Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్టార్ స్పిన్నర్లలో ఎవరో ఒకరికే అవకాశం?
- శ్రీలంకతో కోహ్లిసేన టెస్టు సమరం
- తుది జట్టులో అశ్విన్, జడేజా మధ్య పోటీ
అమ్ములపొదిలో ఇద్దరు అగ్రశ్రేణి స్పిన్నర్లు. ప్రపంచ ర్యాంకింగ్స్లోనూ వరుసగా 2, 4వ స్థానాలు వారివి. అయితేనేం, తుది జట్టులో ఎవరో ఒకరినే ఆడించాల్సిన పరిస్థితి?. ఇలాంటి స్థితిలో కెప్టెన్ కోహ్లి ఏ నిర్ణయం తీసుకుంటాడనే ఆసక్తి నెలకొన్నది. స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాలు దక్షిణాఫ్రికా సిరీస్కు ముందే తుది జట్టులో చోటు కోసం పోటీ పడాల్సి రావటం అనూహ్యం.
ఉపఖండంలో ముగ్గురేసి మాయగాళ్లతో బరిలోకి దిగే టీమ్ ఇండియా.. వ్యూహాత్మకమో, కాకతాళీయమో గానీ ఈడెన్లో ఒక్క స్పిన్నర్తోనే ఆడే అవకాశం కనిపిస్తోంది!.
* శ్రీనివాస్ దాస్ మంతటి
చూస్తుంటే, కోహ్లిసేన కొత్తదనానికి పిచ్చెక్కించేలా కనిపిస్తోంది!. ఉపఖండంలో క్రికెట్ అనగానే, క్రికెట్ ఎరిగిన వారెవరికైనా ఠక్కున స్ఫురించేది బంతిని గిర్రున తిప్పే మాయగాళ్లే. విదేశాల్లో వేగవంతమైన పిచ్లపై టన్నుల కొద్ది పరుగులు చేసిన బ్యాట్స్మన్ అయినా, ఉపఖండానికి వచ్చేసరికి పరుగుల వేటలో తికమక పడాల్సిందే. ఉవ్వెత్తున్న దూసుకొచ్చిన బంతిని అవలీలగా ఎదుర్కొన్న ఆటగాళ్లు సైతం తిరిగే బంతిని చూసే సరికి తలలు పట్టుకోవాల్సిందే. ప్రపంచ శ్రేణి స్పిన్నర్ల కార్ఖానా టీమ్ ఇండియా.. ఆ పేరును అలాగే కొనసాగిస్తూ వస్తోంది. భారత్లో టెస్టు క్రికెట్ అనగానే తుది జట్టులో కనీసం ముగ్గురు స్పిన్నర్లు ఉండాల్సిందే. ఇక్కడ వికెట్ల వేటలో పేసర్లది సహాయక పాత్రనే. సింహభాగం పని పూర్తి చేసేది స్పిన్నర్లే. ఈ విషయంలో ముందున్న స్పిన్నర్ల జోరును మరో స్థాయికి తీసుకెళ్లిన స్పిన్ ద్వయం రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా. టీమ్ ఇండియా స్వదేశీ టెస్టు సీజన్లో మూడు, నాల్గు రోజుల్లోనే మ్యాచుల్ని ముగించేయ డానికి ప్రధాన కారణం సైతం ఈ స్పిన్ ద్వయమే. వన్డేల్లోకి వచ్చేసరికి ప్రాధమ్యాలు మారిపోయినా, టెస్టు క్రికెట్లో వీరిద్దరు లేకుండా టీమ్ ఇండియా బరిలోకి దిగటం సాహాసమే అయ్యేది!. కానీ ఆ పని చేయడానికి పూనుకుంటు న్నాడు కుర్ర కెప్టెన్ కోహ్లి. 2018 జనవరిలో దక్షిణాఫ్రికా పర్యటనను గమనంలో ఉంచుకుని, స్వదేశంలోనే పేసర్లతో మ్యాచులు గెలిచే సంప్రదాయానికి తెరదీయాలని సంకల్పిస్తున్నాడు. సహజంగానే విదేశీ గడ్డపై టెస్టులాడు తున్న వేళ ఇద్దరు స్పిన్నర్లలో ఎవరిని తుది జట్టులోకి తీసుకోవాలనే మీమాంస కెప్టెన్కు కలిగేది. కానీ విచిత్రంగా స్వదేశీ టెస్టులో ఇద్దరు స్పిన్నర్లలో ఎవరితో బరిలోకి దిగాలనే కొత్త సందిగ్దత విరాట్ కోహ్లి ముందుంది. సఫారీ సిరీస్ లక్ష్యంలో భాగంగా సింగిల్ స్పిన్నర్తో ఆడి కోహ్లి కొత్త చరిత్ర సృష్టిస్తాడా? లేక స్వదేశీ వాసన ఉట్టిపడేలా ఇద్దరు స్పిన్నర్లతో ఆడతాడా అనేది ఆసక్తికరంగా మారింది.
