Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అలవాటైన ఆచారం
- ఓటమికి కారణాలు, మూలాలు అనవసరం
- పనికిరాని చర్చలు అవసరం
'' బంగ్లాదేశ్ క్రికెట్లో ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు కాదు. వరల్ద్కప్లో క్వార్టర్ ఫైనల్ వరకు వచ్చారు. అంపైర్ నోబాల్ ఇవ్వడం వల్లే ఓడిపోయామని... లేకపోతే సెమీస్ చేరేవాళ్లం అని వాళ్లు ఎంత గోల చేసినా ఎవరూ పట్టించుకోలేదు. వారి ఆటను, నైపుణ్యాన్ని అంచనా వేయలేదు. కనీసం ఇటీవల పాకిస్తాన్ను 3-0తో క్లీన్స్వీప్ చేసినప్పుడైనా భారత బృందం ఆలోచించి సరైన విధంగా సన్నాహకాలు చేస్తే బాగుండేది. కానీ అదే టైంలో మనోళ్లు ఐపీఎల్ గోలలో బిజీగా ఉన్నారు. ఐపీఎల్ మాయలో పడి డబ్బు సంపాదనలో ముందుకెళ్లు న్న మన క్రికెటర్లు బంగ్లా సిరీస్ ను ఏమాత్రం పట్టించు కోలేదు. కేవలం పూర్తి స్థాయి జట్టును దింపిదే గెలిచేస్తాం అనుకు న్నారు. ఆ అతి విశ్వా సమే కొంపముంచింది ''
బంగ్లాదేశ్తో రెండు వన్డేల్లో భారత్ ఓడింది. దాంతోపాటు సిరీస్ కూడా పోయింది. అయితే భారత జట్టుకు ఓడడం కొత్త కాదు. సిరీస్లు కోల్పోవడం కొత్త కాదు. కానీ బంగ్లాదేశ్పై ఓడిపోవడాన్నే అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.ఇక్కడ బంగ్లాదేశ్ ఆటగాళ్లను, వారి నైపుణ్యాన్ని తక్కువ చేయడం లేదు. కేవలం భారత ఆటగాళ్ల ప్రదర్శనే ఇలా ఎందుకు తయారైందా అని సగటు అభిమాని అనుకుంటున్నాడు.
బంగ్లాదేశ్పై ఓటమినే ఎందుకు ?
భారత్ ఇంతకుముందు ఎన్నో మ్యాచుల్లో ఆస్ట్రేలియాపై ఓడింది. మరి దానినెందకు ఇప్పటిలా పట్టించుకోలేదుక ? ఆ ఓటముల గురించి ఇప్పటిలా ఎందకు చర్చించుకోవట్లేదు ? దీనికి సమాధానం.... ఆస్ట్రేలియా పెద్ద జట్టు కాబట్టి. అంటే ఆసీస్ లాంటి జట్లపై ఎన్ని మ్యాచుల్లో ఓడినా పట్టించుకోనవసరం లేదా ? 2003 ప్రపంచకప్ ఫైనల్ నుంచి మొదలు పెట్టి ఎన్నో టోర్నమెంట్లలో భారత్ ఆసీస్పై ఓడింది. ఇటీవల జరిగిన ప్రపంచకప్ సెమీ ఫైనల్లో కూడా ఓడింది. దీనిని బట్టి 120 కోట్ల జానాభా ఉన్న భారత్ ఆస్ట్రేలియాపై ఎన్నిసార్లు ఓడినా తప్పులేదా ? పట్టించుకోరా ? కనీసం ఎందకు ఓడుతున్నామని ఆలోచించరా ?
ఇప్పుడు బంగ్లాదేశ్పై ఓడగానే దేశమంతా దీనిపై చర్చలు, గొడవలు. అంటే బంగ్లాదేశ్పై ఓటమిని ఇంత తీవ్రంగా తీసుకున్న మాజీ క్రికెటర్లు కావచ్చు, అభిమానులు కావచ్చు ఇతర జట్లపై ఓడినప్పుడు ఇదే రకంగా స్పందిం చరెందుకని ? అంటే దీనర్ధం మొన్నటి వరకు చిన్న జట్టుగా భావించిన బంగ్లాపై ఓడిపోవడం బాధగా ఉందని. అంతేగానీ ఓటమికి అసలు కారణాలేంటి ? అని వెతికే పనిలో ఉన్నారా ? అది మనకెందుకు ? అసలు అది మన పని కాదుగా. గెలిస్తే పూలు ఓడితే రాళ్లు ఇది మన అభిమానుల పద్ధతి, ఆచారం.
