ను మరోసారి ఇంగ్లాండ్ గెలుచుకుంది. పచ్చికతో కూడిన పిచ్ నుంచి ఆరంభంలో పేసర్లు స్వింగ్ను రాబట్టారు. అయినా, తొలి వికెట్ కోసం లోకల్ మాయగాడు అక్షర్ పటేల్ రంగంలోకి దిగక తప్పలేదు. ఇన్నింగ్స్ ఆరో ఓవర్లోనే బంతి అందుకున్న అక్షర్ పటేల్ వేసిన రెండో బంతికే వికెట్ తీసుకున్నాడు. ఓపెనర్ డామినిక్ సిబ్లీ (2) అక్షర్ పటేల్ స్ట్రయిట్ బాల్కు వికెట్ కోల్పోయాడు. తన తర్వాతి ఓవర్లో అక్షర్ మరోసారి దాడి చేశాడు. మరో ఓపెనర్ జాక్ క్రావ్లీ (9)ను పెవిలియన్కు పంపించాడు. అక్షర్ పటేల్పై క్రీజు వదిలి ఎదురుదాడి చేసిన జాక్ క్రావ్లీ మిడ్ ఆఫ్లో సిరాజ్ క్యాచ్తో నిష్క్రమించాడు. అప్పటికి ఇంగ్లాండ్ స్కోరు 15/2. బుమ్రా స్థానంలో జట్టులోకి వచ్చిన మహ్మద్ సిరాజ్ ఇంగ్లాండ్పై నిప్పులు చెరిగాడు. ఆ జట్టు ప్రధాన బ్యాట్స్మన్ జో రూట్ సహా ఓపెనర్ జానీ బెయిర్స్టోను తన దారిలోకి తెచ్చుకుని అవుట్ చేశాడు. అవుట్ స్వింగర్లతో జో రూట్ను ఇరకాటంలో పడేసిన సిరాజ్.. డ్రింక్స్ విరామం అనంతరం తొలి బంతికే రూట్ను (5)ను అవుట్ చేశాడు. సిరాజ్ కండ్లుచెదిరే ఇన్స్వింగర్కు రూట్ దగ్గర సమాధానం కరువైంది. జానీ బెయిర్స్టో (28)ను సైతం అదే తరహాలో ఇన్స్వింగర్తో వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ట్రంప్కార్డ్ స్పిన్నర్ అశ్విన్ లోయర్ ఆర్డర్పై మాయ ప్రదర్శించాడు. ప్రమాదకరంగా మారుతున్న ఒలీ పోప్ (29), బెన్ ఫోక్స్ (1), జాక్ లీచ్ (7)లను అవుట్ చేశాడు. ఈ ముగ్గురు చెలరేగటంతో ఇంగ్లాండ్ బ్యాటింగ్ లైనప్ కుదేలైంది.
30/3తో కష్టాల్లో పడిన ఇంగ్లాండ్ను ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (55, 121 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్స్లు), జానీ బెయిర్స్టో (28, 67 బంతుల్లో 8 ఫోర్లు) ఆదుకునే ప్రయత్నం చేశారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్కు 48 పరుగులు జోడించారు. బెన్ స్టోక్స్ ఆరంభం నుంచీ దూకుడుగా ఆడాడు. మహ్మద్ సిరాజ్ ఓవర్లో మూడు ఫోర్లు బాదిన స్టోక్స్.. అశ్విన్పైనా ఎటాక్ చేశాడు. ఆరు ఫోర్లు, రెండు సిక్సర్లతో 114 బంతుల్లో బెన్ స్టోక్స్ సిరీస్లో తన తొలి అర్థ సెంచరీ సాధించాడు. బెయిర్స్టో నిష్క్రమణ తర్వాత ఒలీ పోప్తో కలిసి స్టోక్స్ కీలక భాగస్వామ్యం నిర్మించాడు. ఫిఫ్టీ మార్క్ చేరుకున్న అనంతరం ఎంతోసేపు వికెట్ కాపాడుకోలేదు. స్టోక్స్ పెవిలియన్కు చేరినా.. ఒలీ పోప్, డానియల్ లారెన్స్ (46)లు భారత బౌలర్ల జోరును అడ్డుకున్నారు. 8 ఫోర్లతో కదం తొక్కిన లారెన్స్ వేగంగా పరుగులు పిండుకున్నాడు. లోయర్ ఆర్డర్లో పోప్, లారెన్స్ జోరుతో ఇంగ్లాండ్ 121/5 నుంచి కోలుకుని 205 పరుగులు చేసింది. మరో స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్కు బెన్ స్టోక్స్ వికెట్ కోల్పోయాడు.
