Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సెమీస్లో శ్రీకాంత్ ఓటమి
- స్విస్ ఓపెన్ బ్యాడ్మింటన్
బసెల్ : భారత అగ్రశ్రేణి షట్లర్, తెలుగు తేజం పి.వి సింధు స్విస్ ఓపెన్ ఫైనల్లోకి ప్రవేశించింది. కరోనా వైరస్ మహమ్మారి అనంతర పున ప్రారంభమైన అంతర్జాతీయ బ్యాడ్మింటన్ సర్క్యూట్లో మూడో టోర్నీ ఆడుతున్న సింధు.. మహిళల సింగిల్స్ టైటిల్ పోరుకు అర్హత సాధించింది. శనివారం జరిగిన మహిళల సింగిల్స్ సెమీఫైనల్లో నాల్గో సీడ్ డెన్మార్క్ షట్లర్ మియా బ్లిచఫెల్డ్పై సింధు వరుస సెట్లలో విజయం సాధించింది. 22-20, 21-10తో 43 నిమిషాల్లోనే సెమీస్ సమరాన్ని ముగించింది. తొలి గేమ్లో సింధుకు గట్టి ప్రతిఘటన ఎదురైంది. 11-8తో విరామ సమయానికి మంచి ఆధిక్యంలో నిలిచినా.. ద్వితీయార్థంలో డెన్మార్క్ చిన్నది పుంజుకున్నది. 13-11, 16-12తో దూసుకెళ్తోన్న సింధును 17-17 వద్ద నిలువరించింది. స్కోరు సమం చేసి గేమ్ను ఉత్కంఠభరితం చేసింది. సింధు 20-17తో గేమ్ పాయింట్ వద్ద నిలిచినా..మియా 20-20తో సమవుజ్జీగా నిలిచింది. వరుసగా రెండు పాయింట్లు సాధించిన సింధు టైబ్రేకర్లో తొలి గేమ్ను సొంతం చేసుకుంది. రెండో గేమ్లో సింధుకు ఎదురులేదు. స్పష్టమైన ఆధిపత్యం చూపించిన సింధు అలవోకగా రెండో గేమ్ను ఫైనల్స్ బెర్త్ను కైవసం చేసుకుంది. పురుషుల సింగిల్స్లో తెలుగు షట్లర్ కిదాంబి శ్రీకాంత్ పోరాటానికి తెరపడింది. వరల్డ్ నం.1 విక్టర్ అక్సెల్సెన్ చేతిలో 13-21, 19-21తో పోరాడి ఓడాడు.