Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆసీస్తో భారత్ విజయంపై వీవీఎస్ జోష్యం
- కంగారూ బౌలింగ్ బలహీనమైంది
- భారత్ బలంగా కనిపిస్తోంది
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఈ ఏడాది ఆరంభంలో టెస్టు సిరీస్ కోసం కంగారూలు భారత్కు వచ్చినప్పుడు ఆట కంటే ఎక్కువగా ఆటేతర అంశాలే పతాక శీర్షికలయ్యాయి. ఇరు వైపుల నుంచి స్వయంగా కెప్టెన్లే కాకుండా క్రికెట్ బోర్డులు సైతం మాటల యుద్ధంలో పోటీపడ్డాయి. దీంతో ఒక్కసారిగా మైదానం లోపలే కాదు బయటా ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ప్రెస్ కాన్ఫరెన్స్ రూమ్లోని మాటల వేడి, మైదానంలో ఆటలోనూ ప్రతిబింబించింది. స్వల్ప విరామంలోనే స్మిత్సేన మరోసారు భారత్ గడ్డపైకి వచ్చింది. ఈసారి పరిమిత ఓవర్ల ఫార్మాట్ పోరాటానికి సిద్ధమైంది. అయితే, పరిమిత ఓవర్ల ఫార్మాట్ మాదిరిగానే మాటల యుద్ధంలోనూ పరిమితులు పాటిస్తారా? లేకా సహజశైలిలో రెచ్చిపోతారా అనేది కాలమే నిర్ణయించాలి. ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య క్రికెట్లో సంప్రదాయ వైరం లేదు. కానీ వరల్డ్ క్రికెట్లో భారత్, ఆస్ట్రేలియాలు అగ్రశ్రేణి జట్లు. దీంతో ఈ రెండు జట్ల మధ్య పోరాటం ఇప్పుడు వరల్డ్ క్రికెట్లో హాట్ టాపిక్. కెప్టెన్సీలోనే కాదు పరుగుల పోటీలోనూ కోహ్లితో స్మిత్ పోటీపడుతుండగా, ఓవరాల్గా జట్ల పరిస్థితీ ఇందుకు భిన్నంగా ఏమీ లేదు. దీంతో ఆస్ట్రేలియా, భారత్ మధ్య పరిమిత ఓవర్ల పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ నేపథ్యంలో భారత క్రికెట్ దిగ్గజం వీవీఎస్ లక్ష్మణ్, ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ మైకల్ క్లార్క్లు న్యూఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ సిరీస్పై ప్రత్యేక చర్చాగోష్టిలో అభిప్రాయాలు పంచుకున్నారు. బ్యాట్తో, బంతితో బలంగా కనిపిస్తోన్న టీమ్ ఇండియా 4-1తో వన్డే సిరీస్ సాధించటం ఖాయమని హైదరాబాదీ సొగసరి బ్యాట్స్మన్ లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు.
4-1తో గెలుస్తారు
4-1తో సిరీస్ భారత్ వశమవటం ఖాయం. ఎందుకంటే, ఆస్ట్రేలియా బౌలింగ్ విభాగం ఎంతో బలహీనంగా కనిపిస్తోంది. 2013లో ఆసీస్ వన్డే సిరీస్కు వచ్చినప్పుడు పోటీ కఠినంగా సాగింది. ఇప్పుడు బౌలింగ్ బృందం ఆ స్థాయిలో లేదు. మిచెల్ స్టార్క్, హెజిల్వుడ్లు లేకపోవటంతో బౌలింగ్ దాడి బలహీనమైంది. కౌల్టర్నైల్కు ఐపీఎల్ ఆడిన అనుభవం ఉన్నా, స్పిన్నర్లలో అనుభవజ్ఞులే లేరు. ఇదే సమయంలో టీమ్ ఇండియా బ్యాటింగ్ ఆర్డర్కు తోడు బౌలింగ్ విభాగం బలంగా ఉంది. ఇక్కడే కోహ్లిసేన పైచేయి సాధిస్తోంది.
మణికట్టు మాయగాళ్ల కోసమే..
సీనియర్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలకు విశ్రాంతి పేరిటి వరుసగా రెండు సిరీస్లకు దూరం పెట్టడంపై అందరూ మాట్లాడుతున్నారు. నాకు తెలిసి సెలక్టర్లతో అశ్విన్, జడేజాలకు స్పష్టమైన సమాచారం ఉందని భావిస్తున్నాను. తొలుత బలహీన శ్రీలంకపై యువ స్పిన్నర్లకు అవకాశమిచ్చారు. ఇప్పుడు బలమైన బ్యాటింగ్ లైనప్ కలిగిన ఆస్ట్రేలియాపైనా వారిని పరీక్షించాలనుకుంటున్నారు. మణికట్టు స్పిన్నర్లను పరీక్షించాలనుకోవటం సెలక్టర్ల వ్యూహం కాబోలు. ఇదే విషయం అశ్విన్, జడేజాలతో చెప్పి ఉంటారు. చాంపియన్స్ ట్రోఫీ ఓటమి లేవనెత్తిన ప్రధాన లోపం.. మిడిల్ ఓవర్లలో వికెట్లు కూల్చగల వారు లేకపోవటం. అక్షర్ పటేల్, యుజ్వెందర్ చాహాల్లు బంతిని బాగా తిప్పుతున్నారు. వారికి అవకాశం ఇవ్వటంలో తప్పేమి లేదు.
