Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హైకోర్టు తీర్పుపై శ్రీశాంత్ సంచలన వ్యాఖ్యలు
కోచి : కేరళ స్పీడ్స్టర్, టీమ్ ఇండియా మాజీ ఆటగాడు ఎస్. శ్రీశాంత్ మంగళవారం సంచలన వ్యాఖ్యలు చేశాడు. 2013 ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కుంభకోణంలో ప్రమేయం ఉండటంతో బీసీసీఐ అతడిపై జీవితకాల నిషేధం విధించింది. కానీ నిరుడు ఢిల్లీ ప్రత్యేక న్యాయస్థానం శ్రీశాంత్ను నిర్దోషిగా ప్రకటించింది. దీంతో బీసీసీఐ తనపై నిషేధం ఎత్తివేయాలని శ్రీశాంత్ కేరళ హైకోర్టును ఆశ్రయించగా ఈ ఏడాది జూన్లో నిషేధంపై స్టే విధిస్తున్నట్టు సింగిల్ బెంచ్ ధర్మాసనం తీర్పు వెలువరించింది. కానీ ఇందుకు ప్రతిగా బీసీసీఐ కోర్టుకు సవివరమైన నివేదిక అందజేసింది. క్రిమినల్ నేరం కింద శ్రీశాంత్ నిర్దోషి కావొచ్చు కానీ బీసీసీఐ క్రమశిక్షణ చర్యల ప్రకారం అతడిపై నిషేధం వేశామని సీఈవో రాహుల్ జోహ్రీ కోర్టుకు తెలిపాడు. దీనిపై విచారించిన డివిజన్ బెంచ్ బీసీసీఐ నిషేధం ప్రకారం అన్ని రకాల క్రికెట్ పోటీలకు శ్రీశాంత్ దూరంగా ఉండాలని ఆదేశించింది. కేరళ హైకోర్టు తీర్పుపై శ్రీశాంత్ ట్వీట్టర్లో తీవ్రంగా స్పందించాడు. ' ఇది అత్యంత చెత్త నిర్ణయం. నాకొక్కడికే ప్రత్యేక నిబంధనలా? నిజమైన నేరస్థుల సంగతేంది? చెన్నై సూపర్ కింగ్స్, రాజస్థాన్ రాయల్స్ జట్ల సంగతి ఏంది? లోధా కమిటీ నివేదికలో పేర్కొన్న 13 మంది క్రికెటర్ల పేర్లు తెలుసుకోవడానికి ప్రయత్నించరా? న్యాయం కోసం నా పోరాటం ఆగదు' అని ట్వీటాడు.