Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రతి సిరీస్ ముఖ్యమైనదే
- వైస్ కెప్టెన్ రహానె
నవతెలంగాణ-కోల్కత
శ్రీలంకను వారి గడ్డపై అన్ని ఫార్మాట్లలోనూ క్లీన్స్వీప్ చేసినా, ఇటీవల వారిపై ఎదురులేని విజయాలు నమోదు చేసినా, సొంతగడ్డపై లంకేయులకు ఒక్క టెస్టు కూడా కోల్పోని ఘనమైన రికార్డు మనవైపున్నా.. చండిమాల్ సేనను తేలిగ్గా తీసుకోబోమని టీమ్ ఇండియా వైస్ కెప్టెన్ అజింక్య రహానె అన్నాడు. మంగళవారం ప్రాక్టీస్ సెషన్ సందర్భంగా మీడియతో మాట్లాడిన రహానె.. టెస్టుల్లో అగ్రస్థానం మరింత సుస్థిరం చేసుకునే దిశగా మా ఫోకస్ ఉంటుందని తెలిపాడు. ' తాజా సిరీస్ శ్రీలంకలో ఆడిన సిరీస్తో పోల్చితే పూర్తిగా భిన్నమైనది. శ్రీలంకను మేం తేలిగ్గా తీసుకోవటం లేదు. ప్రస్తుతం మేం వరల్డ్ నెం.1గా కొనసాగాలంటే, ప్రతి సిరీస్ ముఖ్యమైనదే. ప్రతి మ్యాచ్, ప్రతి సిరీస్ నెగ్గాలనే అనుకుంటున్నామని' రహానె పేర్కొన్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ కీలకమైనదే. కానీ ఇప్పుడు దాని గురించి ఆలోచన లేదు. ప్రస్తుతం మా దృష్టి శ్రీలంకపై, కోల్కత టెస్టుపైనే ఉన్నది. ఈడెన్ పరిస్థితులు మాకు బాగా తెలుసు. మా బలాబలాలపైనే ఆలోచన, ప్రత్యర్థి శిబిరం కాంబినేషన్ గురించి పట్టించుకోమని రహానె అన్నాడు. ప్రొఫెషనల్ క్రికెటర్లుగా పరిస్థితులకు, ఫార్మాట్కు అలవాటు పడటం తప్పనిసరి. జట్టులో ఇలాంటి సమస్య లేదు. తొలి టెస్టులోనే జోరందుకుంటాం. నెట్స్లో వినూత్న షాట్ల సాధన సాధారణమే. ప్రతి రోజు కొత్త అంశం నేర్చుకోవాల్సిందే. నెట్స్లో ఐదారు సార్లు ఓ షాట్ ఆడి, బాగా ఉందని అనిపిస్తేనే మ్యాచ్లో ప్రయోగిస్తాను. నెట్స్లో వంద శాతం సాధన చేయాలనేది నా అభిమతం. రంజీ సీజన్లో చేసిన పరుగులు (45, 49) పెద్ద విషయం కాదు. టెస్టు సిరీస్కు ముందు లభించిన మ్యాచ్ ప్రాక్టీస్ కీలకం. వరుసగా నాల్గు అర్ధ సెంచరీలు సాధించానని అజింక్య అన్నాడు. బిజీ షెడ్యూల్ నేపథ్యంలో ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యకు విశ్రాంతి ఇవ్వటం సరైనదని రహానె అభిప్రాయపడ్డాడు. పిచ్పై స్పందిస్తూ ' ఆట ఆరంభమయ్యే వరకూ ఆగాలి. ఇంకా సమయం ఉంది. నేను ఇంకా పిచ్ ఎలా ఉందో చూడలేదు. ఆసక్తిగా ఎదురుచూడాల్సిందే' అని చెప్పాడు.