Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- చెన్నై, రాజస్థాన్ ప్రాంఛైజీలపై బిసిసిఐ యూటర్న్?
ముంబయి : బిసిసిఐ అధికార పీఠంలో వైరివర్గం కూర్చున్నా..పనులు మాత్రం శ్రీనికి అనువుగానే జరుగుతున్నాయి!. బోర్డు ఏ సభ్యుడిపైనా ఉద్దేశ్యపూర్వకంగా కక్ష్యసాధింపు ధోరణి అవలంభించదన్న బిసిసిఐ చీఫ్ శశాంక్ మనోహర్ వ్యాఖ్యలు కార్యరూపంలోకి రానున్నాయి. ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో జస్టిస్ లోధా కమిటీచే రెండేళ్ల నిషేధానికి గురైన చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లపై బిసిసిఐ యూటర్న్ తీసుకునే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ ఆదివారం ముంబయిలో జరుగనున్న బిసిసిఐ వర్కింగ్ కమిటీ భేటీలో ఈ రెండు ప్రాంఛైజీల భవితవ్యం ప్రధాన అజెండాగా ఉండనుంది. ఇదివరకు ఆగష్టు 28న కోల్కత భేటీకి నిర్ణయించిన అంశాలనే తాజా సమావేశంలోనూ చర్చించనున్నారు. ఐపీఎల్ ఛైర్మన్ రాజీవ్ శుక్లా, బిసిసిఐ కార్యదర్శి అనురాగ్ ఠాకూర్, క్యాబ్ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ కమిటీ చెన్నై, రాజస్థాన్ జట్ల భవితవ్యం సహా ఐపీఎల్-9పై రోడ్మ్యాప్ రూపొందించారు. లోధా కమిటీ సిఫార్సులు శిరసావహిస్తామని చెప్పిన నేపథ్యంలో..చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ ప్రాంఛైజీలను వచ్చే రెండు ఐపీఎల్ సీజన్లకు దూరంగా ఉంచటంతో పాటు స్పాన్సర్లు, బ్రాడ్కాస్టర్స్ కోసం ఈ ఏడాది కొత్తగా రెండు ప్రాంఛైజీలను బిడ్ ద్వారా తీసుకోవాలని కమిటీ నివేదికలో సూచించినట్లు సమాచారం. కానీ జస్టిస్ లోధా కమిటీ సూచనలు అమలు చేయాల్సిన అవసరమేమీ లేదు, తాజాగా బిసిసిఐ ఆ రెండు ప్రాంఛైజీలకు ఏదేని శిక్ష విధిస్తే సరిపోతుందని బిసిసిఐ భావిస్తోందని బోర్డులోని ఓ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. తాజా పరిస్థితుల్లో చెన్నై, రాజస్థాన్లపై నిషేధం విధించే అవకాశం లేదని తెలుస్తోంది. దీనికి తోడు ఐపీఎల్ టైటిల్ స్పాన్సర్గా పెప్సీకో వైదొలగనున్న అంశం సైతం ఆదివారం నాటి వర్కింగ్ కమిటీ భేటీలో ప్రధాన అంశం కానుంది. తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ ప్రతినిధిగా వర్కింగ్ కమిటీ సమావేశానికి పి.ఎస్.రామన్ హాజరు కానున్నారు. విరుద్ధ ప్రయోజనాల ఆరోపణలతో బోర్డు సమావేశాలకు దూరంగా ఉంటున్న ఎన్.శ్రీనివాసన్..బిసిసిఐ ప్రతినిధిగా ఐసిసి ఛైర్మన్గా కొనసాగుతుండటం విశేషం.