Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- మూడో డబుల్ సెంచరీ బాదిన రోహిత్ శర్మ
- రాణించిన శ్రేయాష్ అయ్యర్, ధావన్
- రెండో వన్డేలో భారత్ ఘన విజయం
- 1-1తో వన్డే సిరీస్ సమం
- రోహిత్ శర్మ 208
బౌండరీలు పెద్దవి కదా అని షార్ట్ పిచ్ బంతులు సంధించారు. ఫలితం దక్కలేదు. వైడ్ యార్కర్లతో నిలువరించే ప్రయత్నం చేశారు. అదీ ఫలించలేదు. స్ట్రయిట్ యార్కర్లు లాభం లేదు. లో ఫుల్ టాస్లతో ప్రయోగం చేశారు. అయినా ఏం లాభం.. బంతి మిడ్ వికెట్లోనో, స్క్వేర్ లెగ్లోనో పడిపోతుంది. ఎందుకంటే, క్రీజులో కుదురుకున్నది 'హిట్మ్యాన్' రోహిత్ శర్మ. ఆరంభంలో ఆచితూచి, మిడిల్లో నెమ్మదిగా ఆడే రోహిత్.. సహజశైలిలో ఆఖర్లో నిర్దాక్షిణ్య దండయాత్ర చేశాడు. సిక్సర్లతో ప్రకంపనలు సృష్టించిన రోహిత్.. వన్డే క్రికెట్ చరిత్రలో రికార్డు స్థాయిలో మూడో డబుల్ సెంచరీ నమోదు చేశాడు. సిక్సర్ బాదటం సింగిల్ తీయటం కంటే సులువా అన్నట్టు లంక బౌలర్లను ఉతికారేసిన రోహిత్ శర్మ 153 బంతుల్లోనే అజేయంగా 208 పరుగులు కొట్టాడు. డజను సిక్సర్లు సహా 13 ఫోర్లు బాదిన రోహిత్ మొహాలీలో భారత్కు ఏకపక్ష విజయాన్ని అందించాడు. శిఖర్ ధావన్ (68), శ్రేయాష్ అయ్యర్ (88) రాణించారు. రోహిత్ విధ్వసంతో తొలుత భారత్ 392 పరుగుల భారీ స్కోరు చేయగా, శ్రీలంక 251/8కే పరిమితమైంది. టీమ్ ఇండియా 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది.
నవతెలంగాణ-మొహాలీ
రోహిత్ శర్మ విధ్వంసం ఎలాగుంటుందో శ్రీలంకకు బాగా తెలుసు. ఎందుకంటే గతంలోనే ఈడెన్ వేదికగా లంకపై అతడు 264 పరుగులతో దండయాత్ర చేశాడు. కొనసాగింపుగా అన్నట్టు మొహాలీలో విశ్వరూపం చూపించిన రోహిత్ శర్మ రికార్డు స్థాయిలో మూడో డబుల్ సెంచరీ బాదాడు. వన్డే క్రికెట్లో మరే ఆటగాడికీ ఈ ఘనత సాధ్యం కాలేదు. రోహిత్ శర్మ (208 నాటౌట్, 153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లు) ఊచకోతకు తోడు శ్రేయాష్ అయ్యర్ (88, 70 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లు), శిఖర్ ధావన్ (68, 67 బంతుల్లో 9 ఫోర్లు) రాణించటంతో తొలుత టీమ్ ఇండియా 392 పరుగుల భారీ స్కోరు సాధించింది. భారీ ఛేదనలో ఎంజెలో మాథ్యూస్ (111 నాటౌట్, 132 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్స్లు) ఇన్నింగ్స్ అలంకారప్రాయంగానే మిగిలంది. నిర్ణీత ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయిన శ్రీలంక 251 పరుగులు చేసింది. దీంతో 141 పరుగుల తేడాతో ఘన విజయం సాధించిన టీమ్ ఇండియా వన్డే సిరీస్ను 1-1తో సమం చేసింది. సిరీస్ నిర్ణయాత్మక మూడో వన్డే ఆదివారం విశాఖపట్నం వేదికగా జరుగనున్నది. అజేయ ద్వి శతకంతో చెలరేగిన రోహిత్ శర్మ ' మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు అందుకున్నాడు.