ధోని బాబు ఎందుకలా మాట్లాడాడు ?
సిరీస్ పోగానే ధోని విలేకరులతో తన వన్డే కెప్టెన్సీ రాజీనామా అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అది ముందే అనుకుని మాట్లాడాడా ? లేదా సిరీస్ పోయిన బాధలో, ఉద్వేగంలో మాట్లాడాడా అనేది పక్కన పెడితే ఆయన అలా అనగానే మన మాజీ క్రికెటర్లంతా కలిసి ' నో ....నో ' అని హార్రర్ సినిమా చూసి భయంతో గట్టిగా అరిచినంత పని చేశారు. ఎందుకు నో ? 'ప్రస్తుత పరిస్థితుల్లో కెప్టెన్సీ నుంచి తప్పుకోవద్దు. 2016లో జరిగే టి20 ప్రపంచకప్ వరకు కొనసాగాలి' ఇలా అందరిదీ ఒకే మాట. ఇలా గత రెండు రోజుల నుంచి ధోని చుట్టే విషయం తిరుగుతోంది కానీ మనవాళ్లు బంగ్లాలో బంగ్లాతో ఎందుకు ఆడలేదు. ఎందుకు ఆడలేకపోతున్నారు ? అని ఎవరైనా ఆలోచించారా. ప్రశ్నించారా.
ధోని విలేకరులతో మాట్లాడుతూ ఇదంతా నావల్లే అయితే కెప్టెన్గా తప్పుకుని ఆటగాడిగా కొనసాగుతానన్నాడు. కానీ అసలు ధోని జట్టులో ఉన్నాడు అంటే కారణం కేవలం కెప్టెన్సీ వల్లే కదా ? ఇది అతడికి తెలియదా ? కెప్టెన్సీ లేకపోతే జట్టులో అతడు బ్యాట్స్మెన్గా కొనసాగే అవకాశాలు దాదాపు లేనట్లే. ఎందుకంటే వరల్డ్కప్తో పాటు ఇటీవల ముగిసిన ఐపీఎల్లో కూడా పెద్దగా రాణించింది లేదు. ఇతర ఆటగాళ్ల వల్ల చెన్నై సూపర్ కింగ్స్ విజయాలు సాధించింది కానీ ధోని బ్యాటింగ్ వల్ల ఏమాత్రం కాదు. ఏమైనా కూడా కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలా వద్దా అనేది బంగ్లాతో మూడో వన్డే ముగిసిన తర్వాత అతడే ఆలోచించుకోవాలి. అంతేకాకుండా ధోని వన్డే కెప్టెన్సీ నుంచి తప్పుకోవాలంటూ బిసిసిఐ నుంచి కూడా ఎటువంటి ఒత్తిడి పెంచే సాహసం చేయకపోవచ్చు.
మనోళ్లు ఎందుకు ఆడట్లేదు ?
అదే పిచ్...బంగ్లా ఆటగాళ్లు రెచ్చిపోతున్నారు. బౌలర్లు నిప్పులు చెరుగుతుంటే బ్యాట్స్మెన్ విచ్చలవిడిగా షాట్లు కొడుతున్నారు. వరల్డ్ నెంబర్ 2 జట్టుతో ఆడుతున్నామని ఏమాత్రం తనుకూ బెణుకూ లేకుండా ఆడుకుంటున్నారు. అరెరె ...ఇలా జరక్కూడదే ? ఇది సగటు అభిమాని ప్రశ్న. ఎందుకు జరక్కూడదు. మనది గొప్ప బౌలింగ్, అద్భుతమైన బౌలర్లు అని మనం అనుకుంటే సరిపోతుందా ? అవతలి వాళ్లు కూడా అనుకోవాలిగా ? మరి అలా అనుకోవాలంటే దానికి తగ్గట్లు బంతులు విసరాలిగా. అలా జరగనప్పుడు బంగ్లా బ్యాట్స్మెన్ ఇలా ఇష్టారీతిగ షాట్లు కొట్టరా మరి. తొలి వన్డేల్లో చితక్కొట్టినా రెండో వన్డేలో అయినా మనోళ్లు సరైన ప్రాంతంలో బంతులు విసిరారా అంటే అదీ లేదు. భువనేశ్వర్ కుమార్లో మునుపటి వాడి లేదు. కెరీర్ ప్రారంభంలో ఓపెనర్లను ఔట్ చేయడంలో ముందుంటే అతడు ఇప్పుడు...ఇప్పుడిప్పుడే బౌలింగ్ నేర్చుకుంటున్నట్లు వేస్తున్నాడు. ధోని ఇతనికి బౌలింగ్ ఎందుకిచ్చాడ్రా బాబూ ! అని అనుకునే స్థితికొచ్చాడు. ఇక మిగిలిన బౌలర్ల గురించి ఈ మాత్రం చెప్పుకోవడానికి కూడా ఏం లేదు. వరుసగా విఫలమవుతున్న జడేజా జట్టులో ఎందుకు కొనసాగుతున్నాడో అందరికీ తెలిసిందే. ధోని ఉన్నంత వరకు జడేజా స్థానానికి ఢోకా లేదు. దీనిపై ఇంక మాటలు అనవసరం.
