Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- విజయంపై కన్నేసిన భారత్
- గెలవాలన్న తపనలో శ్రీలంక
మూడు టెస్టుల సిరీస్లో తొలి టెస్టు డ్రా అవటంతో మిగిలిన రెండు టెస్టులు గెలిస్తేనే సిరీస్ సొంతమవుతుంది. ఈడెన్లో పచ్చికను త్వరగా అలవాటు చేసుకోలేక పోయిన కోహ్లి సేన, ఆపై పుంజుకున్నా.. జామ్తాలో పచ్చిక పిచ్పై ఎలాంటి ప్రదర్శన చేయనున్నారనేది ఆసక్తికరం. ఆరంభ పోరులో పూర్తిగా పేస్ బలంతో గెలుపు అంచుల దాకా చేరిన టీమ్ ఇండియా.. రెండో టెస్టు మ్యాచ్లో పేసర్లకు తోడు స్పిన్నర్లనూ రంగంలోకి దించే అవకాశం ఉన్నది. ఓపెనర్లు శుభారంభాన్నిస్తే లంకను చిత్తు చేయటం పెద్ద సమస్యేమీ కాదు. దక్షిణాఫ్రికా పర్యటన నేపథ్యంలో కోరిమరీ పచ్చిక పిచ్లపై ఆడనున్న భారత్ సఫారీ పరిస్థితులను ఆకళింపు చేసుకోవటంలో సఫలం కావాలనే పట్టుదలతోకనిపిస్తోంది.
నవతెలంగాణ - నాగ్పూర్
వరుణుడు కరుణించకపోవటంతో తొలి టెస్టు ఆదిలోనే భారత్ అడుగులు తడబడ్డాయి. అయితేనేం రెండో ఇన్నింగ్స్లో కోహ్లి సేన ప్రతాపం చూపించింది. సూర్యుడి చలవతో లంకేయులు ఓటమి తప్పించుకున్నారు. నేటి నుంచి నాగ్పూర్లో జరగనున్న రెండో టెస్టులో టీమ్ ఇండియా స్వల్ప మార్పులతో బరిలోకి దిగనున్నది. తొలి టెస్టులో జరిగిన పొరపాట్లకు జామ్తాలో ఏమాత్రం తావివ్వకుండా ఆధిపత్యాన్ని కొనసాగించాలని చూస్తున్నది. దక్షణాఫ్రికా పర్యటనను దృష్టిలో ఉంచుకుని పేసర్లను సానబెడుతున్న టీమ్ ఇండియా చీఫ్ కోచ్ రవిశాస్త్రి నాగ్పూర్లోనూ పచ్చిక పిచ్నే కోరుకున్నారు. అనుకున్నట్టుగానే విదర్భ క్రికెట్ అసోసియేషన్ పచ్చటి తళుకులీనుతుంది. తొలి టెస్టు రెండో ఇన్నింగ్స్లో రాణించిన భారత పేసర్లు లంకేయులను ఓటమి అంచుల్లోకి నెట్టగలిగారు. అయితే నాగ్పూర్ పిచ్లోనూ అలాంటి ప్రదర్శన కనబరిస్తే భారత్క విజయం తథ్యం.
బ్యాట్స్మెన్ నిలకడగా రాణిస్తారా..: ఈడెన్ టెస్టు తొలి ఇనింగ్స్లో టెస్టు స్పెషలిస్టు చటేశ్వర్ పుజారా మినహా కోహ్లి సహా బ్యాట్స్మెన్ అంతా చేతులెత్తేశారు. లోయర్ ఆర్డర్ ఫర్వాలేదనిపించినా ఆశించిన మేర ఆడలేదు. రెండో ఇన్నింగ్స్లో లోయర్ ఆర్డర్ పూర్తిగా విఫలం కాగా.. టాప్, మిడిల్ ఆర్డర్ మెరుపులతో భారత్ విజయావ కాశాలు మెరుగయ్యాయి. నాగ్పూర్ టెస్టులో ఆ పరిస్థితిన భారత్ అధిగమిస్తే గెలుపు గురించి ధీమాగా ఉండొచ్చు. ఇప్పటికే వరుస సిరీస్ విజయాలతో దూకుడు మీదున్న కోహ్లి సేన ఒకరు కాకపోతే మరొకరు అన్న చందంగా నెట్టుకొస్తుంది. అద్భుతమైన ఫామ్తో అవసరమైన మేర ఫలితాలు సాధిస్తున్నా.. నిలకడ లేమి భారత బ్యాటింగ్ బృందానికి గడ్డు సమస్యగా మారింది. విరామం ఎరుగకుండా క్రికెట్ ఆడుతున్న కోహ్లి ఈడెన్లో చేసిన శతకం విన్యాసం జామ్తాలోనూ ప్రదర్శిస్తే బాగుంటుంది. టెస్టు స్పెషలిస్టు చటేశ్వర్ పుజారా నమ్మదగిన ఆటగాడు. ఇక ఓపెనర్ల విషయానికొస్తే గబ్బర్ వ్యక్తిగత కారణాలతో రెండో టెస్టులో లేకపోవటంతో మురళీ విజరుకి భారత స్కోరు ఖాతా తెరిచే అవకాశం దక్కింది. మురళీ తనదైన టెక్నిక్తో లంక బౌలర్ల ఆట కట్టిస్తాడనటంలో సందేహం లేదు. అజింక రహానె తొలి టెస్టులో విఫలమైనా రెండో టెస్టులో రాణించాలని చూస్తున్నాడు.