కళాత్మక విధ్వంసం : టాస్ నెగ్గి మళ్లీ ఫీల్డింగ్ ఎంచుకున్న శ్రీలంకకు అప్పుడు తెలియదు, రోహిత్ శర్మ ఊచకోతకు బలైపోతామని!. ఎప్పట్లాగే సహచర ఓపెనర్ శిఖర్ ధావన్ (68) ఆరంభంలో దూకుడుగా ఆడగా మరో ఎండ్లో రోహిత్ శర్మ ఆచితూచి ఆడాడు. తొలి అర్ధ సెంచరీకి రోహిత్ 65 బంతులు తీసుకున్నాడు. దీంతో రోహిత్ నుంచి మరో విధ్వంసక ఇన్నింగ్స్ రాబోతున్నదా? అని వ్యాఖ్యాతలు చర్చ మొదలెట్టేశారు. ప్రత్యర్థి బౌలర్లను గౌరవిస్తూనే పరుగులు రాబట్టిన రోహిత్.. 9 ఫోర్లు, ఓ సిక్స్తో శతకం సాధించాడు. అందుకు అతడు తీసుకున్న బంతులు 115. కానీ 43వ ఓవర్లో గానీ రోహిత్ ఊచకోత మొదలు కాలేదు. ప్రదీప్ వేసిన ఆ ఓవర్లో వరుసగా నాల్గు సిక్సర్లు బాదిన రోహిత్.. ఉగ్రరూపం దాల్చాడు. పెరీరా బౌలింగ్లో మరో నాల్గు సిక్సర్లు బాదిన రోహిత్.. 116-208కు చేరుకునేందుకు కేవలం 27 బంతులే ఆడాడు. ఈ మధ్యలో రోహిత్ ఏకంగా 11 సిక్సర్లు, మూడు ఫోర్లు బాదాడు. ఆఖరి ఓవర్లో రెండు సిక్సర్లు కొట్టిన రోహిత్ రెండు పరుగులు తీసి ద్వి శతకం పూర్తి చేసుకున్నాడు. రోహిత్ ధాటికి లంక బౌలర్ ప్రదీప్ 106 పరుగులు సమర్పించుకున్నాడు!. తొలుత శిఖర్, తర్వాత శ్రేయాష్ అయ్యర్(88)లు రోహిత్కు చక్కగా సహకరించారు. ముఖ్యంగా శ్రేయాష్ సహజశైలిలో రెచ్చిపోయాడు. రోహిత్ నెమ్మదించిన మిడిల్ ఓవర్లలో రన్రేట్ తగ్గకుండా విరుచుకుపడ్డాడు. అయ్యర్ సైతం రెండు సిక్సర్లు, తొమ్మిది ఫోర్లు బాదాడు. ఆఖర్లో ధోని (7), పాండ్య (8)లు రోహిత్ తోడుగా ఆడారు. వరుసగా రెండో వన్డేలో టీమ్ ఇండియా కొత్త ఆటగాడికి చోటిచ్చింది. యువ స్పిన్నర్ వాషింగ్టన్ సుందర్ మొహాలీలో అరంగ్రేటం చేశాడు.
మాథ్యూస్ మెరిసినా.. : భారీ ఛేదనలో శ్రీలంక ఓటమి ముందే ఖాయమైంది!. 62/3తో ముందే టాప్ ఆర్డర్ను కోల్పోయిన లంకేయులు క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోయారు. స్పిన్నర్ చాహల్ తొలి స్పెల్లో మూడు వికెట్లు కూల్చగా, బుమ్రా, వాషింగ్టన్, పాండ్య, భువీలు వికెట్ల వేటలో కలిసొచ్చారు. దీంతో 207/8తో శ్రీలంక ఆలౌట్ దిశగా పయనించింది. ఓటమి ఖాయమైన స్థితిలో మాథ్యూస్ (111) సెంచరీకి విలువ లేకుండా పోయింది.
భారత్ ఇన్నింగ్స్ : రోహిత్ శర్మ నాటౌట్ 208, శిఖర్ ధావన్ (సి) తిరిమానె (బి) పతిరణ 68, శ్రేయాష్ అయ్యర్ (సి) డిసిల్వ (బి) పెరీరా 88, ఎం.ఎస్ ధోని (ఎల్బీ) పెరీరా 7, హార్దిక్ పాండ్య (సి) తిరిమానె (బి) పెరీరా 8, ఎక్స్ట్రాలు : 13, మొత్తం : (50 ఓవర్లలో 4 వికెట్లకు) 392.
వికెట్ల పతనం : 1-115, 2-328, 3-354, 4-392.
బౌలింగ్ : మాథ్యూస్ 4-1-9-0, లక్మల్ 8-0-71-0, పెరీరా 8-0-80-3, ప్రదీప్ 10-0-106-0, అఖిల ధనంజయ 10-0-51-0, పతిరణ 9-0-63-1, గుణరత్నె 1-0-10-0.
