Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- న్యూజిలాండ్ సారథి విలియమ్సన్
నవతెలంగాణ-ముంబయి
నిరుడు భారత పర్యటనలో వన్డే సిరీస్ను 2-3తో కోల్పోయిన న్యూజిలాండ్, మరోసారి పరిమిత ఓవర్ల పోటీకి ఉపఖండానికి వచ్చింది. అయితే, ఈసారి కివీస్ జట్టులోని సగం మంది ఆటగాళ్లు ఓ నెల ముందుగానే భారత్లో అడుగుపెట్టారు. భారత్-ఎతో వన్డే సిరీస్తో ఇక్కడి పిచ్లపై అనుభవం గడించే ప్రయత్నం చేశారు. భారత పర్యటన ఎప్పటిలాగానే సవాల్తో కూడుకున్నదని, పరిస్థితులకు త్వరగా అలవాటు పడటంతో పాటు సరళమైన దృక్పథంతో ముందుకెళ్లటం ముఖ్యమని న్యూజిలాండ్ కెప్టెన్ కానె విలియమ్సన్ అంటున్నాడు. నేడు ఇండియన్ బోర్డు ప్రెసిడెంట్ ఎలెవన్తో తొలి వార్మప్ మ్యాచ్ సందర్బంగా విలియమ్సన్ మాట్లాడాడు. 'భారత్లో వికెట్లకు ఒకదానితో మరోదానికి పొంతన ఉండదు. అందుకే భారత్కు వస్తున్నామనగానే, విభిన్న పరిస్థితులకు అలవడే విధంగా సన్నద్ధమై ఉండాలి. ఏ రెండు పిచ్లు ఒకేలా ఉంటాయని ఇక్కడ ఆశించలేం. సహజంగానే ఉపఖండంలో స్పిన్ది ప్రధాన భూమిక. ఇక్కడికొస్తే నాణ్యమైన స్పిన్ ఎదుర్కొనే అవకాశం ఉంటుంది. గత పర్యటనలో 250 చేసినా, గెలుపు స్కోరే అనేది చూశాం. అదే వ్యూహంతో ముందుకెళ్తాం. గతంలో ఇన్నింగ్స్ మధ్యలో మంచు ప్రభావం ఉండేది. దానితో పాటే లెక్కకుమించి సమీకరణాలు! ఏ ఫార్మాట్ అయినా భారత్లో ఆడాలంటే కాస్త ముందుగానే రావాలి. వాతావరణానికి అలవాటు చేసుకోవాలి. లేదంటే అధిక ఉష్ణోగ్రతలు, ఉక్కపోతతో ఇబ్బంది పడాల్సిందే. జట్టులోని ఆరుగురు ఏ జట్టుతో సిరీస్ నిమిత్తం ఇక్కడికొచ్చి అనుభవం గడించటం మంచి విషయం' అని విలియమ్సన్ అన్నాడు. టీమ్ ఇండియా మణికట్టు మాయాగాడు, చైనామన్ కుల్దీప్యాదవ్ బ్రహ్మపదార్థమేమీ కాదని కివీస్ కోచ్ సెలవిచ్చాడు. ' ఐపీఎల్లో చాలా మంది కివీస్ ఆటగాళ్లు కుల్దీప్ను ఎదుర్కొన్నారు. అతడి ప్రాంఛైజీలోని (కోల్కత) ప్లేయర్స్ సైతం అతడి బౌలింగ్ గురించి తెలుసు. కాబట్టి కుల్దీప్ను మిస్టరీ స్పిన్నర్గా మేం చూడటం లేదు. అయితే, అతడిని ఎదుర్కొనే విధానంలో ఒక్కొక్కరిది ఒక్కో విధమైన తీరు. ఓ బ్యాట్స్మన్ మణికట్టును గమనిస్తే, మరో ఆటగాడు గాల్లో బంతిని చూస్తాడు, మరోకరు పిచ్ పరిస్థితులను బట్టి అంచనా వేస్తాడు. కానీ అంతిమంగా ఎదుర్కొవటంలో ఇబ్బందేమీ లేదు' అని అన్నాడు. కివీస్ కిందటేడాది ఇక్కడికొచ్చినప్పుడు 15 వికెట్లతో అమిత్ మిశ్రా భారత్ విజయంలో కీలక భూమిక పోషించాడు. ఇప్పుడు అదే విధంగా కుల్దీప్, యుజ్వెంద్రలు ప్రభావం చూపగలరని అంచనా. ఇదే సమయంలో కివీస్ శిబిరంలోని స్పిన్నర్ మిచెల్ శాంట్నర్ సైతం భారత్ను ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు!.