Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆర్థిక సాయంలో వర్థమాన అథ్లెట్లకు నిరాశే
- స్టార్ క్రీడాకారులకే మళ్లీ ఆర్థిక దన్ను
- నీరుగారుతున్న టాప్ పథకం లక్ష్యం
భారత్లో సానపట్టని వజ్రాలకు కొదవ లేదు. సరైన శిక్షణ, అవసరమైన ఆర్థిక సహకారం అందితే మన క్రీడాకారులను కొట్టే వారు ఉండరు!. గ్రామీణ స్థాయి నుంచే ప్రతిభావంతులైన క్రీడాకారులను గుర్తించి, ప్రపంచ స్థాయిలో పోటీపడగల్గేందుకు వీలుగా ఆర్థిక ప్రోత్సాహం ఇవ్వాల్సిన గురుతర బాధ్యత ప్రభుత్వాలపై ఉన్నది. వర్థమాన అథ్లెట్లకు మేలు చేసేందుకు ప్రవేశపెట్టిన టాప్ పథకం అప్పుడే నీరుగారుతోంది. అథ్లెట్లకు స్కాలర్షిప్ పేరిటి మళ్లీ స్టార్ క్రీడాకారులకే నెలకు రూ. 50 వేలు ఇచ్చేందుకు కేంద్ర క్రీడాశాఖ సిద్ధమైంది. తెలంగాణ సహా ఇతర రాష్ట్రాల్లోని వర్థమాన క్రీడాకారులకు టాప్ ప్రోత్సాహక పథకంలో చోటు దక్కలేదు.
క్రీడా ప్రతినిధి- హైదరాబాద్
70 ఏండ్ల స్వతంత్ర భారతావనికి తొలిసారి ఓ ఒలింపియన్ క్రీడా మంత్రిగా వచ్చారు. క్రీడాకారుడిగా ఎన్నో కష్టనష్టాలను ఎదుర్కొన్న వ్యక్తే ఉన్నత స్థానంలో కొలువుదీరే సరికి, క్రీడా వ్యవస్థలో మార్పునకు సమయం వచ్చిందనే ఆశించారు. అందుకు తగినట్టుగానే రాజ్యవర్దన్ సింగ్ రాథోర్ టాప్ పథకంలో భాగంగా అథ్లెట్లకు నెలకు రూ. 50 వేలు ఆర్థిక సహకారం అందిస్తామని ప్రకటించారు. ఒలింపిక్ టాస్క్ఫోర్స్ సూచించిన సిఫారసుల్లో ఆర్థిక సహకారం కీలక సూచన. రాథోర్ రాగానే దాన్ని పట్టాలెక్కించటంతో కనీసం క్రీడా శాఖకైనా మంచి రోజులు వచ్చాయని భావించిన వారికి అంతలోనే చుక్కెదురు. గతంలో టాప్ పథకం కింద ఒలింపిక్స్లో పతకాలు తీసుకొస్తారనే ఆశలు ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వం రూ. కోట్లలో ఆర్థిక అండ అందించింది. ఇప్పుడు అదే పథకం స్థానంలో రాథోర్ రూ. 50 వేలు ఇస్తామంటూ ముందుకొచ్చాడు. అంటే, టాప్లో భాగంగా అంతర్జాతీయ శిక్షణ, నాణ్యమైన సమతుల ఆహారం, ఆధునాతన సౌకర్యాల కోసం అందిన సహకారం నిలిపివేసి, ఏడాదికి రూ. 6 లక్షలతో సరిపుచ్చేం దుకు రంగం సిద్ధం చేశారు. తొలుత టాప్ పథకంలో కొందరికే చోటు ఇచ్చారు. కానీ తాజాగా నెలకు రూ. 50 వేలు కావటంతో ఆర్థిక అవసరాలు అధికంగా ఉండే వర్థమాన అథ్లెట్లకు చోటు దక్కుతుందని అనుకున్నా, ఆచరణలో కేంద్ర ప్రభుత్వం అసలు ఉద్దేశం చెప్పకనే చెప్పింది. పేరు ఏదైనా, సాయం ఎంతైనా పేరు పొందిన క్రీడాకారులకే కానీ ఎదుగుతున్న అథ్లెట్ల కోసం కాదని చేతల్లో నిరూపించింది.
ప్రతిభావంతులకు ఏదీ చోటు?
టాప్ ఎలైట్ అథ్లెట్ గుర్తింపు కమిటీ అక్టోబర్ 1న సమావేశమై సుమారు 152 మందితో కూడిన క్రీడాకారులను జాబితాను ఖరారు చేసింది. 152 మందికి క్రీడా శాఖ నెలకు రూ. 50 వేలు సహకారం అందించనున్నారు. అయితే, జాబితాను ఒకసారి పరిశీలిస్తే అందులోని వారందరూ స్టార్ క్రీడాకారులకే. కొందరిని మినహాయిస్తే దాదాపుగా చాలామంది ఇప్పటికే స్పాన్సర్స్ రూపంలో రూ. కోట్లలో ఆదాయం పొందుతున్న వారే ఉండటం గమనార్హం. తెలుగు రాష్ట్రాల నుంచే తీసుకుంటే పి.వి సింధు, సానియా మీర్జా, కిదాంబి శ్రీకాంత్, బి. సాయిప్రణీత్ సహా యుకీ బాంబ్రిలు ఉన్నారు. తెలంగాణ నుంచి బ్యాడ్మింటన్ డబుల్స్ క్రీడాకారిణి సిక్కి రెడ్డి, జిమ్నాస్టిక్స్ అథ్లెట్ అరుణ బోదాన్ రెడ్డిలు ఉన్నారు. స్టార్ క్రీడాకారులకు ఆర్థిక సహకారం ఇవ్వటంలో ఎవరికీ అభ్యంతరాలు లేవు. కానీ ఆర్థిక అవసరాలకు కోసం ఎదురుచూస్తున్న ప్రతిభావం తులైన అథ్లెట్లను విస్మరించటంతోనే సమస్య ఉత్పన్నమవుతోంది. తెలంగాణ నుంచి 15 మందితో కూడిన ప్రతిభావంతులైన అథ్లెట్ల జాబితాను సాట్స్ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ తెలంగాణ స్టేట్) చైర్మెన్ అల్లీపురం వెంకటేశ్వర్రెడ్డి ఇటీవల కేంద్ర క్రీడాశాఖకు పంపించారు. కానీ అక్కడి నుంచి సమాధానమే కరువైంది.