Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రీ క్వార్టర్స్లో జిందాపాల్పై అలవోక విజయం
- క్వార్టర్స్కు చేరిన సమీర్ వర్మ
- ముగిసిన కశ్యప్, సాయిప్రణీత్ కథ
సియోల్ (దక్షిణ కొరియా)
రియో ఒలింపిక్స్ సిల్వర్ మెడలిస్ట్, ప్రపంచ అగ్రశ్రేణి షట్లర్ పి.వి సింధు మరో సూపర్ సిరీస్ టైటిల్ దిశగా అడుగులు వేస్తోంది. వరుసగా రెండో రౌండ్లో సునాయాస విజయం నమోదు చేసిన తెలుగు తేజం కొరియా ఓపెన్లో క్వార్టర్ఫైనల్లోకి ప్రవేశించింది. థారులాండ్ క్రీడాకారిణి నిచనొన్ జిందాపాల్పై వరుస గేముల్లో గెలుపొందిన సింధు.. క్వార్టర్స్లో కాలుమోపింది. 22-20, 21-17తో జిందాపాల్ను ఓడించిన సింధు ఆమెతో ముఖాముఖి రికార్డును 2-1కు మెరుగుపర్చు కున్నది. సెమీఫైనల్స్ బెర్త్ కోసం నేడు జరిగే క్వార్టర్స్ పోరులో జపాన్ స్టార్ షట్లర్ మినట్సు మిటానితో సింధు తలపడనున్నది. పురుషుల సింగిల్స్ విభాగంలో వర్థమాన షట్లర్ సమీర్ వర్మ క్వార్టర్స్లోకి చేరుకున్నాడు. స్ఫూర్తిదాయక విజయం నమోదు చేసిన సమీర్.. మెన్స్ సింగిల్స్ సర్క్యూట్లో భారత్ ఆశలను సజీవంగా నిలిపాడు. సింగపూర్ సూపర్ సిరీస్ విజేత బి. సాయిప్రణీత్ సహా సీనియర్ ఆటగాడు పారుపల్లి కశ్యప్లు ప్రీ క్వార్టర్స్ నుంచే నిష్క్రమించారు. రెండో రౌండ్లో గట్టిగా పోరాడినా సాయిప్రణీత్, కశ్యప్లు క్వార్టర్స్కు చేరుకోలేకపోయారు. పురుషుల డబుల్స్ విభాగంలో సాత్విక్ సాయి రెడ్డి, చిరాగ్ శెట్టి జోడీ 23-21, 16-21, 21-8తో చైనీస్ తైపీ జంటపై మెరుపు సాధించి క్వార్టర్స్లో అడుగుపెట్టింది.
మహిళల సింగిల్స్లో టైటిల్ ఫేవరేట్, వరల్డ్ చాంపియన్షిప్స్ సిల్వర్ మెడలిస్ట్ పి.వి సింధు వరుసగా రెండో మ్యాచ్లోనూ సునాయాస విజయం నమోదు చేసింది. 22-20, 21-17తో జిందాపాల్పై 42 నిమిషాల్లోనే గెలుపొందింది. కానీ జిందాపాల్ తీవ్రంగా ప్రతిఘటించింది. సింధుకు గట్టి పోటీనిచ్చింది. తొలి గేమ్లో 2-2 నుంచి మొదలైన పోటీ 20-20 వరకూ నువ్వా నేనా అన్నట్టు సాగింది. 