Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తడి పిచ్ కారణంగా ఉప్పల్ టీ20 రద్దు
- 1-1తో సిరీస్ను పంచుకున్న భారత్, ఆసీస్
అభిమానులు ఆశించినట్టే వరుణుడు స్టేడియం వైపు రాలేదు. దీంతో మ్యాచ్ సాగుతుందనే భావించాం. కానీ గత కొన్ని రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి తడిసిన మైదానం.. ఆటకు అనుకూలంగా లేదు. దీంతో సిరీస్ నిర్ణయాక టీ20 సమరం అనూహ్య రీతిలో రద్దు అయ్యింది. ఉదయం నుంచి ఎండకాస్తున్నా మైదానాన్ని ఆటకు సిద్ధం చేయలేని హెచ్సీఏ అసమర్థత ఉత్కంఠ సిరీస్ చెత్త ముగింపునకు కారణమైంది!.
నవతెలంగాణ క్రీడా ప్రతినిధి-హైదరాబాద్
ఎడతెరపి లేకుండా వరుసగా మూడు గంటల జడివాన కురిసినా, అర గంటలో మైదానాన్ని ఆటకు సిద్ధం చేయగల ఆధునిక సాంకేతికత అందుబాటులోకి వచ్చిన కాలంలోనూ... రోజంతా వర్షం పడకున్నా పిచ్ను ఆటకు సిద్ధం చేయలేకపోయింది హెచ్సీఏ. ఉత్కంఠకు దారితీసిన ఆస్ట్రేలియా, భారత్ మధ్య టీ20 సిరీస్ నిర్ణయాక పోరు అనుకోని రీతిలో రద్దు అయ్యింది. ఒక్క బంతీ పడకుండానే, కనీసం టాస్ కాయిన్ ఎగరవేయకుండానే ఉప్పల్ పోరుకు తెరపడింది. మూడు మ్యాచుల టీ20 సిరీస్లో రాంచీలో టీమ్ ఇండియా నెగ్గగా, గౌహతిలో ఆస్ట్రేలియా విజయం సాధించింది. సిరీస్లో భారత్, ఆస్ట్రేలియాలు 1-1లో సమవుజ్జీగా నిలిచాయి. దీంతో పొట్టి కప్పును ఇరు జట్లు పంచుకున్నాయి. ఈ ఏడాది ఆరంభంలో కోహ్లిసేన చేతిలో టెస్టు సిరీస్ను, ఇప్పుడు వన్డే సిరీస్ను కోల్పోయిన కంగారూలు.. తడి పిచ్ పుణ్యమా అంటూ తాజాగా పొట్టి కప్పునైనా పంచుకోగలిగారు!.
హైడ్రామా నడిపి..! : నిజానికి శుక్రవారం సాయంత్రం భారీ వర్ష సూచన ఉన్న విషయం తెలిసిందే. అయినప్పటికీ వరుణుడు రాకపోవటంతో.. షెడ్యూల్ ప్రకారం మ్యాచ్ సవ్యంగానే సాగుతుందని అనిపించింది. యధావిధిగా స్టేడియానికి చేరుకున్న భారత్, ఆస్ట్రేలియాలు ప్రాక్టీస్లో నిమగమయ్యాయి. భారత ఆటగాళ్లు సాకర్ ఆడుతూ సరదాగా కనిపించగా, కంగారూలు రెగ్యులర్ డ్రిల్స్తో ప్రాక్టీస్ చేశారు. ఈ సమయంలో 6.30 గంటలకు ఎగరాల్సిన టాస్ కాయిన్ ఎగురలేదు. టాస్ ఆలస్యమైందని, మరో అర గంటలో అంపైర్లు పిచ్ను పరిశీలిస్తారనే వెలువడింది. ఈ సమయంలో బౌండరీ లైన్ దగ్గర పలు చోట్ల తడిగా ఉన్న చోట ఇసుకతో నింపేశారు. ఫీల్డింగ్ సమయంలో జారిపడకుండా ఉండేందుకు వీలుగా చదును చేశారు. ఏడు గంటలకు మైదానంలోకి అడుగుపెట్టిన అంపైర్లు... తడిగా ఉండి ఇసుకతో కప్పి ఉంచిన చోట పరిశీలించారు. థర్డ్ అంపైర్తో కలిసి ఫీల్డ్ అంపైర్లు సుదీర్ఘంగా చర్చించారు. ఇరు జట్ల కెప్టెన్లు విరాట్ కోహ్లి, డెవిడ్ వార్నర్లతో అంపైర్లు కాసేపు చర్చించారు. సాధారణంగా పిచ్ ఆటకు అనుకూలంగా లేకపోతే, ఆట కొనసాగించాలా? వద్దా ? అనే విషయంపై కెప్టెన్లతో చర్చిస్తారు. అంపైర్లతో కెప్టెన్ల భేటీ ముగిసిన వెన్వెంటనే మైదానంలో ప్రాక్టీస్లో బిజీగా ఉన్న ఆటగాళ్లు ఒక్కొక్కరుగా డ్రెస్సింగ్రూమ్కు చేరుకున్నారు. ఈ సమ యంలో 7.45 నిమిషాలకు మరోసారి తనిఖీ ఉంటుందని స్టేడి యంలోని బిగ్ స్క్రీన్పై కనిపించింది. కానీ అంతకముందే భారత్, ఆస్ట్రేలియా జట్ల బస్సులు స్టేడియం నుంచి బస చేస్తున్న హౌట ల్స్కుత వెళ్లిపోయాయి. 8 గంటల తర్వాత తడి పిచ్ కారణంగా మ్యాచ్ను రద్దు చేస్టున్నట్టు అధికారిక ప్రకటన వెలువడింది.
