Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలి సింగిల్స్లో రామ్కుమార్ గెలుపు
- మరో పోరులో బాంబ్రీ ఓటమి
- డెవిస్ కప్ వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రౌండ్
ఎడ్మంటన్ (కెనడా) : తొలి సింగిల్స్ పోరులో బ్రేడెన్ ష్నర్ పై గెల్చిన రామ్ కుమార్ రామనాథన్ అద్భుత ఆట తీరుతో భారత్కు ఆధిక్యాన్నివ్వగా.. మరో పోరులో డెనిస్ షపలోవ్ చేతిలో ఓడిన యుకీ బాంబ్రీ నిరాశపర్చాడు. దీంతో భారత్ కెనడాలు ప్లే ఆఫ్ బరిలో 1-1తో సమంగా నిలిచాయి.
మూడు గంటలకు పైగా సాగిన ఆటలో రామ్కుమార్ 5-7, 7(6)-6(4), 7-5, 7-5తో ష్నర్ను మట్టికరిపిం చాడు. తొలి సెట్ ఖాతాలో వేసుకున్న ష్నర్ రెండో సెట్లో సైతం గట్టిపోటీనిచ్చాడు. హోరాహోరీగా సాగిన రెండో సెట్లో ఒక గేమ్ ఆధిక్యంలో ఉన్న రామ్కుమార్ టై బ్రేకర్ సైతం నెగ్గి సెట్ స్వంతం చేసుకున్నాడు. సుధీర్ఘ ర్యాలీలతో సాగిన మూడు, నాల్గో సెట్లలో ష్నర్ పుంజుకునే ప్రయత్నం చేసినా.. రామ్కుమార్ అనుభవం ముందు చేతులెత్తేశాడు. మ్యాచ్లో 18 ఏస్లు సంధించిన రామ్కుమార్ ప్రత్యర్థి 41 అనవసర తప్పిదాలు చేసేలా చేశాడు. కాగా, ఈ సీజన్లో రామ్కుమార్కు ఇది వరుసగా ఐదో విజయం. మరో సింగిల్స్ సమరంలో బాంబ్రీ తనకన్నా మెరుగైన ర్యాంకర్ షపలోవ్ చేతిలో పోరాడి ఓడాడు. దాదాపు నాలుగు గంటలు సాగిన ఐదు సెట్ల పోరులో 6(2)-7(6), 4-6, 7(8)-6(6), 6-4, 1-6తో పరాజయం పాలయ్యాడు. తదుపరి సింగిల్స్లో 51వ ర్యాంకర్ షపలోవ్ను 154వ ర్యాంకర్ రామ్కుమార్ ఎదుర్కోనుండగా.. ఈ ఏడాదే తొలిసారిగా డెవిస్ కప్ ఆడుతున్న ష్నర్తో బాంబ్రీ తలపడనున్నాడు. ప్లే ఆఫ్ రౌండ్లో జరగనున్న ఏకైక డబుల్స్ పోరులో డబుల్స్ స్పెషలిస్టు రోహన్ బోపన్న , పూరవ్ రాజాల జోడీ పోస్పిసిల్, డానియేల్ జంటతో తలపడనున్నారు. డబుల్స్లో వరుస విజయాలతో ఊపుమీదున్న డానియేల్ (43వ ర్యాంకు)కు బోపన్న (19వ ర్యాంకు)కు మధ్య ప్రధాన పోటీ జరుగనుండగా.. సాకేత్ స్థానంలో బరిలోకి దిగిన పూరవ్ (56వ ర్యాంకు) రాణిస్తాడా అన్నదే ప్రశ్న.కుర్రాళ్లు బాగా ఆడారు. వారిపై ఒత్తిడి ఉంటోంది. ఇలాగే పోరాడితే ఏదైనా సాధ్యమే'
- కెప్టెన్ మహేశ్ భూపతి