Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కోహ్లి, ధావన్, రాహుల్ విఫలం
- ధావన్ (8) క్లీన్బౌల్డ్
- 11.5 ఓవర్లలో భారత్ 17/3
- శ్రీలంకతో ఈడెన్ టెస్టు తొలి రోజు
ఈడెన్లో సంచలనం, కోహ్లిసేనకు ఊహించని షాక్!. పచ్చిక పిచ్ కోరుకొని మరీ, పేస్కు దాసోహమైన టీమ్ ఇండియా తొలి రోజు ఆటలో శ్రీలంక చేతిలో బందీ అయిపోయింది. లంక సీమర్ సురంగ లక్మల్ ఆరు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండానే భారత్ టాప్ లేపాడు. లక్మల్ పేస్ పదునుకు కెప్టెన్ కోహ్లి (0) సహా ఓపెనర్లు రాహుల్ (0), ధావన్ (8)లు బలయ్యారు. వర్షం, వెలుతురు లేమితో తొలి రోజు 11.5 ఓవర్ల ఆట మాత్రమే జరుగగా, లక్మల్ ప్రదర్శనతో శ్రీలంక ఆధిపత్యం కొనసాగుతోంది.
నవతెలంగాణ-కోల్కత
ఏకపక్షంగా సాగుతుందని అనుకున్న భారత్, శ్రీలంక ఈడెన్ గార్డెన్స్ టెస్టు పోరు రంజుగా మొదలైంది. అండర్డాగ్స్ లంకేయులు బంతితో బూమ్ బూమ్ అనిపించిన వేళ.. ఆతిథ్య టీమ్ ఇండియా అవాక్కయ్యింది. పచ్చికతో కూడిన పిచ్కు శీతల పరిస్థితులు తోడవటంతో సీమర్లు రెచ్చిపోయారు. బ్యాట్స్మెన్ను క్రీజులో స్వేచ్ఛగా ఆడనీయలేదు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన కోహ్లిసేన ఆడిన 11.5 ఓవర్లలోనే ముగ్గురు కీలక బ్యాట్స్మెన్ను కోల్పోయింది. ఓపెనర్లు కెఎల్ రాహుల్ (0), శిఖర్ ధావన్ (8)లకు తోడు కెప్టెన్ విరాట్ కోహ్లి (0) సైతం శ్రీలంక పేస్ బౌలర్ సురంగ లక్మల్ (0/3) ధాటికి విలవిల్లాడాడు. 11.5 ఓవర్లలో 17 పరుగులు చేసిన భారత్ మూడు వికెట్లు కోల్పోయింది. లక్మల్ ఆరు ఓవర్లలో ఒక్క పరుగూ ఇవ్వకుండానే మూడు వికెట్లు కూల్చాడు. తొలి రోజు ఆట నిలిచే సమయానికి టెస్టు స్పెషలిస్ట్లు చటేశ్వర్ పుజారా (8), అజింక్య రహానె (0)లు అజేయంగా క్రీజులో కొనసాగుతున్నారు.
దెబ్బ మీద దెబ్బ : ఆలస్యంగా ఆరంభమైన మ్యాచ్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు వచ్చిన టీమ్ ఇండియాకు శ్రీలంక సీమర్ సురంగ లక్మల్ చుక్కలు చూపించాడు. ఇన్నింగ్స్ తొలి బంతికే ఓపెనర్ కెఎల్ రాహుల్ (0)ను గోల్డెన్ డక్గా వెనక్కి పంపాడు. తొలి బంతినే వికెట్కు ఆఫ్ సైడ్ సంధించిన లక్మల్.. రాహుల్ను వికెట్ల వెనకాల అవుట్ చేశాడు. బలవంతంగా బంతిని ఆడేసిన రాహుల్.. వరుస ఆరు అర్ధ సెంచరీల రికార్డును సున్నాతో ముగించాడు. మరో ఓపెనర్ శిఖర్ ధావన్ (8) గమగె బంతిని బౌండరీకి తరలించి క్రీజులో మెరుగ్గానే కనిపించాడు. కానీ లక్మల్ వేసిన బంతిని డ్రైవ్ చేయబోయి వికెట్ కోల్పోయాడు. కెప్టెన్ విరాట్ కోహ్లి (0) సైతం పరుగుల ఖాతా తెరువకుండానే నిష్క్రమించాడు. 11 బంతులెదుర్కొన్న విరాట్.. లక్మల్ బంతికి వికెట్ల ముందు దొరికిపోయాడు. కోహ్లి రివ్యూకు వెళ్లినా ఫలితం లేకపోయింది. తర్వాత వచ్చిన అజింక్య రహానె (0)తో కలిసి చటేశ్వర్ పుజారా (8) క్రీజులో కొనసాగుతున్నాడు.