లోపం ఎక్కడీ : చిన్న చినుకైనా పడలేదు. అందునా ఉదయం నుంచి సూర్యుడు తన ప్రతాపం చూపించాడు. అయినప్పటికీ ఉప్పల్ స్టేడియం సిబ్బంది మైదానాన్ని ఆటకు సిద్ధం చేయలేకపోయారు. దీంతో అభిమానుల్లో తీవ్రమైన అసహనం వ్యక్తమైంది. ఔట్ ఫీల్డ్ తడగా ఉందని మ్యాచ్ను రద్దు చేయటంతో అందరూ ఒకింత ఆశ్చర్యానికి గురయ్యారు. బుధ, గురువారాల్లోనూ వర్షం కురిసినా, మైదానాన్ని పూర్తిగా కవర్లతో కప్పి ఉంచారు. తడిగా ఉన్న చోట్ల ఫ్యాన్లు పెట్టి మరీ ఆరబెట్టారు!. అయినప్పటికీ పిచ్ విపరీతంగా తడవటం గమనార్హం. ఎన్నో మ్యాచులకు మైదానాన్ని సిద్ధం చేసిన అనుభవం ఉన్న క్యూరేటర్, సిబ్బంది హెచ్సీఏ సొంతం. పిచ్ ఆటకు అనుకూలంగా ఉందా లేదా విషయం వారికి తెలియదనుకోవటం అమాయకత్వమే. తడిగా ఉన్న ప్రదేశాల్లో ఉదయమే ఇసుకతో చదును చేసి ఉంచితే, పరిస్థితిలో గణనీయమైన మార్పు ఉండేదే. కానీ క్యూరేటర్ అండ్ కో ఆ పని చేయలేదు. తీరా మ్యాచ్ సమయం ముంచుకొచ్చేసరికి మైదాన సిబ్బంది నష్ట నివారణ పనులు మొదలెట్టారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. 35 వేల మందితో కిక్కిరిసిన ఉప్పల్ స్టేడియం.. తడి పిచ్ నిర్వాహకంతో నిరాశగా వెనుదిరిగింది. గతంలో కోల్కతలో ఓ టీ20 మ్యాచ్కు మైదానాన్ని సిద్దం చేయలేకపోటంతో అది కాస్త రద్దు అయ్యింది. ఈ ఘటనపై ఆగ్రహించిన క్యాబ్ అధ్యక్షుడు గంగూలీ సీనియర్ క్యూరేటర్ ప్రబీర్ ముఖర్జీపై వేటు వేశాడు. హైదరాబాద్లో ఉదయం నుంచీ వర్షం లేకున్నా, ఉప్పల్లో మ్యాచ్ రద్దు అయ్యింది. మరి హెచ్చ్సీఏ అధికారులు ఈ విషయంపై ఏ విధంగా స్పందిస్తారనేది ఆసక్తికరం.
పైసలు వాపస్
అనూహ్య రీతిలో ఉప్పల్ టీ20 రద్దు అయ్యింది. మ్యాచ్ రద్దు కావటంతో టికెట్లు కొనుగోలు చేసిన వారికి డబ్బు వెనక్కి ఇవ్వనున్నట్టు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్సీఏ) ప్రకటించింది. త్వరలోనే పైసలు వెనక్కి ఇచ్చే తేదిని ప్రకటించనున్నారు. సంబంధిత తేదిల్లో అభిమానులు తమ టికెట్లు చూపించి, డబ్బు వెనక్కి తీసుకోవాల్సి ఉంటుంది.