బౌలింగ్కు ఢోకా లేదు: భారత బౌలింగ్ బృందంలో అత్యద్భుత ఫలితాలు సాధిస్తున్న పేసర్ భువనేశ్వర్ కుమార్ నేటి టెస్టుకు అందుబాటులో లేకపోయినా.. బంతితో మెరపులకు జట్టు సిద్ధంగా ఉంది. తొలి టెస్టుకు తుది జట్టులో చోటు దక్కని ఇశాంత్ శర్మకు రెండో టెస్టులో సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. ఇప్పటికే 77 టెస్టులాడిన అనుభవం ఇశాంత్ సొంతం. రంజీలో ఇప్పటికే 20 వికెట్లు కూల్చిన మంచి ఇశాంత్ ఫామ్లో ఉన్నాడు. ఈడెన్లో అంతగా ప్రభావం చూపలేకపోయిన జడేజా రెండో టెస్టులో ఆడేది సంశయమే. భువీకి తోడుగా లంకను కోల్కతలో దెబ్బ తీసిన సీమర్ మహ్మద్ షమి నాగ్పూర్లో కీలకం కానున్నాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగ్ యాక్షన్లో మరింత పదును చూపే అవకాశమున్నది. ఆల్ రౌండర్ విజరు శంకర్ బ్యాట్తో రాణిస్తూనే మీడియం పేస్ బంతులేయటంలో దిట్ట. పేస్ విభాగంలో అతను అదనపు బలం కానున్నాడు. అయితే నాగ్పూర్లో పేసర్ల దాడికి స్పిన్నర్లు సైతం తోడయ్యే అవకాశం ఉన్నది. చైనామన్ బౌలర్ కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ స్పిన్ భాద్యతలు మోయనున్నారు.
లంక పోటీనిస్తుందా..: తొలి టెస్టు ఆరంభంలో లంకకు వరుణుడు మేలు చేయగా చివర్లో కాంతి లేమితో సూర్యుడు ఆదకున్నాడు. స్వదేశంలోనే భారత్ చేతిలో ఘోరపరాజయం చవి చూసిన లంకేయులు స్వల్ప విరామంలో పాక్ను 2-0తో ఓడించిన ధీమాతో మరోసారి భారత్తో తలపడేందుకు సిద్ధమయ్యారు. కోల్కతలో ఓటమి తప్పించుకుని మ్యాచ్ డ్రా చేసుకున్నా.. నాగ్పూర్లో లంకేయుల అసలు సామర్థ్యం బయటికొస్తుందనటంలో సందేహం అక్కర్లేదు. లహిరు తిరిమానె, ఎంజెలో మాథ్యూస్ తొలి ఇన్నింగ్స్లో అర్థ శతకాలు నమోదు చేసినా.. ఎండకాసిన తుది రోజు భారత పేసర్లకు తలవంచారు. ఓపెనర్లు వరుసగా విఫలం అవటం లంక శిబిరంలో ఆత్మ స్థైర్యాన్ని దెబ్బకొడుతున్నది. బౌలింగ్ విషయానికొస్తే సురంగ లక్మల్ , దశున్ శనక కోహ్లి సేనను బలహీన పరిచే ప్రయత్నంలో సఫలమయిన సంతోషంలో ఉన్నారు. ఫాస్ట్ బౌలర్ గమగె రాణించకపోవటం లంకేయులకు నిరాశ కలిగించే అంశం రెండో టెస్టులో గమగె మెరవాలని చండిమాల్ సారథ్యంలోని జట్టు భావిస్తోంది.. నాగ్పూర్ మైదానంలో స్పిన్నర్లు మెరిసే అవకాశముండటంతో రంగన హెరాత్ ఏ మేరకు రాణిస్తాడో చూడాలి. బ్యాటింగ్లో పస లేకపోయినా విదర్భ స్టేడియంలో బంతితో లంక మెరిస్త్తే భారత్కు పోటీనివ్వగలదు.
తుది జట్లు (అంచనా)
భారత్ : కెఎల్ రాహుల్, మురళీ విజరు, చటేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, అజింక్య రహానె, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్ అశ్విన్/రవీంద్ర జడేజా, విజరు శంకర్, మహ్మద్ షమి, ఇశాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్.
శ్రీలంక : సమరవిక్రమ, కరుణరత్నె, లహిరు తిరిమానె, మాథ్యూస్, దినేశ్ చండిమాల్, దశున్ శనక/లక్షన్ సందకన్, డిక్వెల్లా, దిల్రువన్ పెరీరా, రంగన హెరాత్, గమగె/విశ్వ ఫెర్నాండో, సురంగ లక్మల్.
పిచ్/ వాతావరణం
పిచ్ పచ్చికతోనే ఉన్నా ఈడెన్లో మాదిరి పేస్కు పూర్తిగా అనుకూలించకపోవచ్చు. ఐదు రోజులు వరుణుడి ఊసే లేదు. ఓ మోస్తరు ఎండ కాస్తుందని వాతావరణ శాఖ సమాచారం. మొత్తంగా ఈడెన్ పరిస్థితులకు భిన్నమైన వాతావరణం నాగ్పూర్లో రెండో టెస్టుకు ఎదురు చూస్తుంది.
అవసరానికి అనుగుణంగానే 15 మందితో కూడిన జట్టుగా సిద్ధమయ్యాం. ఇద్దరు కీలక ఆటగాళ్లు లేకపోయినా రిజర్వ్ ప్లేయర్లు రాణించగలరు. మాకు ఆ చింత లేదు.
- విరాట్ కోహ్లి
నాకు తెలిసినంత వరకు నాగ్పూర్ మంచి టెస్టు వికెట్. ఆరంభంలో బ్యాట్స్మెన్కు అనుకూలించినా, చివరకు బౌలర్ల సహకరిస్తుంది.
- దినేశ్ చండిమాల్