Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాషింగ్టన్ సుందర్ అర్థ శతకం
- ప్రస్తుత ఆధిక్యం 89 పరుగులు
- భారత్ తొలి ఇన్నింగ్స్ 294/7
- భారత్, ఇంగ్లాండ్ నాల్గో టెస్టు రెండో రోజు
80/4. విరాట్ కోహ్లి (0), పుజారా (17), అజింక్య రహానె (27)లు పెవిలియన్కు చేరుకున్నారు. భారత్ తొలి ఇన్నింగ్స్లో మరో 125 పరుగుల వెనుకంజలో కొనసాగుతోంది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన యువ విధ్వంసకారుడు రిషబ్ పంత్ (101, 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు) భారత్ను కష్టాల్లోంచి బయటకు పడేశాడు. వాషింగ్టన్ సుందర్తో కలిసి శతక భాగస్వామ్యం నెలకొల్పిన రిషబ్ పంత్ తొలి ఇన్నింగ్స్లో టీమ్ ఇండియాకు తిరుగులేని ఆధిక్యం అందించాడు. కీలక బ్యాట్స్మెన్ వైఫల్యంతో ఒత్తిడిలో పడిన భారత్.. పంత్ ధనాధన్తో మ్యాచ్ను చేతుల్లోకి తీసుకుంది. భారత్ ప్రస్తుతం 89 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది.
రోహిత్తో కలిసి భాగస్వామ్యం నిర్మించటమే తొలుత మా ప్రణాళిక. ఆ ఒక్కటే నా మదిలో ఉన్నది. పిచ్ను బేరీజు వేసి షాట్లు ఆడాలని అనుకున్నాను. మంచి బంతులను గౌరవించి సింగిల్స్ తీసుకోవటం.. పరిస్థితిని బట్టి ఎదురుదాడి చేయటం ఇదే నా గేమ్ ప్లాన్. స్కోరు 206 చేరుకున్న తర్వాత, వీలైనన్ని పరుగులు చేయటమే జట్టు ప్రణాళిక. జట్టుకు విజయాన్ని అందించటమే నా లక్ష్యం, ఆ ప్రయత్నంలో అభిమానులు మద్దతు అందిస్తే అది ఇంకా సంతోషం'
- రిషబ్ పంత్, భారత బ్యాట్స్మన్
నవతెలంగాణ-అహ్మదాబాద్
యువ విధ్వంసకారుడు రిషబ్ పంత్ (101, 118 బంతుల్లో 13 ఫోర్లు, 2 సిక్స్లు) శతకంతో గర్జించాడు. సిడ్నీ, బ్రిస్బేన్లో అసమాన ఇన్నింగ్స్లు ఆడినా.. మూడెంకల స్కోరును తృటిలో కోల్పోయిన రిషబ్ పంత్ మొతెరాలో వంద మోత మోగించాడు. జో రూట్పై ఒంటికాలుపై కూర్చోని స్లాగ్ స్వీప్తో సిక్సర్ కొట్టిన రిషబ్ పంత్ శతకం సాధించాడు. అజేయ అర్థ సెంచరీ బాదిన వాషింగ్టన్ సుందర్ (60 బ్యాటింగ్, 117 బంతుల్లో 8 ఫోర్లు)తో కలిసి ఏడో వికెట్కు 113 పరుగులు జోడించిన రిషబ్ పంత్ చివరి టెస్టులో భారత్ను తిరుగులేని స్థానంలో నిలిపాడు. రోహిత్ శర్మ, అశ్విన్, వాషింగ్టన్ సుందర్లతో కలిసి కీలక భాగస్వామ్యాలు నిర్మించి.. ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్షిప్స్ ఫైనల్లో భారత్కు బెర్త్ దాదాపుగా ఖరారు చేశాడు. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ జోరుతో తొలి ఇన్నింగ్స్లో భారత్ 89 పరుగుల ఆధిక్యంలో కొనసాగుతోంది. అక్షర్ పటేల్ (11 బ్యాటింగ్, 34 బంతుల్లో 2 ఫోర్లు), వాషింగ్టన్ సుందర్లు అజేయంగా ఆడుతున్నారు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి భారత్ 294/7 వద్ద నిలిచింది. తొలి సెషన్లో కీలక పుజారా, కోహ్లి, రహానె వికెట్లను కూల్చిన ఇంగ్లాండ్.. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంపై ఆశలతో రెండో సెషన్కు వచ్చింది. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్లు ఇంగ్లాండ్ ఆశలను ఆవిరి చేశారు.