రహానెతో అదనపు బలం
అజింక్య రహానె జట్టులో ఓ నాయకుడు. ధర్మశాల టెస్టులో అజింక్య అద్భుతంగా సారథ్యం వహించాడు. టెస్టు జట్టులో రహానె రెగ్యులర్ ఆటగాడే అయినా వన్డే, టీ20ల్లో అతడి స్థానంపై అనిశ్చితి నెలకొన్నది. శిఖర్ ధావన్, రోహిత్ శర్మలు మంచి ఫామ్లో ఉన్నారు. కుడి, ఎడమల కాంబినేషన్. దీంతో వీరిద్దరిని తప్పించటం కష్టం. కానీ రహానె ఎప్పుడూ జట్టు వ్యూహంలో భాగమే. అతడిని ఎక్కడైనా ఉపయోగించుకోవచ్చు. రహానె వంటి ఆటగాడు జట్టుకు అదనపు బలం చేకూర్చుతాడని నా నమ్మకం. యువరాజ్ సింగ్కు సెలక్టర్లు విశ్రాంతి ఇవ్వటంలో తప్పేముంది?. మనీశ పాండే, కేదార్ జాదవ్, లోకేశ్ రాహుల్లకు అవకాశాలు ఇస్తున్నారు. యువరాజ్ మ్యాచ్ విన్నర్. పునరాగమనంలోనూ యువీ ఆకట్టుకున్నాడు. క్లిష్ట పరిస్థితుల్లో అతడి ఏం చేయగలడో అందరికీ తెలుసు. కానీ యువ ఆటగాళ్ల ఏం చేస్తారో సెలక్టర్లు చూడాలనుకుంటున్నారు.
ఆసీస్తో ఆడితేనే మజా
ప్రపంచ క్రికెట్లో ఆస్ట్రేలియా, భారత్ మధ్య పోరు నెం.1 పోరాటం. ఈ రెండు జట్ల మధ్య క్రికెట్ వైరం గొప్పగా ఉంటుంది. నా కెరీర్ సాంతం ఎప్పుడెప్పుడు ఆడతానా అని ఎదురుచూసిన ప్రత్యర్థి ఆస్ట్రేలియా. ఎందుకంటే వారితో ఆట ఆడే విధానం అలాంటిది. తాజా రికార్డులే చూస్తే, స్వదేశంలో న్యూజిలాండ్, ఇంగ్లాండ్, బంగ్లాదేశ్ సహా ఆస్ట్రేలియాలతో టీమ్ ఇండియా టెస్టుల్లో తలపడింది. వీటన్నింటిలోకెల్లా ఆసీస్తో టెస్టు సమరమే అత్యంత పోటీగా సాగింది.ప్రతి పరుగు కోసం, ప్రతి వికెట్ కోసం ఆటగాళ్లు పరితపించారు. భారత్, ఆస్ట్రేలియాలు ఎప్పుడు తలపడినా ఆ ఉత్కంఠ స్థాయి వేరు. తాజా సిరీస్ అందుకు భిన్నం కాదు.
కోహ్లియే ఉత్తమ సారథి
విరాట్ కోహ్లి, స్టీవ్ స్మిత్లు సారథ్యంలో ఆరంభ దశలో ఉన్నారు. కానీ కోహ్లియే ఉత్తమ సారథి అని చెప్పగలను. కానీ టెస్టు సిరీస్లో స్మిత్ను చూశాక, అతడు అంత దూకుడు కాదని అనిపించింది. కొన్ని బౌలింగ్ మార్పులు నిజానికి బాగా లేవు. కానీ కోహ్లి ప్రతి మ్యాచ్ నుంచీ కొంత నేర్చుకుంటున్నాడు. జట్టులో ఆల్టైమ్ దిగ్గజ కెప్టెన్ ఎం.ఎస్ ధోని ఉండటం కోహ్లికి ఉన్న గొప్ప సానుకూలత. ఓ కెప్టెన్గా అందుబాటులో ఉన్న యువ ఆటగాళ్లను ఉపయోగించుకున్న తీరు ఆకట్టుకున్నది. ముఖ్యంగా శ్రీలంకపై యువ స్పిన్నర్లను ప్రభావంతంగా వినియోగించుకున్నాడు. జట్టును ముందుండి నడిపించే నాయకత్వ పటిమే, కోహ్లిని గొప్ప సారథిగా నిలబెడుతుంది.
విరాట్ కోహ్లి కెప్టెన్గా ఆరంభ దశలోనే ఉన్నాడు. ప్రతి మ్యాచ్లోనూ ఎంతో కొంత సారథ్య పాఠాలు నేర్చుకుంటున్నాడు. ఆల్టైమ్ గ్రేట్ వన్డే కెప్టెన్ మహేంద్రసింగ్ ధోని అతడి జట్టులో ఉండటం విరాట్కు ఉన్న గొప్ప సానుకూలత. జట్టును ముందుండి నడిపించే లక్షణమే కోహ్లిని గొప్ప నాయకుడిగా తీర్చిదిద్దుతోంది'
- వీవీఎస్ లక్ష్మణ్, భారత దిగ్గజ ఆటగాడు
స్టీవ్ స్మిత్ మంచి టెస్టు బ్యాట్స్మన్. కానీ వన్డేల్లో కెప్టెన్సీ గురించి చెప్పాలంటే టీమ్ ఇండియా సారథి విరాట్ కోహ్లియే స్మిత్తో పోల్చితే అత్యుత్తమ నాయకుడు. రానున్న రోజుల్లో అందరూ కోహ్లి, స్మిత్ గురించే చర్చిస్తారు. కానీ ఫైనల్గా కోహ్లి, స్మిత్లు ఎన్ని పరుగులు చేసినా విజయం వరించేది జట్టునే. నాయకుడిగా నీ జట్టును గెలిపించటమే నీ బాధ్యత'
- మైకల్ క్లార్క్, ఆసీస్ మాజీ కెప్టెన్