శ్రీలంక ఇన్నింగ్స్ : గుణతిలక (సి) ధోని (బి) బుమ్రా 16, ఉపుల్ తరంగ (సి) కార్తీక్ (బి) పాండ్య 7, తిరిమానె (బి) వాషింగ్టన్ సుందర్ 21, మాథ్యూస్ నాటౌట్ 111., డిక్వెల్లా (సి) వాషింగ్టన్ సుందర్ (బి) చాహల్ 22, గుణరత్నె (స్టంప్డ్) ధోని (బి) చాహల్ 34, తిశార పెరీరా (సి) ధోని (బి) చాహల్ 5, పతిరణ (సి) ధావన్ (బి) భువనేశ్వర్ 2, అఖిల ధనంజయ (సి) రోహిత్ (బి) బుమ్రా 11, సురంగ లక్మల్ నాటౌట్ 11, ఎక్స్ట్రాలు : 11, మొత్తం : (50 ఓవర్లలో 8 వికెట్లకు) 251.
వికెట్ల పతనం : 1-15, 2-30, 3-62, 4-115, 5-159, 6-166, 7-180, 8-207.
బౌలింగ్ : భువనేశ్వర్ 9-0-40-1, హార్దిక్ పాండ్య 10-0-39-1, బుమ్రా 10-0-43-2, వాషింగ్టన్ సుందర్ 10-0-65-1, యుజ్వెంద్ర చాహల్ 10-0-60-3, శ్రేయాష్ అయ్యర్ 1-0-2-0.
1
వన్డే క్రికెట్ చరిత్రలో అత్యధిక డబుల్ సెంచరీలు సాధించిన ఆటగాడు రోహిత్ శర్మ. ఓవరాల్గా సచిన్, సెహ్వాగ్, గేల్, గప్టిల్లు ఒక్కో ద్వి శతకం చేయగా.. రోహిత్ ఒక్కడే మూడుసార్లు ద్వి శతకం బాదాడు.
36
రెండో సెంచరీ (101-200 రన్స్) చేసేందుకు రోహిత్ శర్మ ఆడిన బంతులు 36. 11 సిక్సర్లు, మూడు ఫోర్లతో రోహిత్ ఆఖర్లో విశ్వరూపమే చూపించాడు. తొలి సెంచరీని రోహిత్ 115 బంతుల్లో అందుకున్నాడు.
100
వన్డే క్రికెట్లో టీమ్ ఇండియా 300 పైచిలుకు పరుగులు చేయటం ఇది వందోసారి. ఆస్ట్రేలియా (96)తో తర్వాతి స్థానంలో ఉంది. వరల్డ్ క్రికెట్లో టాప్ జట్లలో అందరి కంటే ఆఖరున 300 పరుగులు చేసిన జట్టు భారత్ (1996). కానీ ఇప్పుడు అందరికంటే ఎక్కువ సార్లు 300 బాదిన జట్టుగా కొనసాగుతోంది.
364
భారత టాప్-3 బ్యాట్స్మెన్ చేసిన పరుగులు. రోహిత్ 208, అయ్యర్ 88, ధావన్ 68. వరల్డ్ క్రికెట్లో ఇది మూడో అత్యధికం. 1999లో హైదరాబాద్ వన్డేలో న్యూజిలాండ్పై టీమ్ ఇండియా టాప్-3 ఆటగాళ్లు 343 కొట్టారు. ఆ రికార్డు మొహాలీలో బద్దలైంది.
3
ఓ ఏడాదిలో ఆరు, అంతకంటే ఎక్కువ వన్డే సెంచరీలు చేసిన మూడో భారత బ్యాట్స్మన్ రోహిత్ శర్మ. గంగూలీ (2000), సచిన్ (1996)లో ఆరు సెంచరీలు చేయగా, సచిన్ టెండూల్కర్ 1998లో ఏకంగా తొమ్మిది శతకాలు సాధించాడు.
వావ్.. హిట్మ్యాన్
ద్వి శతక మార్గదర్శి!. నీ బ్యాటింగ్ చూడటం ఎప్పుడూ వినోదమే రోహిత్' - సచిన్ టెండూల్కర్
హిట్మ్యాన్, అద్భుత ఇన్నింగ్స్. కాస్త నమ్మశక్యం కానిది. మూడో డబుల్ సెంచరీ బాదిన నీకు అభినందనలు. ఏడు వన్డే డబుల్స్లో మూడు నీవే. అందుకో వందనం' - వీవీఎస్ లక్ష్మణ్
వావ్ రోహిత్. రెండో సెంచరీకి కేవలం 35 బంతులే. నిన్ను చూసి గర్వపడుతున్నా రోహిత్ శర్మ' - వీరెంద్ర సెహ్వాగ్