కూర్పు ఎలా ఉండనున్నదో?
కెప్టెన్ కోహ్లి నాయకత్వంలో విదేశీ, స్వదేశీ అనే తేడా లేకుండా బౌలింగ్ కూర్పుపై ఓ స్పష్టత కొనసాగిస్తున్నాడు. ఏడో బ్యాట్స్మన్తో ఆడే ధోని ఫార్ములాను పక్కనపెట్టి ఐదుగురు బౌలర్ల మంత్రాన్ని ముందుకు తీసుకొచ్చాడు. విదేశాల్లో అయితే ముగ్గురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లు లేదా స్వదేశంలో అయితే ఇద్దరు పేసర్లు, ముగ్గురు స్పిన్నర్లతో ఆడాడు. పేస్ ఆల్రౌండర్తో ఆడితే ఇద్దరేసి స్పిన్నర్లు, సీమర్లతో బరిలోకి దిగాడు. కానీ ఈడెన్ గార్డెన్స్లో నాణ్యమైన పేస్ ఆల్రౌండర్ హార్దిక్ పాండ్య అందుబాటులో లేడు. దీంతో కచ్చితంగా ముగ్గురు స్పెషలిస్ట్ సీమర్లతోనే ఆడాల్సి ఉంటుంది. భువనేశ్వర్ కుమార్ ఇక్కడ గతంలో మెరుగైన రికార్డు కల్గి ఉన్నాడు. టెస్టుల్లో ప్రధాన బౌలర్లు ఇషాంత్ శర్మ, మహ్మద్ షమి, ఉమేశ్ యాదవ్లను కాదని భువికి అవకాశం ఇస్తారా అనేది ప్రశ్నార్థకం. ఇక ఇద్దరు ప్రధాన స్పిన్నర్లలో ప్రస్తుతం ఎంతో కొంత ఫామ్లో ఉన్నది అశ్విన్ ఒక్కడే!. విదేశీ పర్యటన నేపథ్యంలో ఇంగ్లీష్ కౌంటీ క్రికెట్లో ఆడొచ్చిన అశ్విన్ అక్కడ మూడు మ్యాచుల్లో 20 వికెట్లు కూల్చాడు. బ్యాట్తోనూ ఆకట్టుకోదగిన పరుగులు నమోదు చేశాడు. తాజా రంజీ సీజన్లో ముంబయిపై మూడు, త్రిపురపై 2, ఆంధ్రాపై 6 వికెట్లు కూల్చాడు. మరో వైపు రవీంద్ర జడేజా నాల్గు రంజీ మ్యాచుల్లో కలిపి పది వికెట్లే తీయగలిగాడు. అశ్విన్తో పాటే బ్యాట్తో, బంతితో రాణించగల జడేజా.. అదనంగా పాదరసంలా కదులుతూ మెరుపు వేగంతో ఫీల్డింగ్ చేయగలడు. విదేశీ టెస్టు మ్యాచ్ అయితే, పిచ్ స్వభావం, ప్రత్యర్థి శిబిరంలో కుడి, ఎడమల కాంబినేషన్ వంటి అంశాలను పరిగణనలోకి తీసుకుని ఇద్దరు స్పిన్నర్లలో ఒకరిని ఎంచుకునే వారు. కానీ ఇప్పుడు స్వదేశంలోనే ఆ పరిస్థితి తలెత్తనున్నది. ఈడెన్ గార్డెన్స్లో కోహ్లిసేన నెట్స్లో సాధన చేస్తున్న తీరు, బ్యాట్ంగ్, బౌలింగ్లలో చూపిస్తున్న భిన్నత్వం కచ్చితంగా దక్షిణాఫ్రికా కోసమే అని తెలుస్తోంది. ఇటీవల వరుసగా శ్రీలంకపై ఎదురులేని క్లీన్స్వీప్ విజయాలు సాధించిన టీమ్ ఇండియా.. ఇప్పుడు లంకేయులతో టెస్టు సవాల్ను సఫారీ టూర్కు సన్నాహకంగా భావిస్తోందని తెలుస్తోంది. అదే నిజమైతే, కోహ్లి కచ్చితంగా ఒకే ఒక్క స్పిన్నర్తో ఆడక తప్పదేమో!.