అదే పిచ్ .....బంగ్లా బ్యాట్స్మెన్ ఎందుకు అవలీలగా బ్యాటింగ్ చేస్తున్నారంటే మన బౌలింగ్ బాగా లేదు కాబట్టి అనుకుందాం. మరి బ్యాటింగ్ ఎందుకు చేయట్లేదు. రోహిత్, విరాట్, రైనా, ధోని, ధావన్ లాంటి ప్రపంచస్థాయి బ్యాట్స్మెన్ ఉన్న భారత లైనప్ పేకమేడలా కూలిపోతుంది. ఎందుకని. కనీసం ఏ ఇద్దరు కూడా నిలకడగా ఆడుతూ మంచి భాగస్వామ్యాలు నెలకొల్పట్లేదు. మొదటి ఆరు వికెట్లు పడిపోతే చివరి నాలుగు ఎంతసేపు. బ్యాట్స్మెనే ఆడనపుడు బౌలర్లను ఏమంటాం. ఏమనలేం. అవును... ఇటీవల ఆల్రౌండర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడని ఐసిసి ప్రకటించింది. మరి దీనికి సమాధానం ఆయనే చెప్పాలి. ఈయన ఆల్రౌండర్ అయితే మరి షేన్ వాట్సన్, బెన స్టోక్స్, షకీబ్ ఉబ్ హసన్, దిల్షాన్లను ఏమంటారు.
ఇది ఈనాటి ఆచారం కాదు !
సగం సిరీస్ అయిన తర్వాత లేదా సిరీస్ కోల్పోయిన తర్వాత లేదా ఐదు టెస్టులుంటే మొదటి రెండు ఓడిన తర్వాత కళ్లు తెరవడమనే ఆచారం, పద్ధతి ఈనాటిది కాదు. గత గంగూలీ హయాం నుంచి నిరంతరంగా కొనసాగుతున్నదే. మొన్న వరల్డ్ కప్ ముందు ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్లో కూడా ఇదే జరిగింది. అప్పుడు కూడా ధోని బాబు తెలివిగా ఇక నా వల్ల కాదంటూ టెస్టుల నుంచి తప్పుకుని ఇంకో అంశాన్ని తెరపైకి తీసుకొచ్చాడు. అంతే అసలు టెస్టు సిరీస్లో ఎన్ని గెలిచాం. ఎందుకు ఓడాం. ఎందుకు అంత ఉదాసీనత ? సిరీస్ పోయిన తర్వాత కళ్లు తెరిచి ఒక వన్డేలో లేదా ఒక టెస్టులో రెచ్చిపోయి ఆడతారు. అందులో గెలవగానే ఇక భారత పత్రికలన్నీ మొదటి పేజీలోకి ఎక్కిస్తాయి. ఆ ఫొటోలను చూసుకుంటూ సగటు భారత అభిమానులు భారత దేశానికి స్వాతంత్య్రం వచ్చినప్పుడు కూడా పడనంత సంబరపడతారు. ఓడినవి దేవుడికి నైవేద్యం అనుకోవాలా ? పోనీ మరి అప్పుడు మాజీ క్రికెటర్లు లోపాల్ని వెతికి సరిచేయగల సలహాలు ఇస్తారా అంటే అదీ లేదు.