Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టెస్టు చాంపియన్షిప్, వన్డే లీగ్లకు ఐసీసీ ఆమోదం
- 2019 నుంచే టెస్టు చాంపియన్షిప్
- 13 దేశాలతో వన్డే లీగ్ ఆరంభం
దుబాయ్ : అంతర్జాతీయ క్రికెట్ పోటీలో సరికొత్త మలుపు. ద్వైపాక్షిక పోరాటాలకు నిజమైన నిర్వచనం. ఇప్పటివరకూ ఉన్న ద్వైపాక్షిక సిరీస్ల స్థానంలోనే ఐసీసీ కొత్త పోటీని తీసుకొచ్చింది. నిర్దేశిత కాలంలో అన్ని దేశాలు ముఖాముఖి తలపడే విధంగా కొత్త పోటీని రూపొందించారు. కొన్నేండ్లుగా ప్రతిపాదనల దశలోనే ఉన్న టెస్టు చాంపియన్షిప్, వన్డే లీగ్లకు ఐసీసీ ఆమోద ముద్ర వేసింది. ఈ మేరకు ఐసీసీ ఓ ప్రకటన విడుదల చేసింది. టాప్ తొమ్మిది దేశాలతో తొలి దశలో ఐసీసీ చాంపియన్షిప్స్ నిర్వహించనుండగా, 13 దేశాలతో వన్డే లీగ్ ఆడించనున్నారు. మహిళల క్రికెట్లో ఇప్పటికే వరల్డ్ చాంపియన్షిప్స్ కొనసాగుతుండగా, పురుషుల క్రికెట్లో ఇది 2020-21 సీజన్ నుంచి ఆచరణలోకి రానున్నది. 2019 వన్డే వరల్డ్కప్ సంబురం ముగిసీ ముగియగానే టెస్టు చాంపియన్షిప్ పట్టాలెక్కనున్నది. టెస్టు చాంపియన్షిప్, వన్డే లీగ్లకు సంబంధించి పూర్తి వివరాలు, పాయింట్ల కేటాయింపు సహా సవివరణ షెడ్యూల్పై ఐసీసీ మరింత కసరత్తు చేయాల్సి ఉన్నది. వన్డే ప్రపంచకప్కు అర్హత సాధించాలంటే వన్డే లీగ్లో మెరుగైన ప్రదర్శన చేయాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఐసీసీ రానున్న రోజుల్లో దీనిపై పూర్తి కసరత్తు చేసి, విధివిధానాలు ఖరారు చేయనున్నది. ప్రపంచ క్రికెట్లో అర్థవంతమైన పోటీకి అంగీకరించినందుకు సభ్య దేశాలకు, ఐసీసీ సభ్యులకు ఐసీసీ చైర్మెన్ శశాంక్ మనోహార్ కృతజ్ఞతలు తెలిపారు.
ఆరు సిరీస్లు, రెండేసీ మ్యాచులు : 2019 ప్రపంచకప్ ముగియగానే టెస్టు చాంపియన్షిప్ ఆరంభం కానున్నది. టాప్-9 జట్లు తొలి సీజన్లో భాగం కానున్నాయి. దీనిలో భాగంగా ప్రతి జట్టు ఆరు సిరీస్ల్లో ఆడాల్సి ఉంటుంది. మూడు సిరీస్లు సొంతగడ్డపై, మిగతా మూడు ప్రత్యర్థి సొంతగడ్డపై ఆడాలి. ప్రతి సిరీస్లో కనీసం రెండు టెస్టు మ్యాచులుండాలి. వీటిని అవసరమైతే యాషెస్ తరహాలో ఐదు మ్యాచులకు పొడగించుకోవచ్చు. నాల్గు రోజుల టెస్టులపై చర్చ నడిచినా, ఐదు రోజుల మ్యాచ్ వైపే ఐసీసీ మొగ్గుచూపింది. తొలి దశ పోటీలు ముగిసిన తర్వాత అగ్రస్థానంలో నిలిచిన రెండు జట్లు టెస్టు చాంపియన్షిప్ కోసం తలపడతాయి. కొత్తగా టెస్టు ఫార్మాట్లోకి అడుగుపెడుతున్న దేశాల కోసం డివిజన్ 2 స్థాయిలో నాల్గు రోజుల మ్యాచ్లను ఐసీసీ ప్రవేశపెట్టనున్నది.
ప్రపంచకప్కు అదే అర్హత : ప్రస్తుతం ప్రపంచకప్కు అర్హత సాధించాలంటే ఐసీసీ ర్యాంకింగ్స్లో మెరుగ్గా ఉంటే సరిపోతుంది. కానీ ఐసీసీ వన్డే క్రికెట్ లీగ్ వచ్చిన తర్వాత ఇందులో ప్రదర్శనను గీటురాయిగా తీసుకుని ప్రపంచకప్కు అర్హత నిర్ణయిస్తారు. మొత్తం 12 జట్లు వన్డే లీగ్లో ఆడనున్నాయి. ప్రతి జట్టు ఇంటా, బయటా ప్రాతిపదికన ఎనిమిది సిరీస్ల్లో పాల్గొనాలి. వీటిలో నాల్గు సిరీస్లు సొంతగడ్డపై ఆడాల్సి ఉంటుంది. ప్రపంచకప్లో ముందుగా నిర్ణయించిన 12 జట్లతో పాటు ఐసీసీ క్రికెట్ లీగ్ చాంపియన్షిప్ విజేత తోడవుతుంది. 2023 ప్రపంచకప్కు వన్డే లీగ్లో ప్రదర్శన ద్వారానే అన్ని జట్లు అర్హత సాధించాల్సి ఉంటుంది.