20-16తో సింధు గేమ్ పాయింట్ వద్ద నిలువగా, ఈ సమయంలో జిందాపాల్ గొప్ప పోరాట పటిమ కనబర్చింది. వరుస పాయింట్లతో 20-20తో టైబ్రేకర్కు తీసుకెళ్లింది. ఆలస్యంగానైనా తేరుకున్న సింధు వరుస పాయింట్లతో తొలి గేమ్ను సొంతం చేసుకున్నది. ఇక రెండో గేమ్నూ 3-3, 4-4, 5-5, 7-7తో మ్యాచ్ రసవత్తరంగా మొదలైంది. విరామ సమయానికి 11-9తో సింధు ముందంజలో నిలిచింది. ద్వితియార్థంలో 15-12తో ఆధిక్యం కొనసాగించినా.. జిందాపాల్ 15-15తో స్కోరు సమం చేసింది. ఈ సారీ ప్రత్యర్థికి ఎలాంటి ఇవ్వని సింధు 18-15, 21-17తో రెండో గేమ్ను, మ్యాచ్ను సొంతం చేసుకున్నది. 42 నిమిషాల ఆటలో జిందాపాల్ ఆకట్టుకునే ప్రదర్శనతో సింధుకు గట్టి పోటీనిచ్చింది. కానీ సింధు ఏ దశలోనూ వెనుకంజ వేయకుండా, తనదైన శైలిలో దూసుకెళ్లింది. ఒక్కసారి కూడా జిందాపాల్కు ఆధిక్యం ఇవ్వకుండా జాగ్రత్త వహించింది. పురుషుల సింగిల్స్లో సమీర్ వర్మ 21-19, 21-13తో హాంగ్కాంగ్ ఆటగాడు వాంగ్ వింగ్ కి విన్సెంట్ను ఓడించాడు. 42 నిమిషాల పాటు సాగిన ప్రీ క్వార్టర్స్ పోరులో తొలి గేమ్లో విన్సెంట్ తగ్గ పోటీనిచ్చినా.. రెండో గేమ్ను సమీర్ వర్మ సునాయాసంగా నెగ్గాడు. నేడు జరిగే క్వార్టర్స్ సమరంలో వరల్డ్ నెం.1, కొరియా సూపర్ స్టార్ సన్ వాన్ హోతో సమీర్ వర్మ తలపడాల్సి ఉన్నది.
పురుషుల డబుల్స్లో భారత జోడీ క్వార్టర్స్లో ప్రవేశించింది. సాత్విక్సాయి రెడ్డి, చిరాగ్ శెట్టిలు ఏడో సీడ్ చైనీస్ తైపీ జంట లీ హ్యూ, లీ యాంగ్లపై 23-21, 16-21, 21-14తో మూడు గేముల మ్యాచ్లో మెరిశారు. టైబ్రేకర్లో తొలి గేమ్ నెగ్గినస సాయి, చిరాగ్ జోడీ రెండో గేమ్ను కోల్పోయింది. కానీ నిర్ణయాత్మక మూడో గేమ్లో మెరుపు ప్రదర్శనతో చైనీస్ తైపీ జోడీని చిత్తు చేసి క్వార్టర్స్కు చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో స్టార్ షట్లర్ బి. సాయిప్రణీత్ సియోల్ నుంచి నిష్క్రమించాడు. ఏడో సీడ్, చైనీస్ తైపీ ఆటగాడు వాంగ్ జు వీ చేతిలో 13-21, 24-26తో పోరాడి ఓడాడు. తొలి గేమ్లో చెత్తగా ఆడినా.. రెండో గేమ్లో ఆఖరి వరకూ పోరాడాడు. టైబ్రేకర్లో గొప్పగా ఆడినా తృటిలో ఓటమిపాలయ్యాడు. ఇక వరల్డ్ నెం.1 సన్ వాన్ హోతో జరిగిన ప్రీ క్వార్టర్స్లో పారుపల్లి కశ్యప్ పోరాడి ఓడాడు. 16-21, 21-17, 16-21తో మూడు గేముల పోరాటంలో వెనుకంజ వేశాడు. సుమారు గంటన్నర పాటు సాగిన రెండో రౌండ్ మ్యాచ్లో విజయం కోసం వరల్డ్ నెం.1 చెమటోడ్చాడు. కశ్యప్ మెరుగైన ప్రదర్శన చేసినా విజయం సాధించలేకపోయాడు.