Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లో భారత్
- చివరి టెస్టులో ఇంగ్లాండ్పై ఇన్నింగ్స్ 25 పరుగుల విజయం
- ఐదు వికెట్ల మాయ చేసిన అశ్విన్, అక్షర్ పటేల్
- 3-1తో టెస్టు సిరీస్ భారత్ కైవసం
భారత్ అదరగొట్టింది. ఇంగ్లాండ్ను ఇరగదీసింది. దర్జాగా ఐసీసీ టెస్టు ప్రపంచ చాంపియన్షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించింది. న్యూజిలాండ్తో లార్డ్స్ ఫైనల్లో తొలి టెస్టు చాంపియన్షిప్ ట్రోఫీ కోసం కోహ్లిసేన సమర సన్నాహకం పూరించనుంది. 3-1తో ఇంగ్లాండ్పై టెస్టు సిరీస్ను సాధించిన టీమ్ ఇండియా ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ పాయింట్ల జాబితాలో అగ్రస్థానంలో నిలిచింది. స్పిన్నర్లు అశ్విన్ (5/47), అక్షర్ పటేల్ (5/48)లు ఐదేసి వికెట్లు పడగొట్టడంతో ఇంగ్లాండ్కు ఇన్నింగ్స్ ఓటమి తప్పలేదు. 165 పరుగుల తొలి ఇన్నింగ్స్ లోటుతో రెండో ఇన్నింగ్స్కు వచ్చిన ఇంగ్లాండ్ స్పిన్ వలలో చిక్కుకుని 135 పరుగులకే కుప్పకూలింది. వాషింగ్టన్ సుందర్ (96 నాటౌట్), అక్షర్ పటేల్ (43)లు శతక భాగస్వామ్యంతో భారత్ మరోసారి బ్యాటింగ్ చేసే అవసరం రానీయలేదు. ఇన్నింగ్స్ 25 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన భారత్.. 3-1తో టెస్టు సిరీస్ను కైవసం చేసుకుంది.
నవతెలంగాణ-అహ్మదాబాద్
ఇంగ్లాండ్ చిత్తు చిత్తు. టెయిలెండర్ల దెబ్బకు పర్యాటక జట్టుకు దారుణ పరాభవం. వాషింగ్టన్ సుందర్ (96 నాటౌట్, 174 బంతుల్లో 10 ఫోర్లు, 1 సిక్స్), అక్షర్ పటేల్ (43, 97 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్) ఎనిమిదో వికెట్కు 106 పరుగుల భారీ భాగస్వామ్యంతో అద్భుత ప్రదర్శన చేసి తొలి ఇన్నింగ్స్లో భారత్కు 165 పరుగుల భారీ ఆధిక్యం అందించారు. అక్షర్ పటేల్ (5/48), రవిచంద్రన్ అశ్విన్ (5/47)లు బంతితో మాయజాలం చేయటంతో రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ 135 పరుగులకే చేతులెత్తేసింది. భారత్ తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని సైతం పూడ్చలేకపోయింది. 25 పరుగుల తేడాతో ఇన్నింగ్స్ పరాజయం చవిచూసింది. ఇంగ్లాండ్ జట్టులో డానియల్ లారెన్స్ (50, 95 బంతుల్లో 6 ఫోర్లు) అర్థ సెంచరీతో ఇంగ్లాండ్ ఓటమి అంతరాన్ని గణనీయంగా కుదించాడు. తొలి ఇన్నింగ్స్లో మ్యాచ్ను మలుపు తిప్పే శతక ఇన్నింగ్స్తో చెలరేగిన వికెట్ కీపర్ బ్యాట్స్మన్ రిషబ్ పంత్ 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు. సిరీస్లో 8 ఇన్నింగ్స్ల్లో 32 వికెట్లు, ఓ శతకం సహా 189 పరుగులు సాధించిన రవిచంద్రన్ అశ్విన్ 'ప్లేయర్ ఆఫ్ ది సిరీస్' అవార్డు అందుకున్నాడు. తొలి టెస్టులో ఓడినా.. వరుసగా మూడు టెస్టుల్లో ఘన విజయాలు సాధించిన భారత్ టెస్టు సిరీస్ను 3-1తో సొంతం చేసుకుంది. భారత్, ఇంగ్లాండ్ ఐదు వన్డేల సిరీస్ అహ్మదాబాద్లోనే మార్చి 12న తొలి టీ20తో ఆరంభం కానుంది.