సూపర్ లక్మల్ : కోహ్లిసేనపై ఇటీవల అత్యంత దారుణ రికార్డుకు తోడు ఏమాత్రం సానుకూల రికార్డు లేని భారత గడ్డపై ఆడుతున్నప్పుడు సహజంగానే శ్రీలంకకు అవకాశాలు, ఆశలు, అంచనాలు బహు స్వల్పం. కానీ ఇన్నింగ్స్ ఆరంభం కాగానే ఆ అభిప్రాయం మార్చుకునేలా చేశాడు సీమర్ సురంగ లక్మల్. పచ్చిక పిచ్పై, పేసర్లకు అనుకూలించే ఎండ్ నుంచి బంతులేసి అద్భుతం చేశాడు. ఆడిన కొద్ది ఆటలోనే టీమ్ ఇండియాలో కలవరం రేపాడు. లక్మల్ వేసిన 36 బంతులు భారత్ కష్టంగానే ఎదుర్కొన్నది. పుజారా 43 బంతులాడినా, అందులో రెండు బంతుల్లోనే పరుగులు రాబట్టుకున్నాడు. ఓ ఎండ్లో గమగె పరుగులిచ్చినా, లక్మల్ మాత్రం భారత్కు బ్రహ్మపదార్థంగా మిగిలాడు. నిప్పు కణికల్లా బంతులిసిరిన లక్మల్.. ఒక్క పరుగూ ఇవ్వకుండానే తొలి రోజును ముగించాడు. నేడు కూడా పిచ్లో మార్పులు లేకపోవటంతో లక్మల్ నుంచి లంక మరిన్ని అద్భుతాలు ఆశిస్తోంది!.
భారత్ తొలి ఇన్నింగ్స్ : రాహుల్ (సి) డిక్వెల్లా (బి) లక్మల్ 0, శిఖర్ ధావన్ (బి) లక్మల్ 8, చటేశ్వర్ పుజారా బ్యాటింగ్ 8, కోహ్లి (ఎల్బీ) లక్మల్ 0, అజింక్య రహానె బ్యాటింగ్ 0, ఎక్స్ట్రాలు : 01, మొత్తం : (11.5 ఓవర్లలో 3 వికెట్లకు) 17.
వికెట్ల పతనం : 1-0, 2-13, 3-17.
బౌలింగ్ : సురంగ లక్మల్ 6-6-0-3, లహిరు గమగె 5.5-1-16-0.
పచ్చిక పిచ్పై ఆడటంపై సంతోషమే. జట్టుగా సులువైన పరిస్థితుల్లోనే ఆడాలని కోరుకోం. ఇలాంటి సవాళ్లను కోరుకుంటాం, ఎదుర్కొనేందుకు ఆటగాళ్లందరూ సిద్ధంగా ఉన్నారు. జట్టుగా మెరుగవ్వాలని కోరుకుంటున్నాం. నిరుడు కివీస్తో టెస్టుకూ ఇదే పిచ్. మేం బాగానే ఆడాం. సవాల్ను స్వీకరించేందుకు సిద్ధంగా ఉన్నాం' - సంజయ్ బంగర్, భారత బ్యాటింగ్ కోచ్