Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- నేడు న్యూజిలాండ్తో తొలి వార్మప్
ముంబయి: న్యూజిలాండ్తో వన్డే సిరీస్కు జాతీయ జట్టు నుంచి ఉద్వాసనకు గురైన ఓపెనర్/మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ లోకేశ్ రాహుల్ ఫామ్లోకి వచ్చేందుకు మరో అవకాశం దక్కింది. శ్రీలంక సిరీస్లో విఫలమైన లోకేశ్ రాహుల్కు ఆస్ట్రేలియా సిరీస్లో ఒక్కసారీ తుది జట్టులో ఆడే చాన్స్ చిక్కలేదు. అయినా, అతడిని జట్టు నుంచి తొలగించటం విమర్శలకు దారితీసింది. న్యూజిలాండ్తో రెండు వార్మప్లకు గాను ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్లో లోకేశ్ రాహుల్కు చోటిచ్చారు. నేడు తొలి వార్మప్ మ్యాచ్ జరుగనున్నది. రాహుల్తో పాటు స్పిన్నర్ కరణ్ శర్మను సైతం జట్టులోకి ఎంపిక చేశారు. రాహుల్ను అదనపు ఆటగాడిగా తీసుకోగా, గాయపడిన రాజస్థాన్ స్పిన్నర్ రాహుల్ చాహార్ స్థానంలో కరణ్ శర్మ వచ్చాడు. నేడు ఉదయం 9 గంటలకు కివీస్తో ప్రాక్టీస్ మ్యాచ్ ముంబయిలోని బ్రబౌర్న్ స్టేడియంలో ఆరంభం కానున్నది. ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్ జట్టుకు ముంబయి బ్యాట్స్మన్ శ్రేయాష్ అయ్యర్ సారథ్యం వహిస్తున్నాడు. కరుణ్ నాయర్, రిషబ్ పంత్, పృథ్వీ షా, గుర్కీరత్ మన్, ధవల్ కులకర్ణి, జయదేవ్ ఉనద్కత్లు కీలక ఆటగాళ్లు.