Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- హాంగ్కాంగ్ ఓపెన్ ప్రీ క్వార్టర్స్్లో ప్రవేశం
- ప్రణయ్ ముందంజ
- పోరాడి ఓడిన కశ్యప్
- పొన్నప్ప జోడీకి నిరాశ
కౌలూన్ : హైదరాబాదీ స్టార్ షట్లర్లు పి.వి సింధు, సైనా నెహ్వాల్లు హాంగ్కాంగ్ ఓపెన్లో శుభారంభం చేశారు. తొలి రౌండ్లో ఒలింపిక్ సిల్వర్ స్టార్, తెలుగు తేజం సింధు ఆతిథ్య క్వాలిఫైయర్ను 21-18, 21-10తో ఓడించి ప్రీ క్వార్టర్స్లోకి దూసుకెళ్లింది. ఇటీవలి నేషనల్ చాంపియన్ సైనా డెన్మార్క్ షట్లర్ మెట్టె పౌల్సెన్పై 21-19, 23-21తో గెలుపొంది ప్రీ క్వార్టర్స్ బెర్త్ ఖాయం చేసుకున్నది. సూపర్ టైటిళ్ల వేటగాడు కిదాంబి శ్రీకాంత్ లేని తరుణంలో పురుషుల సింగిల్స్లో హెచ్.ఎస్ ప్రణరు భారత్ ఆశలను సజీవంగా నిలిపాడు. సహచర ఆటగాళ్లందరూ నిష్క్రమించినా.. హోరాహోరీ పోరులో అజేయంగా నిలిచి ప్రీ క్వార్టర్లో కాలుమోపాడు. అర్హత మ్యాచుల్లో వరుస విజయాలతో ప్రధాన టోర్నీలో కాలుమోపిన పారుపల్లి కశ్యప్ తొలి రౌండ్లో లీ డాంగ్క్యూన్ చేతిలో 15-21, 21-9, 22-20తో పోరాడి ఓడాడు. బి సాయి ప్రణీత్ బలమైన ప్రత్యర్థి చేతిలో ఓడాడు. రెండో సీడ్ సన్ వాన్హో (కొరియా) 21-8, 21-16తో సాయి ప్రణీత్ టైటిల్ ఆశలపై నీళ్లు చల్లాడు. టామీ సుగియార్టో (ఇండోనేషియా) 21-15, 21లి8తో సౌరభ్ వర్మ ను ఇంటి ముఖం పట్టించాడు.
చెమటోడ్చిన సైనా : ప్రపంచ 44వ ర్యాంకర్ పౌల్సెన్ ప్రీ క్వార్టర్ దారిలో సైనాకు గట్టి పోటీనిచ్చింది. 11వ ర్యాంకులో ఉన్న సైనా రెండు సెట్లలోనే పోరు ముగించినా డెన్మార్క్ చిన్నది ఏమాత్రం తగ్గలేదు. 3-1 ఆధిక్యంతో సైనా తొలి సెట్ను ఆరంభించగా 3-3తో స్కోరు సమం చేసిన పౌల్సెన్ 8-6తో ఆధిక్యం అందుకుని 16-14వరకు ఆధిపత్యాన్ని చలాయించింది. ఈ సమయంలో ఒత్తిడికి లోను కాకుండా ఆడిన సైనా 17-17తో స్కోరు సమం చేయటమే గాక వరుసగా నాల్గు పాయింట్లు సాధించి 21-19తో తొలి సెట్ నెగ్గింది. ఇక రెండో సెట్లోనూ ఇద్దరూ నువ్వా నేనా అన్నట్టుగా తలపడటంతో పలుమార్లు ఆధిక్యం చేతులు మారుతూ ఆట రక్తి కట్టింది. 20-21తో వెనుకబడిన సైనా మరోసారి మూడు వరుస పాయింట్లు సాధించి 23-21తో రెండో సెట్నూ గెల్చుకుంది. క్వార్టర్స్లో స్థానం కోసం చైనా యువ సంచలనం ఎనిమిదో సీడ్ చెన్ యుఫెరుతో అమీతుమీ తేల్చుకోనున్నది. మరో పక్క క్వాలిఫైయర్తో తొలి పోరులో సింధు ఏమంత శ్రమ పడకుండానే గెలిచింది. తొలి సెట్లో ల్యూంగ్ యుట్యీ (హాంగ్కాంగ్) కాస్త పోటీనిచ్చినా రెండో సీడ్ సింధు అనుభవం ముందు తేలిపోయింది. రెండో సెట్లో తొలుత నిదానంగా ఆడిన సింధు ఆపై రెచ్చిపోయింది. 11 పాయింట్ల తేడాతో సెట్ గెల్చిన సింధు క్వార్టర్స్ బెర్త్ కోసం అయా ఓహొరి (జపాన్)తో తలపడనున్నది. మహిళల డబుల్స్లో అశ్విని పొన్నప్ప, ఎన్ సిక్కిరెడ్డిల జోడీకి ఆదిలోనే చుక్కెదురైంది. చైనా జంట హువాంగ్ డోంగిపింగ్, లీ వెన్మెరుల చేతిలో 11-21, 21-19, 19-21తో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.