Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 1-2తో భారత్ వెనుకంజ
- వరల్డ్ గ్రూప్ ప్లే ఆఫ్ రౌండ్
ఎడ్మంటన్ (కెనడా) : సింగిల్స్ పోరులో ఓ గెలుపు మరో ఓటమితో కెనడాతో సమంగా నిలిచిన భారత్.. ఏకైక డబుల్స్ పోరులో ఓడి 1-2తో వెనుకబడింది. డబుల్స్ స్పెషలిస్టు రోహన్ బోపన్న, పూరవ్ రాజాల జోడీ 5-7, 5-7, 7-5, 3-6తో కెనడా జంట డానియేల్ నెస్టర్, వసెక్ పోస్పిసిల్ చేతిలో ఓటమి పాలయ్యారు. రెండు గంటల 52 నిమిషాలు జరిగిన మ్యాచ్లో తొలి రెండు సెట్లు కెనడా వశం కాగా మూడో సెట్లో పుంజుకున్న భారత్ 7-5తో సెట్ వశం చేసుకున్నది. వరుస విజయాలతో జోరు మీదున్న డానియేల్ బోపన్న జోడీకి పోటీ ఇస్తాడనుకుంటే 27 ఏండ్ల పోస్పిసిల్ నుంచి బలమైన పోటీ ఎదురయ్యింది. విజృంభించాల్సిన నాల్గో సెట్లో తడబడిన భారత డబుల్స్ ఆటగాళ్లు 3-6తో ఓడి సెట్ సమర్పించుకున్నారు. 12 డబుల్స్ ఫాల్ట్స్ చేసిన భారత్ 21 అనవసర తప్పిదాలే చేసింది. దీంతో ఐదు రబ్బర్ల ప్లే ఆఫ్ రౌండ్లో కెనడా ఆధిక్యంలోకొచ్చింది. మరో రెండు సింగిల్స్ మిగిలున్నాయి. బ్రేడెన్ ష్నర్పై తొలి సింగిల్స్ పోరు నెగ్గి శుభారంభం చేసిన 154వ ర్యాంకర్ రామ్కుమార్ రామనాథన్, రెండో సింగిల్స్ విజేత డెనిస్ షపలోవ్తో అమీతుమీకి తేల్చుకోనున్నాడు.
కాగా ఇరు రౌండ్లలో ఓడిన యుకీ బాంబ్రీ (157వ ర్యాంకు), ష్నర్ (202వ ర్యాంకు)లు చివరి సింగిల్స్లో తలపడనున్నారు. వరల్డ్ గ్రూప్కు అర్హత సాధించాలంటే ప్లే ఆఫ్లో ఆధిక్యం తప్పనిసరి. దీంతో జరగనున్న రెండు సింగిల్స్లోనూ భారత్ గెలుపొందాల్సిన పరిస్థితి. అయితే, మాంట్రియల్ మాస్టర్స్లో స్పెయిన్ దిగ్గజం రఫెల్ నడాల్ను సైతం మట్టికరిపించిన కెనడా యువకెరటం షపలోవ్ను రామ్కుమార్ నిలువరిస్తాడా అనేది ప్రశ్నార్ధకంగా మారింది. మరో పక్క బాంబ్రీ ష్నర్ల పోరుపై సర్వత్రా ఆసక్తి నెలకొన్నది. జయాపజయాలను పక్కన పెడితే.. రెండో సింగిల్స్లో తన పోరాట పటిమతో అందరినీ ఆకట్టుకున్న బాంబ్రీ ఈ సారి గెలుపు సాధిస్తాడనే విశ్వాసాన్ని జట్టు కెప్టెన్ మహేశ్ భూపతి వ్యక్తం చేశాడు.