ఆరంభం ఆందోళనకరం : యువ ఓపెనర్ శుభ్మన్ గిల్ (0)ను సున్నా పరుగులకే కోల్పోయిన భారత్.. రెండో రోజు ఉదయం సెషన్ ఆరంభంలోనే టెస్టు స్పెషలిస్ట్ చతేశ్వర్ పుజారా (17) వికెట్ను నష్టపోయింది. స్పిన్పై జాగ్రత్తగా ఆడిన పుజారా.. మరోసారి జాక్ లీచ్ మ్యాజిక్కు తలొంచాడు. 66 బంతుల్లో ఓ ఫోర్తో 17 పరుగులు చేసిన పుజారా జాక్ లీచ్కు వికెట్ల ముందు దొరికిపోయాడు. అప్పటికి భారత్ స్కోరు 40/2. వండర్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ ఆతిథ్య జట్టుకు గట్టి షాక్ ఇచ్చాడు. సూపర్స్టార్ విరాట్ కోహ్లి (0)ని డకౌట్ చేశాడు. స్టోక్స్ ఓవర్లో కోహ్లి వికెట్ల వెనకాల క్యాచౌట్గా నిష్క్రమించాడు. అప్పటికి భారత్ 41/3. వైస్ కెప్టెన్ అజింక్య రహానె (27, 45 బంతుల్లో 4 ఫోర్లు)తో కలిసి ఓపెనర్ రోహిత్ శర్మ (49, 144 బంతుల్లో 7 ఫోర్లు) ఇన్నింగ్స్ను ముందుకు నడిపించాడు. ఈ ఇద్దరూ నాల్గో వికెట్కు 39 పరుగులు జోడించారు. లంచ్ విరామానికి ముందు అజింక్య రహానె వికెట్ కోల్పోవటంతో భారత్ కష్టాల్లో పడింది.
రిషబ్ పంతా.. మ్యాజికా! : భారత్ పీకల్లోతు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి వచ్చిన రిషబ్ పంత్ (101) తన అద్భుత ఇన్నింగ్స్తో ఆతిథ్య జట్టును ఆధిక్యంలో నిలిపే వరకూ క్రీజులోనే కొనసాగాడు. ఓపెనర్గా వచ్చి ఎంతో సహనంతో బ్యాటింగ్ చేసిన రోహిత్ శర్మ (49) అర్థ సెంచరీకి ఒక్క పరుగు దూరంలో ఆగిపోయాడు. పంత్ పరుగుల వేట బాధ్యత తీసుకోవటంతో ఈ జోడీ ఐదో వికెట్కు 41 పరుగులు జోడించింది. రోహిత్ శర్మ నిష్క్రమణతో రవిచంద్రన్ అశ్విన్ (13) కాసేపు పంత్కు చేయూత అందించాడు. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్ (60 బ్యాటింగ్) తోడుగా పంత్ ప్రతాపం కొనసాగించాడు. వాషింగ్టన్, రిషబ్ పంత్లు ఎంతో జాగ్రత్తగా బ్యాటింగ్ చేశారు. ఆరు వికెట్లు పడిపోవటం, తొలి ఇన్నింగ్స్ లోటు భారీగా ఉండటంతో ఆచితూచి షాట్లు ఎంచుకున్నారు. 100 బంతుల్లో 50 పరుగులు జోడించిన ఈ జోడీ.. పంత్ ధనాధన్తో మరో 46 బంతుల్లోనే 50 పరుగులు పిండుకుంది. ఈ జోడీ ఏడో వికెట్కు ఏకంగా 113 పరుగులు జత చేసింది. ఈ మ్యాచ్లో ఇదే అత్యధిక భాగస్వామ్యం కావటం విశేషం.
