Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బింగ్జియావోపై 2-1తో గెలుపు
- అక్సెల్సన్ చేతిలో 0-2తో ఓడిన కిదాంబి
- ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్
దుబాయ్ : ఒలింపిక్ సిల్వర్ స్టార్, తెలుగు తేజం పి.వి సింధు ప్రపంచ సూపర్ సిరీస్ ఫైనల్స్లో శుభారంభం చేసింది. గ్రూప్ దశ తొలి మ్యాచ్లో చైనా చిన్నది హీ బింగ్జియావోను 2-1తో ఓడించింది. పురుషుల సింగిల్స్లో కిదాంబి తొలి పోరులో తడబడ్డాడు. వరల్డ్ నెంబర్ వన్ విక్టర్ అక్సెల్సన్ చేతిలో 13-21, 17-21తో పోరాడి ఓడాడు. ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన సింధు 14 నిమిషాల్లోనే తొలి సెట్ ముగించింది. ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశమివ్వకుండా 6-4 నుంచి 20-11కి దూసుకెళ్లి సెట్ వశం చేసుకున్నది. రెండో సెట్లో 0-4తో తొలుత వెనుకబడినా 7-7, 11-11తో సమంగా నిలిచింది. కానీ సింధు తప్పిదాలతో లాభపడిన చైనా యువతి 21-16తో రెండో సెట్ నెగ్గి పోటీని మూడో సెట్కు తీసుకెళ్లింది. నిర్ణాయక సెట్లో 5-5, 6-6తో పోరు హోరాహోరీగా సాగేలా అనిపించినా, సింధు బలమైన స్మాష్లకు బింగ్జియావో దగ్గర సమాధానం కరవైంది. 14-10, 17-15, 19-16లతో బింగ్జియావో సైతం పాయింట్లు నెగ్గినా సింధుకు పోటీనివ్వలేదు. 21-18తో నిర్ణాయక సెట్ నెగ్గి తొలి పోరు గెల్చిన సింధు గ్రూప్లో రెండో స్థానంలో కొనసాగుతున్నది. గాయాల నుంచి కోలుకొని నేరుగా సూపర్ సిరీస్ ఫైనల్స్ బరిలో దిగిన కిదాంబి ఆశించిన మేర రాణించలేదు. తొలి గేమ్లో ఎనిమిదో నిమిషానికే 9-4 ఆధిక్యంతో నిలిచిన శ్రీకాంత్ ఆపై అదే దూకుడు కొనసాగించలేదు. 11-11 వద్ద స్కోరు సమం చేసిన డెన్మార్క్ ఆటగాడికి 13-21తో సెట్ కోల్పోయాడు. రెండో సెట్లో పుంజుకున్న శ్రీకాంత్ 6-7, 12-13తో అక్సెల్సన్కు పోటీనిచ్చినా, ఆఖర్లో తడబడి 17-21తో రెండో సెట్నూ కోల్పోయాడు. సింధు నేటి పోరులో సయాక సటో (జపాన్)తో ఆడనుండగా, కిదాంబి చో తిన్ చెన్ (చైనీస్ తైపీ)తో తలపడనున్నాడు.