Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వరల్డ్ నెం.89 చేతిలో ఓటమి
- క్వార్టర్స్లోనే ముగిసిన పోరాటం
నవతెలంగాణ-ఫుజౌ: ప్రపంచ అగ్రశ్రేణి బ్యాడ్మింటన్ క్రీడాకారిణీ, సిల్వర్ స్టార్ పి.వి సింధుకు చైనా ఓపెన్లో షాక్. టైటిల్ వేటలో సాఫీగా వెళుతున్న సింధుకు ఊహించని చుక్కెదురు. శుక్రవారం నాటి క్వార్టర్ఫైనల్స్ మ్యాచ్లో అనామక చైనా అమ్మాయి చేతిలో సింధు కంగుతిన్నది. రెండు గేముల మ్యాచ్లోనే చైనా చిన్నది గావో ఫాంగ్జీ వరల్డ్ నెం.2ను ఓడించింది. ఆకట్టుకునే ప్రదర్శన చేసిన గావో ఫాంగ్జీ 21-11, 21-10తో సింధును అలవోకగా ఓడించి, సెమీఫైనల్లోకి ప్రవేశించింది. అర్హత మ్యాచుల్లో మెరిసి, ప్రధాన టోర్నీకి వచ్చిన ఫాంగ్జీ తొలి రౌండ్లో నొజొమి ఒకుహర (జపాన్) గాయంతో తప్పుకోవటంతో ప్రీ క్వార్టర్స్కు చేరుకున్నది. ప్రీ క్వార్టర్స్లో కొరియా షట్లర్ జాంగ్ మీ లీని ఓడించిన ఫాంగ్జీ.. సెమీస్ దారిలో ఏకంగా సింధునే ఓడించి సంచలనం సృష్టించింది. 37 నిమిషాల మ్యాచ్లో ఫాంగ్జీ వేగవంతమైన స్ట్రోక్స్కు సింధు తగిన రీతిలో బదులివ్వలేకపోయింది. 19 ఏండ్ల ఫాంగ్జీ పదునైన స్మాష్లకు సైతం సింధు వద్ద సమాధానం కరువైంది. తొలి గేమ్లో 14-11తో ఉన్న దశలో వరుసగా ఏడు పాయింట్లు కొల్లగొట్టిన ఫాంగ్జీ 1-0 ఆధిక్యం సాధించింది. రెండో గేమ్లోనూ దూకుడుగా ఆడి 7-2తో ముందంజ వేసింది. ఈ దశలో సింధు పుంజుకుని 6-10తో అంతరాన్ని తగ్గించింది. కానీ ఫాంగ్జీ వరుస పాయింట్లతో 16-7కు దూసుకెళ్లింది. ఇక్కడా మళ్లీ వరుసగా ఐదు పాయింట్లు సాధించిన ఫాంగ్జీ 2-0తో క్వార్టర్స్లో ఘన విజయం సాధించింది. నేడు జరిగే సెమీఫైనల్స్ పోరులో ఒలింపిక్ చాంపియన్ కరొలినా మారిన్ (స్పెయిన్)తో ఫాంగ్జీ తలపడనున్నది. పి.వి సింధుతో తొలిసారి ముఖాముఖి తలపడిన ఫాంగ్జీ తొలి ప్రయత్నంలోనే స్టార్ షట్లర్పై పైచేయి సాధించి, అందరి చూపు తనవైపుకు తిప్పుకున్నది. క్వార్టర్స్లో సింధు నిష్క్రణమతో చైనా ఓపెన్లో భారత్ పోరు ముగిసింది. ప్రీ క్వార్టర్స్లో సైనా నెహ్వాల్, హెచ్.ఎస్ ప్రణరు సైతం ఓటమిపాలైన సంగతి తెలిసిందే.