Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-వ్యక్తుల వల్లే ఫిఫాకు చెడ్డ పేరు.. ఆటతో కాదు
- ఆటకు అవినీతికి సంబంధం లేదు
న్యూఢిల్లీ : ఫుట్బాల్ దిగ్గజం పీలె ఆరు రోజుల భారత పర్యటన విజయవంతంగా ముగిసింది. ఆయనను చూడడానికి పెద్ద ఎత్తున అభిమానులు తరలిరావడంతో స్థానిక అంబేద్కర్ స్టేడియం పీలే నామస్మరణలో మునిగిపోయింది. శుక్రవారం ముగిసిన అండర్-17 సుబ్రతో కప్ ఫైనల్ మ్యాచ్లో లిటిల్ ఏంజెల్స్ పారడైస్ స్కూల్పై 4-1తో గెలిచిన ఆల్ ఇండియా ఫుట్బాల్ ఫెడరేషన్ టీంకు పీలే కప్ను అందజేశారు. మ్యాచ్ జరుగుతున్నంత సేపు పీలే ఆద్యంతం ఎంజారు చేశారు. ఈ కార్యక్రమంలో పీలేతో పాటు భారత ఎయిర్ చీఫ్ అరుప్ రాహా కూడా పాల్గొన్నారు. అయితే వేదికపై అరుప్ రాహా మాట్లాడారు కానీ పీలేను మాట్లాడ్డానికి ఎవరూ ఆహ్వానించలేదు. దీంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. అయితే ఓపెన్ టాప్ జీప్లో పీలే మైదానం మొత్తం తిరిగి ప్రేక్షకులకు అభివాదం చేశారు. మ్యాచ్ అనంతరం ఇరుజట్ల ఆటగాళ్లు పీలేతో గ్రూప్ ఫొటోను దిగి అందమైన జ్ఞాపకంగా మిగిల్చుకున్నారు.
శుక్రవారం సాయంత్రం గుర్గాన్లోని ఒక హోటల్లో సుబ్రతో కప్ నిర్వాహకులు ఏర్పాటు చేసిన డిన్నర్లో పీలే విలేకరులతో మాట్లాడారు. 'కొందరి వల్ల ఫిఫాకు చెడ్డపేరు వచ్చింది గానీ ఆట వల్ల మాత్రం కాదు. ఇప్పటి వరకు ఫిఫాలో జరిగింది ఒక సిగ్గు చేటు పని. అక్కడ జరిగిన దానికి నేను క్షమాపణ చెబుతున్నాను. అయితే ఫిఫాలో జరిగిన అవినీతిని ఆటతో ముడి పెట్టకూడదు' అని ముగించారు.