Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఒలింపిక్ హీరో నీరజ్ చోప్రా
న్యూఢిల్లీ : టోక్యో 2020 ఒలింపిక్స్ జావెలిన్ త్రో పసిడి పతకం సాధించి భారత క్రీడా చరిత్రలో సరికొత్త అధ్యాయానికి శ్రీకారం చుట్టిన యువ అథ్లెట్ నీరజ్ చోప్రా.. 2024 పారిస్ ఒలింపిక్స్లోనూ పసిడి చరిత్రపై కన్నేశాడు. 2019 నుంచి బయో మెకానిస్ట్ నిపుణుడు క్లాస్ బార్టినెజ్ వద్ద శిక్షణ పొందుతున్న నీరజ్ చోప్రా రానున్న ఒలింపిక్స్లోనూ అతడితో కలిసే బరిలోకి దిగాలని అనుకుంటున్నాడు. ఈ మేరకు ఇటీవల జరిగిన ఓ ప్యానల్ చర్చలో నీరజ్ చోప్రా వెల్లడించాడు. నీరజ్ చోప్రాకు శిక్షణ ఇచ్చిన మరో జర్మనీ కోచ్ ఉవె హాన్ను భారత అథ్లెటిక్ సమాఖ్య వదులుకున్న సంగతి తెలిసిందే. శిక్షణ పద్దతులు, వేతనం సహా ఇతర కారణాలతో ఉవే హాన్ కాంట్రాక్టును పొడగించలేదు. 'కొన్నిసార్లు నేను ప్రాక్టీస్ సెషన్లలో సీరియస్గా ఉండటం ఇష్టపడను. కొంత మంది కోచ్లు కర్ర పట్టుకుని మరీ సాధన చేయిస్తారు. శిక్షణపై సీరియస్ శ్రద్ద పెడుతూనే.. బార్టినెజ్ అదిరిపోయే జోకులు వేస్తాడు. దీంతో ప్రాక్టీస్ సెషన్లు ఆస్వాదించేలా సాగుతాయి. అతడి శిక్షణ పద్దతులు నాకు సరిపోతాయి. నాకు బార్టినెజ్తో బంధం ఏర్పడింది. వచ్చే ఒలింపిక్స్లోనూ అతడితోనే కొనసాగాలని కోరుకుంటున్నాను' అని నీరజ్ చోప్రా అన్నాడు. ఇక టోక్యో ఒలింపిక్స్లో మెడల్ ఈవెంట్కు ముందు ప్రాక్టీస్లో పెద్దగా చెమటోడ్చలేదని చోప్రా అన్నాడు. 'చాలా మంది అథ్లెట్లు ఫైనల్స్కు ఒకట్రెండు గంటలు ప్రాక్టీస్ సెషన్లో చెమటోడ్చి వచ్చారు. కానీ నేను ఒకటి, రెండు త్రోలు మాత్రమే ప్రాక్టీస్లో విసిరాను. నా శక్తిని మెడల్ ఈవెంట్ కోసం అట్టిపెట్టుకున్నాను. నా కోచ్ ఇది చూసి, ఎందుకు త్రో విసరటం లేదని అడిగాడు. వేడితో కూడిన టోక్యో వాతావరణంలో ఈవెంట్కు ముందు ఎక్కువ సాధన చేయకూడదని అర్హత రౌండ్లోనే తెలిసింది' అని చోప్రా తెలిపాడు.