Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మరో క్లీన్స్వీప్పై భారత్ గురి
- తొలి విజయం వేటలో శ్రీలంక
- నేటి నుంచే ఈడెన్లో తొలి టెస్టు
ప్రియ ప్రత్యర్థి శ్రీలంక ఎన్నోమార్లు భారత్కు వచ్చింది, వెళ్లింది. కానీ, 17 టెస్టుల్లో ఎన్నడూ విజయానికి నోచుకోలేదు. టీమ్ ఇండియా ఆ అవకాశం లంకేయులకు ఇవ్వలేదు. రణతుంగ, ఆటపట్టు, జయసూర్య, సంగక్కర, జయవర్ధనె, మురళీధరన్ (వేర్వేరు సిరీస్ల్లో) వంటి దిగ్గజ ఆటగాళ్లు ఇక్కడ పోరాడినా ప్రయోజనం దక్కలేదు.
తొమ్మిదేండ్ల విరామం తర్వాత మళ్లీ భారత్ గడ్డపై అడుగుపెట్టిన లంకేయులు ఈ సారి కనీసం విజయాన్ని ఊహించే సాహాసం చేయటమూ ఆశ్చర్యమే!. ఎందుకంటే ఇప్పుడు దిగ్గజ ఆటగాళ్లు లేరు, నాణ్యమైన బ్యాట్స్మెన్ కరువు, పస లేని బౌలింగ్లతో శ్రీలంక నాసిరకమైన టెస్టు జట్టుగా మారింది!. ఇదే సమయంలో టీమ్ ఇండియా అత్యున్నత ప్రమాణాలతో కూడిన క్రికెట్ ఆడుతూ, వరల్డ్ నెం.1గా ఎదిగింది. శ్రీలంకపై వరుసగా క్లీన్స్వీప్ విజయాలతో జోరుమీదున్నది.
సూపర్ ఫామ్లో ఉన్న కోహ్లిసేన మరో క్లీన్స్వీప్ విజయంపై కన్నేసి ఈడెన్లో సిరీస్ తొలి టెస్టుకు సిద్ధమవుతున్న వేళ, టీమ్ ఇండియాకు లంకేయులు పోటీనివ్వగలరా?!.
నవతెలంగాణ-కోల్కత
2009లో శ్రీలంక చివరగా భారత పర్యటనకు వచ్చింది. సచిన్ టెండూల్కర్ 20 ఏండ్ల క్రికెట్ కెరీర్ సంబురాల్లో ఉన్న క్రికెట్ ఇండియా.. అసలు లంకేయులు వచ్చిన విషయాన్నే గుర్తించలేదు. అప్పుడు కూడా ఇప్పటి మాదిరిగానే నవంబర్ 16, 24, డిసెంబర్ 2లలో టెస్టులు జరిగాయి. 2-0తో సిరీస్ టీమ్ ఇండియా సొంతమైంది. తొమ్మిదేండ్ల విరామం తర్వాత లంకేయులు మళ్లీ భారత్కొచ్చారు. ఈసారి అగ్రజట్టుగా భారత్ సఫారీ పర్యటన సన్నద్ధంలో నిమగమైంది. ఇప్పుడు కూడా లంకే యుల గురించి మనోళ్లు పెద్దగా పట్టించుకోనట్టే!. కొడితే, క్లీన్స్వీప్ విజయమే అన్నట్టు సాగుతున్న కోహ్లిసేన ఈసారి గెలుపు తేడాను 3-0కు తీసుకెళ్ల టం లాంఛనప్రాయమే. మ్యాచ్ విన్నర్లతో కూడిన జట్టుతో టీమ్ ఇండియా కొండంత ఆత్మవిశ్వాసంతో ఈడెన్ పోరుకు సిద్ధమవుతుండగా, పాక్పై 2-0 విజయం ఇచ్చిన ప్రేరణతో లంకేయులూ గెలుపు గురించి ఆలోచన చేయగల్గుతున్నారు. ఏకపక్ష పోరాటంగా భావిస్తున్న ఈడెన్ గార్డెన్స్ తొలి టెస్టు నేటి నుంచే ఆరంభం కానున్నది.
