Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కుర్రాళ్ల టైటిల్ పోరు నేడు
- విండీస్తో భారత్ ఢీ
- అండర్-19 వరల్డ్కప్
మీర్పూర్ : అజేయ రికార్డుతో టైటిల్ పోరుకు చేరుకున్న భారత కుర్ర జట్టు.. రికార్డు స్థాయిలో నాల్గో ట్రోఫీపై కన్నేసింది. వాస్తవానికి స్థాయికి తగిన ప్రదర్శన చేయకుండానే కుర్రాళ్లు ప్రపంచకప్ ఫైనల్లో ప్రవేశించారు. వార్మప్ మ్యాచుల్లో రికార్డు స్కోరు చేసిన భారత్.. అసలు పోరులో భారీ స్కోరు చేయలేదు. దీంతో టైటిల్ పోరులో కుర్రాళ్ల నుంచి అత్యుత్తమ ప్రదర్శన ఆశిస్తోంది టీమ్ మేనేజ్మెంట్. మరో వైపు కదనోత్సాహంలో ఉన్న వెస్టిండీస్.. ఫైనల్లో భారత్కు షాక్ ఇవ్వాలని భావిస్తోంది.
కెప్టెన్ ఇషాన్ కిషన్ సహా అన్మోల్ప్రీత్ సింగ్, సర్ఫరాజ్ ఖాన్, వాషింగ్టన్ సుందర్, ఆర్మన్ జాఫర్లు బ్యాటింగ్ ఆర్డర్లో ఫామ్లో ఉన్నారు. శ్రీలంకతో సెమీఫైనల్లో ఆరంభంలో తడబాటుకు గురైన టీమ్ ఇండియా.. మిడిల్ ఆర్డర్ రాణించటంతో రేసులోకి వచ్చింది. ఎంతో పరిణతితో ఆడిన కుర్రాళ్లు.. పోరాడగలిగే స్కోరు చేశారు. ఫైనల్లోనూ బ్యాట్స్మెన్ ఇలాగే రాణిస్తే..
విండీస్కు చుక్కెదురు ఖాయం. బౌలింగ్ విభాగంలో మయాంక్, అవేశ్ ఖాన్, మహిపాల్లతో భారత్ బలంగా కనిపిస్తోంది. విండీస్ జట్టులో గిర్డన్ పోప్, శిమ్రన్ హెట్మేర్, స్ప్రింగర్లను నిలువరిస్తే టైటిల్ భారత్ వశమైనట్టే. ఆరంభంలో మెరుపు విన్యాసాలతో బౌలర్లను అదగొట్టే పోప్.. నేటి ఫైనల్లోనూ తనదైన శైలిలో ఆడే అవకాశం లేకపోలేదు. మిడిల్ ఆర్డర్లో స్ప్రింగర్, శిమ్రన్లు విండీస్కు కీలక ఆటగాళ్లు. ఐతే జోరుమీదున్న భారత బౌలర్లకు విండీస్ను కట్టడి చేయటం అంత కష్టమేమీ కాబోదు. ఫైనల్ జరిగే మీర్పూర్ పిచ్ 300 పరుగులు చేస్తే.. ఉత్తమమైన స్కోరే. టాస్కు పెద్ద ప్రాధాన్యం లేకపోయినా.. తొలుత బ్యాటింగ్ చేసిన జట్టుకు ఇక్కడ గెలుపు రికార్డు ఉండటం సైతం పరిగణనలోకి తీసుకోవాల్సిన విషయమే. 2000, 2008, 2012లలో అండర్-19 చాంపియన్గా నిలిచిన యువ భారత్.. తాజాగా దిగ్గజ క్రికెటర్ రాహుల్ ద్రావిడ్ కోచింగ్ సారథ్యంలో నాల్గో కొట్టనుందేమో చూడాలి. ఆస్ట్రేలియా, భారత్లు గరిష్టంగా అండర్- 19 ట్రోఫీని మూడేసి మార్లు దక్కించుకున్నాయి. పాకిస్తాన్ రెండు సార్లు విజేతగా నిలవగా.. ప్రస్తుత ఫైనలిస్ట్ గతంలో ఫైనల్స్కు చేరినా పాకిస్తాన్ చేతిలో ఖంగుతింది. భారత్, వెస్టిండీస్ ఫైనల్ మ్యాచ్ భారత కాలమానం ప్రకారం ఆదివారం మీర్పూలో జరుగనుంది.