ఆగని మాయజాలం : భారత టెయిలెండర్లు పరుగుల వరద పారించిన చోట ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్మెన్ పరుగుల వేటలో వెనుకంజ వేశారు. సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మ సహకారం లేకుండానే రెండో ఇన్నింగ్స్లో ఇంగ్లాండ్ను భారత్ కుప్పకూల్చింది. హైదరాబాదీ పేసర్ మహ్మద్ సిరాజ్తో కలిసి వికెట్ల వేట మొదలెట్టిన అక్షర్ పటేల్.. బ్యాట్స్మెన్ను ఇరకాటంలో పడేశాడు. ఇన్నింగ్స్ ఐదో ఓవర్లో బంతి అందుకున్న రవిచంద్రన్ అశ్విన్ వచ్చీ రాగానే ఇంగ్లాండ్ను దెబ్బతీశాడు. ఓపెనర్ జాక్ క్రావ్లీ (5), జానీ బెయిర్స్టో (0)లను వరుస బంతుల్లో అవుట్ చేశాడు. రహానెకు స్లిప్స్లో క్రావ్లీ క్యాచ్ ఇచ్చుకోగా... లెగ్ స్లిప్స్లో రోహిత్ క్యాచ్తో బెయిర్స్టో కథ ముగిసింది. మరో ఓపెనర్ డామినిక్ సిబ్లీ (3), వండర్ ఆల్రౌండర్ బెన్ స్టోక్స్ (2)లను అవుట్ చేసిన అక్షర్ పటేల్ ఇంగ్లాండ్ను 30/4తో పరాజయ కోరల్లోకి నెట్టాడు. ఓ ఎండ్లో వికెట్ల పతనాన్ని అడ్డుకుంటున్న ఇంగ్లాండ్ కెప్టెన్ జో రూట్ (30, 72 బంతుల్లో 3 ఫోర్లు)ను అశ్విన్ మరోసారి తన ఖాతాలో వేసుకున్నాడు. వరుసగా ర్యాంక్ టర్నర్లను సంధించిన అశ్విన్.. రూట్ను స్ట్రయిట్ బాల్తో బలిగొన్నాడు. రూట్ నిష్క్రమణ తర్వాత 65/5తో ఉన్న ఇంగ్లాండ్ వంద పరుగులు చేయటం గగనమే అనిపించింది.
ఇంగ్లాండ్కు మ్యాచ్పై ఏ మాత్రం ఆశల్లేని పరిస్థితుల్లో డానియల్ లారెన్స్ (50, 95 బంతుల్లో 6 ఫోర్లు), బెన్ ఫోక్స్ (13, 46 బంతుల్లో) భారత స్పిన్నర్ల సహనాన్ని పరీక్షించారు. ఆరు బౌండరీలతో అర్థ సెంచరీ సాధించిన లారెన్స్.. మరోసారి భారత్ను బ్యాటింగ్ రప్పించే ఉద్దేశంతోనే కనిపించాడు. బెన్ ఫోక్స్, డామినిక్ బెస్ (2) వికెట్ను పడగొట్టిన అక్షర్ పటేల్.. పతనాన్ని పూర్తి చేసే బాధ్యతను అశ్విన్ను అప్పగించాడు. అర్థ సెంచరీ హీరో లారెన్స్ను క్లీన్ బౌల్డ్ చేసిన అశ్విన్ మ్యాచ్లో ఐదు వికెట్ల ప్రదర్శన చేశాడు. ఇంగ్లాండ్ ఇన్నింగ్స్లో పది వికెట్లను అశ్విన్, అక్షర్ పటేల్ సమంగా పంచుకున్నారు. అరంగేట్ర టెస్టు సిరీస్లోనే అక్షర్ పటేల్ ఏకంగా నాలుగు సార్లు ఐదు వికెట్ల ప్రదర్శన గావించి ఆకట్టుకున్నాడు. సిరీస్లో అశ్విన్ 32 (నాలుగు టెస్టులు) వికెట్లు తీసుకోగా.. అక్షర్ పటేల్ మూడు టెస్టుల్లోనే 27 వికెట్లు తీసుకున్నాడు.