టెస్టు ఆటగాళ్లకు పరీక్షే! : దక్షిణాఫ్రికా సిరీస్ నేపథ్యంలో ఇద్దరు స్టార్ స్పిన్నర్లు అశ్విన్, జడేజాల ప్రదర్శన కీలకం కానున్నది. ఆగష్టులో శ్రీలంకలో మెరిసిన సీనియర్ స్పిన్నర్లు మళ్లీ ఈడెన్లోనే ఆడనున్నారు. టెస్టుల్లో భారత్ మ్యాచ్ విన్నర్లు స్పిన్నర్లే అయినా, ఈడెన్లో వీరి ప్రదర్శనపై సెలక్టర్లు ఓ కన్నేయనున్నారు. అదనపు బ్యాట్స్మన్తో ఆడే అవకాశం ఉండటంతో జడేజా, అశ్విన్లలో ఒకరికే తుది జట్టులో చోటు దక్కనున్నది!. గాయం నుంచి కోలుకుని జట్టులోకి వచ్చిన మురళీ విజరు పరిస్థితీ ఇంతే. శ్రీలంక పర్యటనలో కెఎల్ రాహుల్, శిఖర్ ధావన్ అద్భుతంగా ఆడారు. తాజా ప్రదర్శనను పక్కనపెట్టి వీరికి తుది జట్టులో చోటు ఇవ్వకపోతే అది అన్యాయమే అవుతుంది. మురళీ విజరు బ్యాటింగ్ శైలి సఫారీ పరిస్థితులకు అనుకూలం. అయినా, ఈడెన్లో అతడికి తుది జట్టులో చోటుపై ఉత్కంఠ నెలకొన్నది. అదనపు బ్యాట్స్మన్గా ఆడనున్న రోహిత్కు ఇక్కడ మంచి రికార్డుంది. వన్డేల్లో 264 పరుగుల వరల్డ్ రికార్డు ఇన్నింగ్స్ ఇక్కడే నమోదు చేశాడు. కివీస్తో గత టెస్టులోనూ కీలక 82 పరుగులు చేసి విజయంలో ముఖ్య భూమిక వహించాడు. బ్యాటింగ్ ఆర్డర్లో విరాట్ కోహ్లి, చటేశ్వర్ పుజారా, అజింక్య రహానెలు సూపర్ ఫామ్లో ఉన్నారు. వీరిని అవుట్ చేయటం లంక బౌలర్లకు తలకుమించినన భారమే అవనున్నది. బౌలింగ్ విభాగంలో భువి, షమి, ఉమేశ్ పేస్ బాధ్యతలు చూసుకోనున్నారు. ఇషాంత్ శర్మకు ఈడెన్లో అవకాశం లేనట్టే.
పోటీనిచ్చినా గొప్పే : భారత్ చేతిలో దారుణ పరాభవం అనంతరం లంకేయులు యు.ఏ.ఈలో పాక్ను ఓడించారు. టెస్టు సిరీస్లో 2-0తో విజయాన్ని అందుకున్నారు. సీనియర్ ఆల్రౌండర్, మాజీ కెప్టెన్ ఎంజెలో మాథ్యూస్ లేకున్నా యువ చండిమాల్ సేన అద్భుతం చేసింది. కానీ ఇప్పుడు మాథ్యూస్ వచ్చాడు. అతడికి తోడు స్పిన్నర్ రంగన హెరాత్ ఉన్నాడు. దీంతో గత సిరీస్ పరాభవానికి దీటుగా బదులిచ్చేందుకు శ్రీలంక సిద్దమైంది. భారత బౌలింగ్ దాడికి సరితూగే బ్యాట్స్మెన్ లంకలో లేరు. కానీ పాకిస్థాన్ బౌలర్లను ఎదుర్కొన్న ధైర్యంతోనే కోహ్లిసేనతోనూ పోరాడాలని ఆ జట్టు భావిస్తోంది. బంతితోనూ మన బ్యాటింగ్ ఆర్డర్ను నిలువరించగల సామర్థ్యం లంకేయులకు లేదు. కానీ పాకిస్థాన్పై విజయంతో విలువైన ఆత్మవిశ్వాసం సంపాదించిన చండిమాల్ బృందం.. ఈడెన్లో కఠోరంగా ప్రాక్టీస్ చేసింది. కోహ్లిసేనకు అలవోకగా విజయాన్ని ఇవ్వకూడదనే సంకల్పం వారిలో కనిపిస్తోంది. మరి, అసలు పోరులో లంకేయులు గట్టిగా పోరాడుతారో? తేలిపోతారో చూడాలి.
ఈడెన్కు వర్ష సూచన
ఈడెన్ టెస్టుకు తొలి రెండు రోజులు వర్షం ముప్పు పొంచి ఉన్నది. బంగాళఖాతంలో ఏర్పడిన అల్పపీడన ద్రోణి ఫలితంగా కోల్కతలో ఓ మోస్తరు లేదా భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సమాచారం. తొలి రెండు రోజులు వరుణుడు అడ్డు తగిలినా, తర్వాతి మూడు రోజులు ఎలాంటి వర్ష సూచన లేదు. ఇక 2016 నుంచి ఈడెన్ పేస్ బౌలింగ్కు అనుకూలిస్తోంది. తాజా వాతావరణ పరిస్థితులు సైతం సీమర్లకే అనుకూలం.
తుది జట్లు (అంచనా)
భారత్ : కెఎల్ రాహుల్/మురళీ విజరు, శిఖర్ ధావన్, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, రోహిత్ శర్మ, వృద్దిమాన్ సాహా, అశ్విన్/జడేజా, భువనేశ్వర్ కుమార్, మహ్మద్ షమి, ఇషాంత్ శర్మ.
శ్రీలంక : దిముత్ కరుణరత్నె, సదీర సమరవిక్రమ, ధనంజయ డిసిల్వ, దినేశ్ చండిమాల్, ఎంజెలో మాథ్యూస్, నిరోశన్ డిక్వెల్లా, లహిరు తిరిమానె/దశున్ శనక, దిల్రువన్ పెరీరా, సురంగ లక్మల్, రంగన హెరాత్, విశ్వ ఫెర్నాండో.