అండర్సన్ నిప్పులు : తొలి రోజు మూడో సెషన్ ఆఖర్లో భారత్ తొలి ఇన్నింగ్స్లో 12 ఓవర్ల పాటు బ్యాటింగ్ చేసింది. సీనియర్ పేసర్ జేమ్స్ అండర్సన్ (1/0) నిప్పులు చెరిగాడు. ఇన్నింగ్స్ మూడో బంతికే శుభ్మన్ గిల్ (0)ను పెవిలియన్ దారి పట్టించాడు. తొలి స్పెల్లో ఐదు ఓవర్లు వేసిన అండర్సన్ ఓ వికెట్ తీసుకుని, 30 బంతుల్లో ఒక్క పరుగూ ఇవ్వలేదు. మరో ఓపెనర్ రోహిత్ శర్మ (8 బ్యాటింగ్)తో కలిసి చతేశ్వర్ పుజారా (13 బ్యాటింగ్) అజేయంగా ఆడుతున్నాడు. టెస్టు నిపుణుడు పుజారా 36 బంతుల్లో ఓ ఫోర్ సాయంతో 41.67 స్ట్రయిక్రేట్తో 13 పరుగులు చేయగా.. విధ్వంసకారుడు రోహిత్ శర్మ విచిత్రంగా 34 బంతుల్లో 1 ఫోర్తో 23.53 స్ట్రయిక్రేట్ 8 పరుగులే చేశాడు. తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 24/1తో ఉంది. ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్కు మరో 181 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. మూడో సెషన్లో ఇంగ్లాండ్ స్పిన్నర్లు జాక్ లీచ్, డామ్ బెస్లను పుజారా, రోహిత్లు అలవోకగా ఎదుర్కొన్నారు. బ్యాటింగ్కు అనుకూలం కావటంతో నేడు ఉదయం సెషన్లో రోహిత్ శర్మ నుంచి విధ్వంసక ఇన్నింగ్స్ను ఆశించవచ్చు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : జాక్ క్రావ్లీ (సి) మహ్మద్ సిరాజ్ (బి) అక్షర్ పటేల్ 9, డామినిక్ సిబ్లీ (బి) అక్షర్ పటేల్ 2, జానీ బెయిర్స్టో (ఎల్బీ) మహ్మద్ సిరాజ్ 28, జో రూట్ (ఎల్బీ) మహ్మద్ సిరాజ్ 5, బెన్ స్టోక్స్ (ఎల్బీ) వాషింగ్టన్ సుందర్ 55, ఒలీ పోప్ (సి) శుభ్మన్ గిల్ (బి) అశ్విన్ 29, డానియల్ లారెన్స్ (స్టంప్డ్) రిషబ్ పంత్ (బి) అక్షర్ పటేల్ 46, బెన్ ఫోక్స్ (సి) రహానె (బి) అశ్విన్ 1, డామినిక్ బెస్ (ఎల్బీ) అక్షర్ పటేల్ 3, జాక్ లీచ్ (ఎల్బీ) అశ్విన్ 7, జేమ్స్ అండర్సన్ నాటౌట్ 10, ఎక్స్ట్రాలు : 10, మొత్తం : (75.5 ఓవర్లలో ఆలౌట్) 205.
వికెట్ల పతనం : 1-10, 2-15, 3-30, 4-78, 5-121, 6-166, 7-170, 8-188, 9-189, 10-205.
బౌలింగ్ : ఇషాంత్ శర్మ 9-2-23-0, మహ్మద్ సిరాజ్ 14-2-45-2, అక్షర్ పటేల్ 26-7-68-4, అశ్విన్ 19.5-4-47-3, వాషింగ్టన్ సుందర్ 7-1-14-1.
భారత్ తొలి ఇన్నింగ్స్ : శుభ్మన్ గిల్ (ఎల్బీ) అండర్సన్ 0, రోహిత్ శర్మ బ్యాటింగ్ 8, చతేశ్వర్ పుజారా బ్యాటింగ్ 15, ఎక్స్ట్రాలు : 01, మొత్తం : (12 ఓవర్లలో 1 వికెట్) 24.
వికెట్ల పతనం : 1-0.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 5-5-0-1, బెన్ స్టోక్స్ 2-1-4-0, జాక్ లీచ్ 4-0-16-0, డామినిక్ బెస్ 1-0-4-0.
పిచ్ బ్యాటింగ్కు అనుకూలం. సహనంతో ఆడటమే వేయటమే మా వ్యూహం. ఇద్దరు పేసర్లే ఉండటంతో రోటేషన్ ముఖ్యమని కెప్టెన్ చెప్పాడు. రెండు ఓవర్లు వేయగానే.. ఇషాంత్ ఎండ్ నుంచి బౌలింగ్ చేయాలని చెప్పాడు. ఆస్ట్రేలియా, భారత్ వేదిక ఏదైనా వంద శాతం ప్రదర్శన ఇవ్వాలని అనుకుంటాను. ప్రతి బంతినీ బాగా వేయాలని నాతో నేను చెప్పుకుంటాను. బెన్ స్టోక్స్ నన్ను దూషించాడు. ఆ విషయాన్ని విరాట్ కోహ్లికి చెప్పాను. అక్కడ్నుంచి ఆ విషయాన్ని కోహ్లి చూసుకున్నాడు'
- మహ్మద్ సిరాజ్, భారత పేసర్