రెండో సెషన్లో వచ్చిన పంత్.. చివరి సెషన్ ఆఖరు వరకూ ఇంగ్లాండ్తో ఆడుకున్నాడు. నాలుగు ఫోర్లు, ఓ సిక్సర్తో 82 బంతుల్లో అర్థ సెంచరీ సాధించిన పంత్.. శతక మార్క్ను షరవేగంగా చేరుకున్నాడు. స్పిన్నర్ జో రూట్పై భారీ సిక్సర్తో 115 బంతుల్లోనే వంద పరుగులు బాదేశాడు. కొత్త బంతితో వచ్చిన జేమ్స్ అండర్సన్కు వరుస బౌండరీలతో స్వాగతం పలికిన పంత్.. బెన్ స్టోన్స్కూ వదల్లేదు. పేసర్లను ఇద్దరినీ బౌర్లతో బెంబేలెత్తించాడు. అండర్సన్ ఓవర్లో ఆడిన రివర్స్ స్వీప్ షాట్ పంత్ భయమెరుగని బ్యాటింగ్కు మచ్చుతునక అని చెప్పవచ్చు. మరో ఎండ్లో వాషింగ్టన్ సుందర్ సైతం పంత్కు గొప్ప సహకారం అందించాడు. నిజానికి పంత్, సుందర్ భాగస్వామ్యంలో ఎక్కువ పరుగులు చేసింది పంతే అయినా.. ఎక్కువ బంతులను సుందర్ ఎదుర్కొన్నాడు. ఏడు ఫోర్ల సాయంతో 96 బంతుల్లో వాషింగ్టన్ సుందర్ మరో టెస్టు అర్థ సెంచరీ నమోదు చేశాడు. ఇంగ్లాండ్ స్కోరు సమం అయిన తర్వాత పంత్, సుందర్ వేగం పెంచారు. చకాచకా పరుగులు పిండుకున్నారు. శతక గర్జన అనంతరం రిషబ్ పంత్ వికెట్ కోల్పోయినా సుందర్ జోరు తగ్గలేదు. అక్షర్ పటేల్ (11 బ్యాటింగ్) తోడుగా 35 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. ఇంగ్లాండ్ బౌలర్లలో జేమ్స్ అండర్సన్ 3/40), బెన్ స్టోక్స్ (2/73), జాక్ లీచ్ (2/66)లు ఆకట్టుకున్నారు. డామినిక్ బెస్ (0/56), జో రూట్ (0/46)లకు వికెట్లు దక్కలేదు.
స్కోరు వివరాలు
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 205/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : శుభ్మన్ గిల్ (ఎల్బీ) అండర్సన్ 0, రోహిత్ శర్మ (ఎల్బీ) బెన్ స్టోక్స్ 49, చతేశ్వర్ పుజారా (ఎల్బీ) జాక్ లీచ్ 17, విరాట్ కోహ్లి (సి) బెన్ ఫోక్స్ (బి) బెన్ స్టోక్స్ 0, అజింక్య రహానె (సి) బెన్ స్టోక్స్ (బి) అండర్సన్ 27, రిషబ్ పంత్ (సి) జో రూట్ (బి) అండర్సన్ 101, రవిచంద్రన్ అశ్విన్ (సి) ఒలీ పోప్ (బి) జాక్ లీచ్ 13, వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్ 60, అక్షర్ పటేల్ బ్యాటింగ్ 11, ఎక్స్ట్రాలు : 34, మొత్తం : (94 ఓవర్లలో 7 వికెట్లకు) 294.
వికెట్ల పతనం : 1-0, 2-40, 3-41, 4-80, 5-121, 6-146, 7-259.
బౌలింగ్ : జేమ్స్ అండర్సన్ 20-11-40-3, బెన్ స్టోక్స్ 22-6-73-2, జాక్ లీచ్ 23-5-66-2, డామినిక్ బెస్ 15-1-56-0, జో రూట్ 14-1-46-0.