సుందర్, అక్షర్ అదుర్స్ : 146/6 వద్ద రిషబ్ పంత్కు తోడైన వాషింగ్టన్ సుందర్ లోయర్ ఆర్డర్లో రెండు శతక భాగస్వామ్యాలు నెలకొల్పాడు. రిషబ్ పంత్ అండగా తొలుత తొలి ఇన్నింగ్స్ లోటు భర్తీ చేసిన సుందర్... అక్షర్ పటేల్ తోడుగా భారత్కు తిరుగులేని తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం అందించాడు. పంత్తో 113 పరుగులు జోడించిన సుందర్.. పటేల్తో కలిసి ఎనిమిదో వికెట్కు 106 పరుగులు జత చేశాడు. 174 బంతుల్లో పది ఫోర్లు, ఓ సిక్సర్తో 96 పరుగులు చేసిన వాషింగ్టన్ సుందర్ శతకానికి దగ్గర్లో అజేయంగా మిగిలిపోయాడు. 97 బంతుల్లో ఐదు ఫోర్లు, ఓ సిక్సర్తో చెలరేగిన అక్షర్ పటేల్ (43) అర్థ సెంచరీకి ముంగిట రనౌట్గా నిష్క్రమించాడు. ఇషాంత్ శర్మ (0), మహ్మద్ సిరాజ్ (0)లను బెన్ స్టోక్స్ వరుసగా అవుట్ చేయటంతో మరో ఎండ్లో ఉన్న వాషింగ్టన్ సుందర్ శతకానికి దూరంగా ఉండిపోయాడు. బెన్ స్టోక్స్ (4/89), జేమ్స్ అండర్సన్ (3/44), జాక్ లీచ్ (2/89) రాణించారు.
స్కోరు వివరాలు :
ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ : 205/10
భారత్ తొలి ఇన్నింగ్స్ : శుభ్మన్ గిల్ (ఎల్బీ) అండర్సన్ 0, రోహిత్ శర్మ (ఎల్బీ) స్టోక్స్ 49, పుజారా (ఎల్బీ) లీచ్ 17, కోహ్లి (సి) ఫోక్స్ (బి) స్టోక్స్ 0, రహానె (సి) స్టోక్స్ (బి) అండర్సన్ 27, పంత్ (సి) రూట్ (బి) అండర్సన్ 101, అశ్విన్ (సి) పోప్ (బి) లీచ్ 13, వాషింగ్టన్ సుందర్ నాటౌట్ 96, అక్షర్ (రనౌట్) 43, ఇషాంత్ శర్మ (ఎల్బీ) స్టోక్స్ 0, సిరాజ్ (బి) స్టోక్స్ 0, ఎక్స్ట్రాలు : 19, మొత్తం : (114.4 ఓవర్లలో ఆలౌట్) 365.
వికెట్ల పతనం : 1-0, 2-40, 3-41, 4-80, 5-121, 6-146, 7-259, 8-365, 9-365, 10-365.
బౌలింగ్ : అండర్సన్ 25-14-3, స్టోక్స్ 27.4-6-89-4, జాక్ లీచ్ 27-5-89-2, డామ్ బెస్ 17-1-71-0, జో రూట్ 18-1-56-0.
ఇంగ్లాండ్ రెండో ఇన్నింగ్స్ : జాక్ క్రావ్లీ (సి) రహానె (బి) అశ్విన్ 5, డామినిక్ సిబ్లీ (సి) పంత్ (బి) అక్షర్ 3, బెయిర్స్టో (సి) రోహిత్ (బి) అశ్విన్ 0, జో రూట్ (ఎల్బీ) అశ్విన్ 30, బెన్ స్టోక్స్ (సి) కోహ్లి (బి) అక్షర్ 2, ఒలీ పోప్ (స్టంప్డ్) పంత్ (బి) అక్షర్ 15, లారెన్స్ (బి) అశ్విన్ 50, బెన్ ఫోక్స్ (సి) రహానె (బి) అక్షర్ 13, డామినిక్ బెస్ (సి) పంత్ (బి) అక్షర్ 2, జాక్ లీచ్ (సి) రహానె (బి) అశ్విన్ 2, అండర్సన్ నాటౌట్ 1, ఎక్స్ట్రాలు : 12, మొత్తం : (54.5 ఓవర్లలో ఆలౌట్) 135.
వికెట్ల పతనం : 1-10, 2-10, 3-20, 4-30, 5-65, 6-65, 7-109, 8-111, 9-134, 10-135.
బౌలింగ్ : 4-0-12-0, అక్షర్ పటేల్ 24-6-48-5, అశ్విన్ 22.5-4-47-5, వాషింగ్టన్ సుందర్ 4-0-16-0.
' ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్స్కు అర్హత సాధించటం ఆనందంగా ఉంది. నాలుగు నెలలుగా కఠినతర పరిస్థితుల్లో ఇదో రైడ్గా ఉంది. చెన్నై టెస్టులో శతకం సాధిస్తానని అనుకోలేదు. జట్టు మేనేజ్మెంట్ నాపై ఉంచిన నమ్మకమే ఈ ప్రదర్శనలో వ్యత్యాసం చూపించింది. నా కెరీర్లో ఇది అత్యుత్తమ దశ. గత కొన్నేండ్లుగా రిషబ్ పంత్ అద్భుతంగా రాణిస్తున్నాడు. జడేజా స్థానంలో అక్షర్ పటేల్ మంచి ప్రదర్శన చేశాడు. ఈ సిరీస్లో అక్షర్ పటేల్ బౌలింగ్ ఎంతో కచ్చితంగా, నిలకడగా ఉంది'
- అశ్విన్, మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్
' రెండో టెస్టులో పుంజుకోవటం నన్ను సంతోషానికి గురి చేసింది. జట్టుగా మా వైఫల్యాన్ని తొలి టెస్టు చూపించింది. టాస్ కీలక పాత్ర పోషించింది. రెండో టెస్టులో మేము పుంజుకోవటం బాగుంది. అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్లు భయమెరుగని ప్రదర్శనను ఇచ్చారు. రిషబ్ పంత్, వాషింగ్టన్ సుందర్ సహా అక్షర్ పటేల్లు మ్యాచ్ టర్నింగ్ ప్రదర్శనలు చేశారు. సిరీస్ను గెల్చుకోవటం ఎంతో సంతోషంగా ఉంది. అయినా, ఎప్పుడూ ఏదో ఒకటి మెరుగుపర్చుకోవాల్సిందే. ఇప్పుడు మేము ఐసీసీ ప్రపంచ టెస్టు చాంపియన్షిప్స్ ఫైనల్లోకి ప్రవేశించాం. నిజానికి అది మా దృష్టిని మరల్చే ఫైనల్స్ అనే చెప్పాలి'
- విరాట్ కోహ్లి, భారత కెప్టెన్